Thursday, December 23, 2010

సిత్రాలు సూడరో....

కుడ్య చిత్రాలు అంటే గోడలనే కాన్వాస్ గా చేసుకొని వేసే చిత్రాలు -మనకి కొత్తేం కాదు.  ప్రపంచదేశాలలో మానవ నాగరికత వికసించిన  తొలి నాళ్ళలోనే  ఆనాటి మానవసమాజం అనుభవించిన విషయాలన్నీ బొమ్మల రూపంలో గుహలలో గోడలమీద చిత్రాలుగా అప్పటి మానవులు చిత్రించారని చరిత్ర చెప్తోంది. ఆనాటి మానవసమాజపు విశేషాలు తెలుసుకోవడానికి అవి ఆధారాలుగా నిలిచాయి కూడా.
 భారతదేశంలో క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవిగా చెప్పుకొనే అజంతా గుహలలో ఆనాటి కళాకారులు చిత్రించిన చిత్రాలు నేటికీ సజీవంగా రూపుకడుతూ కనువిందు చేస్తాయి. అవన్నీ కుడ్య చిత్రాలే.
అజంతా గుహల్లో కుడ్యచిత్రాలన్నీ చాలావరకు బుద్ధదేవుని జీవిత విశేషాలలను తెలియచేస్తూ చిత్రించినవే. గుహల పైకప్పుల పైన, పక్క గోడలపైన రంగులతో చిత్రించిన ఈ బొమ్మలు  కాలగతిలో కొంత శిథిలమైనా ఈనాటికీ  మనల్ని సంభ్రమ పరుస్తాయి.





ఇలా చిత్రాలతో గోడలను అలంకరించడం అనే కళ మనకు అంత పాతకాలంనుంచి కనిపిస్తోంది. వీటిని ఇంగ్లీషులో మ్యూరల్స్ అంటారట. ఇవన్నీ 2డైమెన్షన్ చిత్రాలు కదా.
 ఇప్పుడు ఈ మ్యూరల్స్ 3డైమెన్షన్ లో  అద్భుతంగా చిత్రించబడుతున్నాయి. మూడో డైమెన్షన్ ని ఎంత నైపుణ్యంతో చిత్రించారో, ఎంత అద్భుతంగా  ఆ చిత్రీకరణ జరిగిందో ఇక్కడి మ్యూరల్స్ చూస్తే  తెలుస్తుంది.
అలాంటి కొన్ని మ్యూరల్స్  ఇక్కడ చూడండి. అదరహో అనిపించకపోతే అడగండి.



ఇక్కడ విరిగిపోయినట్టు కనిపిస్తున్నగోడతో పాటు తొంగి చూస్తున్న అతివ కూడా చిత్రంలో భాగమే అంటే నమ్మశక్యమా.....





ఏ భూకంపం తాకిడికో చెదిరిపోయిన హాలు లా ఉంది కదూ ఈ పెయింటింగ్ ..... కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ  లో ఓ కుడ్య చిత్రం ఇది. ఇక్కడి స్థంభాలు కూడా చిత్రంలో భాగమేనని వేరే చెప్పక్కర్లేదుగా.

ఈ చిత్రంలో చిత్రం చూసారా.... ఆ గొట్టంలో సముద్రాన్ని చిత్రించినట్టుంది కదూ.  కానీ దాంతో పాటు అందులోకి చూస్తున్న  ఆ బాటసారి కూడా ఆ పెయింటింగ్ లో భాగమే అంటే ....అవును. పైనుంచి కింద పేవ్ మెంట్ లా కనిపిస్తున్న భాగం వరకు అంతా ఒకే చిత్రం.


హవాయ్ ద్వీపంలోని హొనలూలు లో ఈ మ్యూరల్ ని చిత్రించారు.11 మంది సహాయకులతో, రెండునెలలు స్టూడియోలో, మరో ఆరు నెలలు బయట కష్టపడితే ఈ పెయింటింగ్ పూర్తయిందిట. హవాయ్ ద్వీపపు ఆఖరి మహారాణి  Liluokalani  ఈ చిత్రంలో చూడవచ్చు.

కాలిఫోర్నియా సాన్ జోస్ లో ఒక కేఫెటేరియా గోడలమీద ఈ చిత్రం కనిపిస్తుంది. మెట్లు దిగుతూ ఆగిపోయిన పిల్లి, గోడమీద అమర్చిన పెయింటింగ్ లో తోట,గోడలు వాటి నీడలు, చీకటి వెలుగుల్లో వాటి రూపాలు అన్నీ ఎంత స్పష్టాతి స్పష్టంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా చిత్రించారో చూడండి. ముఖ్యం కెఫెటేరియా మూసేసే సమయాన్ని కూడా గమనించకుండా చదువుతూ కూర్చుండిపోయిన యువతి....నిజంగా అక్కడకూర్చున్నట్టుగానే అనిపిస్తోంది కదా.
 ఫ్లోరిడాలో సరసోటా కంట్రీ హెల్త్ సెంటర్ లోది ఈ దృశ్యం.  నడిచి నడిచి అలసిపోయి కాళ్ళుజాపుకొని కూచోడానికి ఇక్కడ బావుంటుందనుకున్నారనుకోండి. వాళ్ళ పప్పులేం ఉడకవు. ఎందుకంటే ఇది మొత్తం ఓ గోడమీద చిత్రం కాబట్టి.

అలనాడు  భారతంలో దుర్యోధనుడు ఏది మడుగో, ఏది కాదో తెలియక తడబడిన ఘట్టాన్ని విన్నాం.
ఈకాలంలోను అలాంటి భ్రమలకి గురిచేయగల శక్తి ఉన్న అపర మయబ్రహ్మ లున్నారని నిరూపిస్తున్నాయి ఈ చిత్రాలు.

ఈ చిత్రాల రూపకర్త, కలి కాలపు మయుడు ఇదిగో ఇతనే..... JOHN PUGH !!!!!


 ఈ గొప్ప చిత్రకళాకారుడు జాన్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. అతను చేసిన చిత్రాల నేపథ్యం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.