Wednesday, December 25, 2013

ధరణి నోము పండించిన ధనుర్మాసం



ధరణి నోము పండించిన ధనుర్మాసం

భారతీయ జ్యోతిశ్శాస్త్రం ప్రకారం మనకి  పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఈ పన్నెండు రాశులలోను ప్రతినెలా ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ఒక రాశిలోనుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడమే సంక్రమణం. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. అయితే తెలుగువారిది చంద్రమానం. అంటే మనం చంద్రకళల ఆధారంగా రోజులని లెక్కవేసుకుని చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర పౌర్ణమి నాడు కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరుతో ఆనెలని పిలుస్తాము. సౌరమానం ప్రకారం  సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో ఆనెలని పిలుస్తారు. 

సూర్యగమనాన్ని ఉత్తరాయనం, దక్షిణాయనం అంటారు. అయనం అంటే ప్రయాణం. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. తమిళులది సూర్యమానం. సూర్యుని గమనం ప్రకారం వారి నెలల లెక్క ఉంటుంది. అందుకే మృగశిర నక్షత్రం పేరుమీద మార్గశిరం అని తెలుగువారు పిలిచే నెలలోనే ఈ ధనుర్మాసం వస్తుంది. ధనుస్సు రాశి నుండి మకరరాశికి సంక్రమించే వరకు సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అనే పేరుతో పిలుస్తారు తమిళులు.

 వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం అతి పవిత్రమైనది. ఈ మాసాన్ని మార్గళి అనే పేరుతో పిలుస్తారు ఈ ధనుర్మాసం అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆంధ్ర, కన్నడ, తమిళ ప్రాంతాలలో ఈ ధనుర్మాసాన్ని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారు. తెలుగువారు ఈ ధనుర్మాసాన్ని నెలపట్టడం అంటారు. 

 ధనుర్మాస వ్రతం ప్రసక్తి పురాణాలు

శ్రీ మహావిష్ణువు అవతార పురుషుడు. ఒక్కో అవతారంలో ఒక్కో పేరు. అలాగే ఈ ధనుర్మాసంలో స్వామివారిని మధుసూదనుడుగా పిలిచి ఆరాధిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన దగ్గరనుంచి, మకరరాశిలో ప్రవేశించే భోగి రోజు అంటే సంక్రాంతి ముందురోజు వరకు  ధనుర్మాసంలో నెలరోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరింస్తారు వైష్ణవులు. ధనుర్మాసం ప్రసక్తి మన పురాణాలలో బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లోని, నారాయణ సంహితలో, భాగవతంలో ఉంది. బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించడంలో తెలుస్తుంది.

ధనుర్మాస వ్రతం - విధి విధానాలు

ధనుర్మాస వ్రతం చేయాలనుకునేవారు బంగారంతోకానీ, వెండితోగాని శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తయారు చేయించి పూజకోసం సిద్ధం చేసుకోవాలి. ఈ రెండు లోహాలు కాకపోతే శక్తిమేరకు పంచలోహాలతో కానీ, రాగితోకానీ చేయించుకోవచ్చు. ఆ విష్ణువు విగ్రహాన్ని మధుసూదనుడు అనే నామంతో వ్యవహరించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి అయిదు ఘడియలముందుగా నిద్రలేచి తలారా స్నానం చేసి నిత్యపూజలు ముగించాక ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.
ముందుగా మధుసూదనస్వామిని ఆవుపాలతోను, పంచామృతాలతోను, కొబ్బరి పాలతోనూ అబిషేకం చేయాలి.  అభిషేకం చేయడానికి శంఖం ఉపయోగించడం శ్రేష్ఠం. అభిషేకం చేసే ద్రవ్యాలను ముందుగా శంఖంలో నింపుకొని ఒక్కొక్క ద్రవ్యంతో విగ్రహాన్ని అభిషేకించాలి. తులసీ దళాలు, ఇంకా పుష్పాలతో స్వామివారిని శత, సహస్ర నామాలను జపిస్తూ పూజించాలి.

 మొదటి పదిహేను రోజుల పాటు స్వామికి  ప్రతిరోజూ చక్కెర పొంగలిని లేదా, బియ్యం, పెసరపప్పు కలిపి వండే పులగం గానీ నైవేద్యంగా సమర్పించాలి.  నెలలో తర్వాతి పదిహేనురోజులు దధ్యోదనం (పెరుగన్నం) నివేదించాలి. ధూపం, దీపం, దక్షిణ, తాంబాబూలను సమర్పించి నమస్కారాలు చేయాలి. స్వామివారితో పాటు ఆయనకి ఎంతో ప్రియమైన  తులసిని కూడా పూజించాలి. ధనుర్మాసం అంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను వింటూ ఆ స్వామివారి సన్నిధిలో గడపాలి. నెలరోజుల పాటు చేయవలసిన ఈ వ్రతంలో ఏదైనా కారణం వల్ల 30 రోజులు చేయలేని వారు, పదిహేను రోజులు కానీ, 8 రోజులు కానీ, 6 రోజులు కానీ కనీసం 4 రోజులు కానీ చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ అదీ సాధ్యంకాకపోతే కనీసం ఒక్క రోజయినా ఈ వ్రతాన్ని  మనస్ఫూర్తిగా ఆచరిస్తే కూడా ఫలితం పొందుతారని పెద్దలు చెబుతారు.
మధూసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ పండితులకి దానం ఇవ్వాలి. ఆ దానాన్ని స్వీకరించే పండితుడు ఇందిరా ప్రతి గృహ్ణాతు అంటూ ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీస్సును పొందడం ద్వారా సాక్షాత్తూ ఆ మధుసూదన స్వామివారే పండితుడి రూపంలో సకల వాంఛలూ సిద్ధింపజేసే అమోఘ ఆశీర్వచనం దయచేస్తాడని ఆశిస్తారు. ఒక్కరోజయినా ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ఆచరిస్తే ఇహపర మోక్ష సాధనతో పాటు వేయి సంవత్సరాలపాటు దేవతారాధన చేసిన ఫలితం కూడా లభిస్తుందని వేదపండితులు భావిస్తారు.



ధనుర్మాసం - గోదాదేవి

ధనుర్మాసానికి ఆద్యురాలిగా పిలవబడే గోదాదేవి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందడానికి చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. గో అంటే జ్ఞానం అనీ, ద అంటే ఇచ్చునది అని గోదాదేవి జ్ఞానాన్ని ప్రసాదించేది అని ఈ పదానికి వ్యుత్పత్తి చెప్తారు పండితులు.  తాను ధరించి స్వామికి మాలను ఇచ్చిన కన్య గా ఈ గోదాదేవి చూడికుడుత్త నాంచారి గా ప్రసిద్ధి పొందింది. ఈ గోదాదేవి గాధనే శ్రీ కృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద (మాలను ధరించి విడిచి  స్వామికి ఇచ్చినది )అనే గొప్ప వైష్ణవ మత ప్రబోధ ప్రబంధంగా రచించాడు.  గోదాదేవిని సాక్షాత్తూ భూదేవి అవతారంగా భావిస్తారు.  ఆండాళ్, కోదై అనే పేర్లు కూడా గోదాదేవి పేర్లే.

ఆ శ్రీ మహావిష్ణువు గొప్పదనాన్ని కీర్తిస్తూ, ప్రపంచానికి శాంతి సౌఖ్యాలను చేకూర్చాలని ఆశిస్తూ రోజుకొక్కటి చొప్పున ముప్ఫయి కీర్తనలతో   గోదాదేవి స్వామిని ఆరాధించింది. ఈ కీర్తనలను పాశురాలు అంటారు. నాలుగు వేదాల సారాన్ని క్రోడీకరించి గోదాదేవి గానం చేసిన ఈ పాశురాలన్నీ దివ్యగాన ప్రబంధంగా తిరుప్పావై అనే పేరుతో శ్రీ వైష్ణవులు పాడతారు. తిరు అంటే శ్రీ అని అర్ధం. పావై అంటే పాటలు అని గానీ వ్రతం అని గానీ అర్థం. భగవంతుడిని భర్తగా ఆశిస్తూ చేసిన వ్రతాన్ని వివరించే పాటలతో కూడినది తిరుప్పావై. ఇందులో 30 పాశురాలు ఉన్నాయి. పాశురాలు ఛందోబద్ధంగా ఉండే గీతాలు. కేవలం భగవంతుడి లీలా విలాసాన్ని వర్ణించడమే కాకుండా ప్రకృతిలోని అద్భుతమైన అంశాలెన్నిటినో పాశురాలు వివరిస్తాయి.  చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే ప్రకృతి కూడా మానవుడికి అనుకూలంగా మారుతుందని, మనిషి జీవితంలో శాంతి సౌబాగ్యం నిండుగా ఉంటాయని ఈ పాశురాలు వర్ణిస్తాయి. చివరి పాశురాల్లో ఈ పాశురాలను తాను రచించి పాడానని, వీటిని గానం చేసినవారికి భగవంతుడి కటాక్షం కలిగితీరుతుందని చెప్తుంది గోదాదేవి. తిరుపతిలోని శ్రీనివాసుడికి ప్రతిదినమూ వినిపించే సుప్రభాతానికి బదులుగా ఈ ధనుర్మాసం నెలరోజులూ తిరుప్పావైలోని పాశురాలనే ఆలాపన చేస్తారు. పన్నెండుమంది ఆళ్వారులలో ప్రముఖస్థానం గోదాదేవిదే.

 కాత్యాయనీ వ్రతం – శ్రీ వ్రతం

 శ్రీ మహావిష్ణువులాంటి చక్కని అందమైన ప్రేమించే భర్త రావాలని కోరుకుంటూ కన్నెపిల్లలు కాత్యాయనీ వ్రతం చేస్తారు. రాహుకేతువుల దోషం వలన వివాహం ఆలస్యమైన కన్యలు త్వరగా వివాహం జరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  కృత్తికానక్షత్రంతో కలిసిన మంగళవారాలు ఈ వ్రతానికి శ్రేష్ఠమైనవని అంటారు. అందుకే సుబ్రహ్మణ్యషష్ఠనాడు  ఈ వ్రతం చేస్తారు కొందరు. కలశం పెట్టి శక్తిని బట్టి బంగారు లేదా పసుపు కొమ్ములతో మంగళసూత్రాలను తయారుచేసి కలశానికి అలంకరిస్తారు. ఏడు చెరుకుముక్కలు, ఏడు అప్పాలతో నైవేద్యం పెట్టి వ్రత కథను విని అక్షింతలు వేసుకుంటారు. ఈ విధంగా  ఏడు మంగళవారాలు వ్రతం చేసాక 8వ వారం ఉద్యాపన చేస్తారు. ఏడుగురు ముత్తయిదువలకి తలంటుపోసి, కొత్త చీరలు, ఏడు అప్పాలు, ఏడు చెరుకుముక్కలు వాయనం ఇచ్చి వారితో ఆశీర్వచనం పొందుతారు.

కాత్యాయని కథ

 కాత్యాయని అంటే పార్వతీదేవి. సతీదేవిగా దేహత్యాగంచేసిన అమ్మవారు హిమవంతుడి పుత్రికగా పార్వతిగా జన్మించింది. పరమేశ్వరుడిని భర్తగా కోరి తపస్సుచేసి అతనిని పొందింది.హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని అందువల్ల కతి పుత్రికగా కాత్యాయనిగా పిలువబడుతుంది పార్వతీదేవి. శివుడిని ఆశ్రయించిన కుజుడి వలన సతీదేవిగా అతనికి దూరమైన దేవి కుజుడు శివుడిని వీడిన తర్వాత పార్వతిగా అతన్నిచేరింది. అందుకే కాత్యాయని వ్రతం చేసి కుజదోషం పోగొట్టుకుని చక్కని భర్తను పొందాలని కన్నెపిల్లలు ఈ వ్రతం వలన ఆశించే ఫలితం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలలో ఈ కాత్యాయనీ వ్రతం చేస్తారు.
ఈ కాత్యాయనీ వ్రతంతో గోపికలు శ్రీ కృష్ణుడిని పొందారని, తాను కూడా శ్రీ రంగనాథుడిని పొందడానికి  ఆండాళ్ ఈ వ్రతాన్నే విభిన్నంగా ఆచరించింది. పాశురాల గానంతో పూజించింది. చివరకు ఆయనని వివాహమాడింది. అందుకనే ఈ ధనుర్మాసంలో శ్రీవ్రతం పేరుతో చేసే పూజలు ఆండాళ్ వ్రత విధానాన్నే సూచిస్తాయి. తిరుప్పావై పాశురాలలో ఈ శ్రీ వ్రతం ఆచరణ వివరించబడింది. ఈ వ్రతాన్నే పావైనోంబు అని అంటారు. తమిళనాడులో  ధనుర్మాసంలో గోదాదేవి కల్యాణం చేస్తారు. వేకువజామునే నిద్రలేచి తలస్నానం చేసి స్వామివారి కీర్తనలను క్రమం తప్పకుండా పాడడం, పేదలకు దానధర్మాలు చేయడం, పండిత సత్కారం చేయడం ఈ తిరుప్పావై వ్రతం చేసేవారు చేయవలసిన విధులు. అలాగే స్వామివారికి చక్కెర పొంగలి లేదా, పప్పు పొంగలి నైవేద్యాలు, ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజించడం కూడా ఈ వ్రతంలో ముఖ్యమైనది.  వైష్ణవాలయాల్లో తిరుప్పావై ని ప్రతిరోజూ తెల్లవారుఝాము ఘడియల్లో ఆలపించడం, నగరవీధుల్లో సంకీర్తనలు చేస్తూ తిరగడం, స్వామికి ఘుమఘుమలాడే నేతి  ప్రసాదాలను నైవైద్యంగా అందించి వాటిని మాత్రమే భుజించడం ఈ ధనుర్మాసంలో విశేషాలు.





తెలుగునాట  గొబ్బిపాటలు

ధనుర్మాసం ఆరంభంతోనే సంక్రాంతి పండుగ సంబరాలు కూడా మొదలవుతాయి తెలుగు ఇళ్ళలో. సూర్యుడు ధనుస్సు రాశినుంచి మకరరాశికి సంక్రమణం చేసే రోజు సంక్రాంతి. ధనుర్మాసం నుంచి సంక్రాంతి ప్రవేశించేవరకు తెల్లవారుఝాములోనే లేచి కళ్లాపి జల్లి ముంగిళ్ళలో అందమైన ముగ్గులు వేసి రంగు రంగుల పూలతో అలంకరించిన ఆవుపేడతో గొబ్బిళ్ళు పెడతారు. సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బడ్నియ్యవే అంటూ పాటలు పాడతారు. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి ప్రతిరూపం. సంక్రాంతి రోజు సాయంత్రం సందెగొబ్బెమ్మ పేరంటం పిలుచుకుని అందరికీ వాయనాలు ఇస్తారు. 



తెలుగునాట ధనుర్మాసం తెచ్చే సందడిలో ముగ్గులూ గొబ్బెమ్మలతో పాటు చెప్పుకోవలసిన ముఖ్యమైన విశేషాలు ఇంటింటికీ రంగురంగుల వస్త్రాలను కప్పుకుని వచ్చే గంగిరెద్దులు
 అలాగే ముచ్చటైన వస్త్రధారణతో చేతిలో చిడతలు తట్టుకుంటూ, కృష్ణార్పణం చేస్తూ భిక్షను స్వీకరించే హరిదాసులు చేసే  భగవన్నామ స్మరణతో ధనుర్మాసం ఎంతో ముచ్చటగొలుపుతుంది.
                            


ధనుర్మాసం – పండుగలు పర్వదినాలూ


ధనుర్మాసంలో వచ్చే గురువారాలు చాలా పవిత్రమైనవి శుభప్రదమైనవి. మార్గశిరమాసం మహా విష్ణువుకు ఎంతో ప్రీతి అని చెప్తారు. భగవద్గీత విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షాహం అని చెప్పబడింది. మార్గశిరమాసం గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆమె కటాక్షం పొందాలి. లక్ష్మీపూజ విధానంలోనే ఈ వ్రతం కూడా చేయాలి. అయితే మార్గశిరమాసంలోని నాలుగు గురువారాలతో పాటు, పుష్యమాసంలోని ఐదవ గురువారం కూడా లక్ష్మీ పూజ చేయాలి. ఈ వ్రతానికి నైవేద్యం కూడా భిన్నమైనవి. మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, ఐదవ వారం అంటే  పుష్యమాసం లోవచ్చే  మొదటి గురువారం నాడు  పూర్ణం కుడుములు నైవేద్యం పెట్టాలి. 

మార్గశిర శుద్ధ షష్టినాడు సుబ్రహ్మణ్య షష్టి..కుమారస్వామి తారకాసురుడిని సంహరించి లోకాలను కాపాడిన పర్వదినం.

ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం.  దీనిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని స్వర్గద్వారం అనీ పేర్లతో పిలుస్తారు. ఆరోజు విష్ణుమూర్తి ఉత్తరం దిక్కున తన వైకుంఠ ద్వారాన్ని  తెరిచి తన గరుడ వాహనం పై ముక్కోటి దేవతలతో సహా వచ్చి దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఒక్క ఏకాదశే ముక్కోటి ఏకాదశులకి సమానమైన ఫలితాన్నిస్తుందని అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అమృతాన్ని మధించగా వచ్చిన హాలాహలాన్ని శివుడు ఈరోజే తన కంఠంలో ధరించాడని పురాణాలు చెబుతాయి.  వైకుంఠ ఏకాదశినాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడని అందుకనే దాన్ని తినకూడదని ఆరోజు ఉపవాసం చేస్తారు. ఏకాదశినాడు ఉపవాసం చేసి, ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. కొందరు భగవద్గీత గ్రంధాలను దానం కూడా చేస్తారు. జపతపాలతో, ఉపవాసాలతో పరమనిష్ఠా గరిష్ఠులై వైకుంఠ ఏకాదశిని ఆచరించి తరిస్తారు భక్తులు.  ఈ ఏకాదశినాడే భగవద్గీతను కృష్ణభగవానుడు అర్జునుడికి బోధించాడని గీతాజయంతిగా ఈ దినాన్ని జరుపుకుంటారు.

మార్గశిర శుద్ధ పౌర్ణమినాడు దత్తాత్రేయ జయంతి.  మార్గశిర శుద్ధ త్రయోదశినాడు హనుమత్ వ్రతం ఆచరింపబడుతుంది. 

ధనుర్మాసంలోని ఆఖరి రోజు భోగి పండుగ తో ఈ మాసం ముగుస్తుంది. భోగి పండుగనాడు బలిచక్రవర్తిని విష్ణువు పాతాళానికి అణిచిన రోజు. భగ అంటే వేడి అని అర్థం ఇచ్చే మాట నుంచి భోగి  వచ్చింది.  ఆవు పేడతో పిడకలు చేసి ఆ పిడకలను దండలుగా గుచ్చి అగ్నిదేవుడికి సమర్పిస్తారు. తాము దక్షిణాయనంలో పడిన చీడపీడ బాధలన్నీ ఈ మంటల్లో పిడకలుగా  వేసి ఉత్తరాయణకాలంలో సుఖసంతోషాలు కలగాలని  ప్రజలు కోరుకుంటారు.

ఇలా ఎన్నో పర్వదినాలతో అతి పవిత్రంగా తరతరాలనుంచి ఆచరించబడుతున్న ధనుర్మాసం  దక్షిణ భారతదేశపు సంఘ జీవనంలో, సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం వహించి ఉంది. ప్రతి రోజు, ప్రతిపూటా అయ్యవారి కథలు, అమ్మవారి పాటలతో శ్రవణశుభగంగా వినిపిస్తూ,  కన్నులపండువగా జరుగుతుంది ధనుర్మాసం.

Friday, November 15, 2013

కార్తీక మాసం - విశిష్టత





 కార్తీకమాసానికి  హైందవ సంప్రదాయంలో  చాలా విశిష్టమయిన స్థానం ఉంది. సౌరమానంలో ఉన్నట్టే, చాంద్రమానంలో కూడా సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉన్నాయి.  ప్రతిమాసంలో పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నక్షత్రం పేరుమీద ఆ మాసానికి పేరు ఏర్పడుతుంది. చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసి ఉండే నెల కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు.
 
కృత్తికా నక్షత్రానికి అథిపతి అగ్ని. అగ్నికి ఆరుముఖాలు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు ఆగ్ని నక్షత్రాలు. వీటిలో మొదటిదైన కృత్తికా నక్షత్రం ఆరు నక్షత్రాలకలయిక అని, వీటిని కృత్తికలు అంటారని, కుమారస్వామికి ఈ కృత్తికలే పాలు ఇచ్చి పెంచాయని అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారని పురాణకథనం. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం సూర్యుడు సంవత్సరంలోని పన్నెండు నెలలలోను ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సౌర మానం ప్రకారం సూర్యుడు వృశ్చికరాశి లో ప్రవేశించే కాలం కార్తీకమాసం. చాంద్రమానం ప్రకారం సూర్యుడు కార్తీకమాసంలో తులారాశిలో ప్రవేశిస్తాడు. ఈవిధంగా రెండు కాలమానాల్లోనూ సూర్యుడి గమనానికి ఆలంబనమైన ఈ రెండురాశుల ప్రభావం కార్తీకమాస సమయంలో భూమిమీద చరించే మానవులమీద ఉంటుంది. హరిహరులు ఇరువురికీ ఇష్టమైన మాసంగా కార్తీకమాసం వస్తుంది. ఈ కార్తీకమాసం గొప్పదనాన్ని గురించి, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాలను గురించి  పురాణాలు వివరిస్తున్నాయి.

హిందువుల పండుగలన్నిటికీ పురాణాల్లో ప్రవచింపబడిన విషయాలు ఆదారంగా ఉంటాయి. ఈ కార్తీకమాసంలో శైవారాధనకి, విష్ణ్వారాధనకి సమాన ప్రాతినిధ్యం ఉండడం విశేషం. కార్తీకమాసం విశిష్టతను స్కందపురాణంలో వశిష్టుడు జనకమహారాజుకు, పద్మ పురాణంలో  శ్రీకృష్ణుడు సత్యభామకు వివరించినట్టు తెలుస్తోంది. కార్తీకమాసం దీపావళి పండుగ జరుపుకునే  అమావాస్య ముగియగానే పాడ్యమితో ప్రారంభమవుతుంది. 

కార్తీకమాసం -నదీస్నానాలు

  కార్తీకమాసం అంటే తెల్లవారుఝాము ఘడియల్లో చేసే నదీస్నానాలు, ఉపవాసాలు, దీపారాధనలు . వీటిగురించి తెలుసుకుందాం.

తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్యపావనీ
సర్వత్ర ద్రవరూపేణ పా సంపూర్ణా భవేత్తదా    

సూర్యుడు తులారాశిలో చేరగానే గంగానది ద్రవరూపంతో అన్ని నదీజలాలనూ చేరుతుంది. అందువల్ల కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించే తెల్లవారుఝాముల్లో నదీ స్నానం ఉత్తమమయినది అని చెప్తారు. ఈ మాసంలో భూమండలం మీద ప్రతి నది, చెరువు, సరస్సులు, బావులు మొదలైన జలాశయాల్లోనే కాక చివరకు ఆవుకాలు మోపినంత ప్రదేశంలో నిలిచిన నీటిలో కూడా విష్ణుమూర్తి అంశ ఉంటుందని ప్రతీతి. అందుకే ఈ నదీ స్నానాలకి కార్తీకమాసంలో అంత ప్రాముఖ్యం. 

సర్వపాప హరం పుణ్యం స్నానం కార్తీక సంభవం
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే  

అంటూ కార్తీక స్నానాలకు ఏ ఆటంకం కలుగకూడదని దామోదరుడిని  ప్రార్థిస్తారు. నదీజలాల్లో స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీటిని తీసుకుని  ఆలోడనం చేసి, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరంవైపు చల్లి ఒడ్డుకు రావాలి. పొడివస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణువును అర్చించి, ఆవునేతితో దీపారాధన చేయాలి. స్త్రీలు తులసిమొక్కనూ, పురుషులు ఉసిరి మొక్కను దీప సహితంగా దానం చేయాలి. కార్తీకమాసంలో  ప్రతి రోజూ కార్తీక వ్రతమహాత్మ్య కథలను తెలుసుకుని, విష్ణు శివాలయాల్లో దీపారాధన చేసేవారికి సర్వకర్మ బంధాలనుండి విముక్తి పొంది శివ లోక సాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలమంతా దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటిముందు వెలిగే దీపాలతో వీధులన్నీ ఎంతో ప్రకాశవంతంగా  శోభాయమానంగా ఉంటాయి. తెల్లవారుఝామున స్త్రీలు నదులలో, చెరువుల్లో, కోనేరుల్లో కార్తీక దీపాలను వదులుతారు. ఆకాశంలో నక్షత్రాలలాగా  ఈ నక్షత్రాలు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి.

కార్తీకమాసంలో  పాఢ్యమి, విదియ, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధులు చాలా ముఖ్యమైనవి. కార్తీకమాసంలో వచ్చే సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోముడు అంటే చంద్రుడు.సోమవారానికి చంద్రుడు అధిపతి. శివుడు చంద్ర శేఖరుడు.  అందుకే సోమవారం అంటే శివుడికి మహా ప్రీతి. సోమవారాలలో నియమనిష్టలతో శివుడిని ఆరాధించాలి.  హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివస్తుతి చేసి నదీస్నానం ఆచరించి శివాలయంలో అభిషేకం, అర్చనలు చేసి అనంతరం అన్నదానం చేసి ఆ పైన మాత్రమే భోజనం చేయాలని,  ఈ స్నాన, జప, తప విధులతో శివారాధన చేస్తే సుఖసంతోషాల జీవించి శివసాయుజ్యం పొందవచ్చునని హిందువుల నమ్మకం.

కార్తీకమాసం పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఈరోజు గోపూజ చేస్తారు. గోవును అలంకరించి పూజిస్తారు. విదియరోజు భగినీహస్త భోజన్ లేదా యమద్వితీయ అన్నా చెల్లెళ్ళ పండుగ. చవితిరోజు, నాగుల చవితి  పండుగ. ఏకాదశి రోజు శయన ఏకాదశి.చాతుర్మాస్యదీక్ష ఉపహసంహరణదినం. ద్వాదశి రోజు క్షీరాబ్ధి ద్వాదశి. దేవతలు అమృత మధనం కోసం క్షీరసాగరాన్ని మధించిన రోజు. దీనినే చిలుకు ద్వాదశి అని అంటారు. లక్ష్మీనారాయణుల పెళ్ళిరోజు. చతుర్దశి రోజు విష్ణువే స్వయంగా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించిన రోజుగా చెప్తారు.  ఇక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు నిండుగా ప్రకాశంతో వెలిగిపోయేరోజు.  ఇన్ని పండుగరోజులను  ప్రోది చేసుకున్నది కనుకే  కార్తీకమాసానికి  హిందువుల హృదయాలలో   అంత ప్రాముఖ్యం ఉంది.

 సోమవార వ్రతం అంటే ఏమిటి ?

ఇక కార్తీక మాసంలో వచ్చే  సోమవారాలను  చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారు  హైందవ సంప్రదాయంలో. శివప్రీతి కోసం సోమవారం చేయవలసిన ప్రత్యేక విధులను ఆచరిస్తే వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణం చెప్తుంది. సోమవార వ్రతం ఏవిధంగా ఆచరించాలో స్కంద పురాణంలో చెప్పబడింది. సోమవార వ్రతంలో ప్రధానమైనది ఉపవాస వ్రతం. బాలింతలైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఉపవాసాలను పూర్తి నిరాహారంగా చేయకూడదని, పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చని వాయుపురాణం చెబుతోంది. సోమవార ప్రత విధానం ప్రధానంగా ఆరు విధాలు.

1.           1.      ఉపవాసము

కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండాలి.సాయంకాలం పూట శివాలయంలో శివాబిషేకం చేసి ఆకాశంలో నక్షత్రాన్ని దర్శించుకుని తులసి తీర్థం మాత్రమే తాగాలి. 

2.        2.     ఏకభుక్తము

ఈవిధంగా పూర్తి రోజంతా ఉపవాసం చేయలేనివారు ఏకభుక్తము విధిని ఆచరించవచ్చు. ఏకభుక్తము అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయడం. ఈ విధిని చేసేవారు తెల్లవారుఝామున స్నానాలు, దీప దానాలు చేసుకుని మధ్యాహ్నం ఙోజనం చేయవచ్చు. రాత్రి మాత్రం భోజనానికి బదులుగా శైవ తీర్థమో, తులసి తీర్ధమో పుచ్చుకొని ఉపవాసం చేయాలి

3 . నక్తము
నక్తము అంటే రాత్రి అని అర్ధం. ఈ విధిని అవలంబించే వారు రోజంతా పగలు ఉపవాసం చేసి నక్షత్రాన్ని దర్శించుకుని రాత్రి భోజనం లేదా ఉపాహారం సేవించాలి.

4 . అయాచితం

కార్తీక సోమవారం ఆచరించేవారు పగలంతా శివనామ స్తోత్రం చేస్తూ ఉపవాసం చేయాలి. స్వయంగా భోజనానికి ప్రయత్నం చేయకుండా, ఎవరైనా ఆహ్వానిస్తే వారితో కలిసి భోజనం చేయవచ్చు. ఈ విధిని  అయాచితం అంటారు.

5. స్నానం 

ఈ రకమైన ఉపవాసాలు ఏవీ చేయలేని వారు మంత్రాలు చదువుతూ, తెల్లవారుఝామున స్నానాలు ఆచరించాలి. అది చేసినా చాలు. కార్తీక మాసంలో ప్రధానమైన విధి  నదీస్నానం. తలని నదిలో ముంచి పూర్తి స్నానం చేయాలి. 

6.  తిలాదానం

ఏ మంత్రాలు, జపాలు ఏ పద్ధతులు తెలియని వారు  కేవలం కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా కూడా కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందుతారు.


ఈ ఆరుపద్ధతుల్లో ఏ పద్ధతిని ఆచరించినా కార్తీకసోమవారం వ్రత ఫలితాన్ని పొందుతారు. ఈ సోమవారం వ్రతం చేసేవారు శివాలయాల్లో అభిషేకం చేయడం తప్పనిసరి. శివుడు భోళాశంకరుడు. ఓ చెంబుడు నీళ్ళు అభిషేకం చేస్తే చాలు భక్తులకు ఏ లోటు రానివ్వడు. ఈ సోమవారం వ్రతం చేయడంలో  ఓ పురాణగాధ ఉంది.

పూర్వం ఓ బ్రాహ్మణుడికి నిష్టురి అనే కూతురు ఉండేది. చాలా దుష్టగుణాలతో గయ్యాళిగా పేరుపొందింది. తండ్రి ఆమెను మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్ళి చేసాడు. భార్యగా ఆమె మిత్రశర్మను నానా బాధలకు గురించేసి హింసించింది. గయ్యాళిగా, కాముకురాలిగా గడిపి, ఆమె చేసిన పాపాల ఫలితంగా సుఖవ్యాధులతో మరణించింది. యమలోకం చేరి నానా హింసలతో కూడిన శిక్షలు పొంది, చివరకు మానవలోకంలో పదిహేనుసార్లు కుక్కగా జన్మించింది. ఆఖరి జన్మలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసం వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నడు.

ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం చేసి, శివాలయంలో అబిషేకాలు పూర్తిచేసుకుని, సోమవార వ్రత విధానం ప్రకారం నక్షత్ర దర్శనం చేసుకుని ఇంటి ఆవరణలో బలి కోసం భోజనాన్ని వదిలిపెట్టాడు. ఆ ఇంటికుక్క రోజంతా యజమానితో పాటు ఉపవాసం చేసి ఆరోజు ఏమీ దొరకక  క్షుద్బాధ పీడిస్తుండగా ఆ బలి అన్నాన్ని తిన్నది. వెటనే ఆ కుక్కకి పూర్వజన్మ స్మృతి వచ్చింది. బ్రాహ్మణుడను రక్షించమని వేడుకుంది. తనకు తన పూర్వజన్మ వివరాలు ఎలా గుర్తుకు వచ్చాయో అర్థం కాక బ్రాహ్మణుడిని తెలపమని కోరింది. బ్రాహ్మణుడు ఆ వివరాలన్నీ తెలుసుకుని  నీవు నేను వదిలిపెట్టిన బలి భోజనం తినడం వలన నీకు పూర్వ జన్మ స్మృతి ఉంది అని చెప్పాడు. మోక్షంకోసం ప్రాథేయపడిన ఆ కుక్కకి ఆ బ్రాహ్మణుడు తన సోమవార వ్రత ఫలాలలో ఒకదాన్న కుక్కకి దానం చేసాడు. ఆ కుక్క దివ్యస్త్రీగా మారి కైలాసానికి చేరుకుంది. 

ఈ విధంగా కార్తీక సోమవార వ్రతం చేసిన వారు  సర్వపాపాలనుండి విముక్తులై కైలాసానికి చేరుకుంటారని స్కాంద పురాణంలో జనకమహారాజుకి వశిష్ఠుడు తెలిపాడు.

కార్తీకమాసవ్రతం - ఆరోగ్య సూత్రాలు

ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించడంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా కనిపిస్తాయి. కార్తీక మాసం సోమవారాలలో చేసే ఉపవాసాల వలన  కడుపులో ఆహారం పూర్తిగా జీర్ణమై కడుపు శుభ్రపడుతుంది. శరీరంలోని జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరకడం వలన నవ చైతన్యం కలుగుతుంది.  కార్తీకమాసం తో చలికాలం ప్రారంభమవుతుంది. మంచి వానలు పడి వాతావరణంలో తేమ పేరుకుని ఉంటుంది. మాంసాహారం తీసుకునే వారికి జీర్ణసంబంధమైన ఇబ్బందులు తల ఎత్తే కాలం ఇది. మాంసం జీర్ణం కావాలంటే వాతావరణంలో వేడి ఉండాలి. ఈ పూజలు, నోముల రోజుల్లో మాంసాహారం నిషిద్ధం కనుక  ఉపవాసం చేసే వ్యక్తులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఉపవాస దీక్షల వలన మనోబలం నిశ్చయంగా చేకూరుతుంది.

కార్తీకమాసం రోజుల్లో చేసే నదీ స్నానాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో పడిన వర్షాల వలన నదులు నిండుగా ప్రవహిస్తుంటాయి. ప్రవహించే నదులు తమ గమనంలో ఎన్నో ఔషధీ మూలికలను తమలో కలుపుకుంటాయి. అందువలన ఈ నదులలో స్నానం చేయడం అనేది మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కార్తీకమాసంలో ఊసిరి, తులసి మొక్కలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసి మొక్క ఆరోగ్య సంబంధమైన ఓషధీగుణాల నిధి. ఈ మొక్కని ఆరాధించడంలో సౌభాగ్యమే కాదు, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే ఉసిరిక వృక్షం, ఉసిరి కాయలు ఆరోగ్యానికి సంబంధించి ఎంతో విశిష్టమైనవి. ధాత్రి అంటే ఉసిరిక. లక్ష్మీ దేవికి ఉసిరిక అంటే మహా ప్రీతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక వృక్షం క్రింద ధాత్రీదేవి, దామోదరులు ప్రతిమని ఉంచి పూజ చేస్తారు. ఈ కార్తీకమాసంలో ఉసిరిక  వృక్షాలకింద వనభోజనాలు చేయడం కూడా ఒక విధి. ఈ భోజనాలవలన సంఘ జీవనం, వ్యక్తుల మధ్య మానసిక అనుబంధాలు గట్టిపడడం వంటి మేలు జరుగుతుంది.

కార్తీకమాసం- దీపారాధన

కార్తీకమాసంలో దీపం వెలిగించడం, దీపాన్ని దానం చేయడం అనే అంశాలను కూడా ప్రత్యేకంగా చెప్పారు. నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి. మనుషులలో ఉండే స్వభావాలకు ఆధారం వారిలోని గుణాలు.  రాజస, సాత్విక, తాపన గుణాలు మనిషిలో ఉంటాయి. . ప్రమిదలో వత్తి  సత్వగుణానికి,  నూనె తమోగుణానికి,  మంట  సత్వగుణానికి ప్రతీకలు. ఇవన్నీ ఒకటికొకటి  సంపూర్ణంగా వ్యతిరేకమయిన గుణాలు.  కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. ఒక మంచి వ్యక్తిగా, పూర్ణపురుషుడిగా రూపు దాల్చాలనుకునే వారు తమలోని తామస,రజోగుణాలని అణిచిపెట్టుకోవాలి. సత్త్వ గుణాన్ని  పెంచుకోవాలి.  ఉత్తమ సాంగత్యం వలన ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడి సత్త్వ గుణం పెరుగుతుంది.  దీపం అంటే జ్ఞానానికి ప్రతీక. దీపాలను బయట వెలిగించడమే కాదు హృదయాలలో వెలిగించుకోవాలి. తద్వారా వ్యక్తుల జీవితాల్లో జ్ఞానదీపాలు ప్రకాశవంతంగా వెలుగుతాయి.
 
రాగద్వేషాలకు అతీతమైన స్వబావాన్ని పెంపు చేసుకుని సాత్వికులుగా మారిన వ్యక్తులు సమాజానికి కూడా ఆదర్శప్రాయులవుతారు. ఆరోగ్యవంతులైన ప్రజలతో కూడిన, ఒక ప్రేమపూరితమైన వాతావరణంతో సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా కార్తీకమాసంలో తెల్లవారుఝామున చేసే నదీ స్నానాలు, దీపారాధనలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు వంటి విధులన్నీ  సమాజంలో  ఒక ఆథ్యాత్మిక వాతావరణం ఏర్పరచి భక్తిభావాన్ని పెంపొందించి వ్యక్తుల సుఖజీవనానికి ఆలంబనను అందిస్తాయి.

Tuesday, October 22, 2013

ముత్యాల మురిపాల అట్లతద్ది పాట



ఈరోజు అట్లతదియ పండుగ. అట్లతద్ది అనికూడా అంటారు. ఇది ఆడపిల్లలు నోచుకునే ఒక నోము. 

అట్లతద్దోయ్ ఆరట్లోయ్
 ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అనే పాట అట్లతద్ది పాట. కుజదోషం పోయి మంచి భర్త లభించి చక్కని కుటుంబజీవితం కావాలని ఆడపిల్లలు నోచుకునే నోము అట్లతద్ది.  పూజలు, వాయనాలు, వెన్నెల్లో ఆటలు, ఉయ్యాలలు ఊగడాలు అమ్మాయిలలో  గట్లుతెంచుకుని పారే  ఉత్సాహాల, ఆనందాల పరవళ్ళు అట్లతద్ది రోజు ప్రత్యేకతలు.

ఈ అట్లతద్ది పండుగనాడు చేతులనిండా గాజులు వేసుకుని, నోటినిండా తాంబూలం పండించుకుని, చేతుల్లో గోరింటాకు పండించుకుని మసక వెన్నెల్లో ఆడపిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటారు. ఇప్పుడు ఎవరికీ తెలియకపోయినా టీవీలు మన గృహసామ్రాజ్యాల్లోకి, సీరియళ్ళు మన గృహరాణుల మనసుల్లోకి ప్రవేశించకముందు కాలం వరకు చాలా మందికి తెలిసిన ఆటలే  ఈ ఆటలు.

ఆరుద్ర -  బొబ్బిలి యుద్ధం సినిమాకి రాసిన పాటలో ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా అంటూ రాజకుమార్తెతో పాటు అమ్మాయిలందరూ కలిసి ఆడుకునే సందర్భాన్ని వర్ణించారు. ఆ పాట ఈ అట్లతద్ది పండుగనాడు తలుచుకోవడం బావుంటుంది కదా.

చెమ్మచెక్క చారెడేసి మొగ్గ
అట్లు పొయ్యంగా ఆరగించంగా
ముత్యాల చెమ్మెచెక్క ముగ్గులెయ్యంగా
రతనాల చెమ్మచెక్క రంగులెయ్యంగా
..సుబ్బా రాయుడు పెళ్ళి చూసివద్దాం రండి
మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి

ఇది అట్లతద్ది నాడు ఆడపిల్లలంతా చేరి  మసక  వెన్నెల్లో ఒకరి ఎదురుగా ఒకరు నిలుచొని అరచేతులు ఎత్తి ఇద్దరి చేతులు తాకిస్తూ చప్పట్లు కొడుతూ, చేతులు వెనక్కి తీసుకుంటూ ఆడుకుంటూ పాడుకునే పాట.
ఈ పాటలోని ముత్యాల చెమ్మచెక్క , రతనాల చెమ్మచెక్క పదాలతో తన పాట పల్లవిని ప్రారంభించారు ఆరుద్ర. ఓచెలి మురిపెముగా ఆడుదమా అంటూ ఒకరిని ఒకరు ఆడుకోవడానికి పిలుస్తూ  చెమ్మచెక్కఆడుకుంటూ పాడతారు అమ్మాయిలు. పల్లవిలో తరువాతి మాటల్లో 

తళ తళ తళతళ మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసూఅంటూ  సంపంగిలా పరిమళించే అమ్మాయిల మంచి మనసులను, తళ తళ మెరిసే బాహ్య శరీరాల సొగసును చూపిస్తారు ఆరుద్ర.
పరువము వేసిన పందిరిలో బుజబుజ రేకులు పూయవలే “-
అందరూ పెళ్ళి వయసుకి వచ్చి భర్తకోసం చేసుకునే నోము కాబట్టి ఆటల్లో పాటల్లో ఆ పరువపు ఉత్సాహం తొంగి చూస్తుంటుంది. బుజబుజరేకులు, బుజ్జారేకులు అంటూ పాడుకునే పెళ్ళి పాట ఉంది జానపద సాహిత్యంలో. బుజబుజరేకుల పిల్లుందా బుజ్జారేకుల పిల్లుందా అంటూ ప్రారంభమవుతుంది ఆ పాట. ఈ పాటలో కూడా పెళ్ళి పందిరి, పెళ్ళికూతురును తలపిస్తూ ఆ బుజబుజరేకుల పెళ్ళికూతుళ్ళని గురించి చెప్పడానికి ఈ మాటలు వాడారు ఆరుద్ర.
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ -
కల కలమని ఉత్సాహంగా, కిలకిల మని సంతోషంగా నవ్వుతూ చేతులకి నిండుగా వేసుకున్న గాజుల చప్పుడు గల గలమని శ్రవణపేయంగా వినిపిస్తూ ఉండగా ఆ కన్నెపిల్లలు ఎంత ఉత్సాహంగా ఒప్పుల కుప్పలు ఆడుకుంటున్నారో చెప్పడానికి ఈ కలకల, కిలకిల, గలగల అనే జంటపదాలు చక్కగా వాడుకున్నారు.

ఆడపిల్లలందరూ చేరి ఆడుకునే పాటల్లో చాలా ప్రముఖమైన పాట ఒప్పులకుప్ప. ఒప్పులకుప్ప ఒయ్యారి భామ అంటూ పాడుతూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. చూసినవాళ్ళకి కళ్ళు తిరిగేంత వేగంతో ఆ ఆటకి పాటని కూడా ఇక్కడ రాసారు ఆరుద్ర.

ఒప్పులకుప్ప ఒయ్యారి భామ
సన్నబియ్యం చాయపప్పు
చిన్నమువ్వ సన్నగాజు
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు నీ మొగుడెవడు...

అట్లతద్ది పండుగలో ప్రధానమైనది గౌరీదేవి నోము. శివుడిని పతిగా కోరి గౌరీదేవి చేసిన నోము కనుక ఆడ పిల్లలు చక్కని భర్త కావాలని ఈ నోముని నోచుకుంటారు . ఈ ఒప్పుల కుప్ప పాటలో రాబోయే భర్త ఎలా ఉంటాడు అని ఊహించుకుంటూ ఒకరినొకరు వేళాకోళం చేసుకుంటూ పాడుకుంటారు.
అట్లతద్ది పండుగలో  11 కి ప్రాధాన్యం ఉంటుంది. 11 రకాల పళ్ళు తినాలి, 11సార్లు ఉయ్యాల ఊగాలి, 11 సార్లు తాంబూలం వేసుకోవాలి ఇలా. ఈ విషయాన్ని వర్ణిస్తూనే పాటలో -

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు 
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు 
అనే చరణంలో ఆ తాంబూల సేవనాన్నే వర్ణించారు.  జవ్వాది మంచి సుగంధ  ద్రవ్యం. తాంబూలం లో దాన్ని  చేర్చుకుని సేవిస్తే మరి ఎంత సువాసనో చెప్పాలా......చెప్పడం కోసమే ఆ ఘుమ ఘుమ ఘుమ అన్ని సార్లు అనడం. చెమ్మచెక్క చారెడేసి మొగ్గ పాటలోని చారెడేసి మొగ్గలని ఇక్కడ అమ్మాయిల గులాబీ బుగ్గల లోని మెరుపును, తాంబూలం వల్ల ఘుమ ఘుమ లాడుతున్న జవ్వాది  పరిమళాన్ని  చెప్పడానికి వాడారు.

ఈ ఒప్పుల కుప్ప పాట తర్వాత ఆరుద్ర మరో రెండు మాటలు వేసారు.
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె. 

అదే..ఈ ఆటలకి నోములకి ఆశించే పరమార్థం. ఓచెలి మురిపముగా ఆడుదమా అంటూ ఒప్పులకుప్పలు, చెమ్మచెక్కలు ఆడుకుంటూ ఆడపిల్లలు కనులవిందు చేసే దృశ్యాన్ని తన పాటతో  మనసు  తెరమీద అందంగా ఆవిష్కరించారు  ఆరుద్ర. చక్కని జానపద గేయాన్ని సంపంగి, గులాబీ, జవ్వాది పరిమళాలతో గుబాళించే పదాలతో మరింత ఇంపుగా తీర్చారు.


పాట రచన ఆరుద్ర (భాగవతుల శంకర శాస్త్రి)
సినిమా     బొబ్బిలియుద్ధం
గానం       సుశీల బృందం
సంగీతం    సాలూరు రాజేశ్వరరావు