Friday, November 15, 2013

కార్తీక మాసం - విశిష్టత





 కార్తీకమాసానికి  హైందవ సంప్రదాయంలో  చాలా విశిష్టమయిన స్థానం ఉంది. సౌరమానంలో ఉన్నట్టే, చాంద్రమానంలో కూడా సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉన్నాయి.  ప్రతిమాసంలో పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నక్షత్రం పేరుమీద ఆ మాసానికి పేరు ఏర్పడుతుంది. చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసి ఉండే నెల కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు.
 
కృత్తికా నక్షత్రానికి అథిపతి అగ్ని. అగ్నికి ఆరుముఖాలు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు ఆగ్ని నక్షత్రాలు. వీటిలో మొదటిదైన కృత్తికా నక్షత్రం ఆరు నక్షత్రాలకలయిక అని, వీటిని కృత్తికలు అంటారని, కుమారస్వామికి ఈ కృత్తికలే పాలు ఇచ్చి పెంచాయని అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారని పురాణకథనం. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం సూర్యుడు సంవత్సరంలోని పన్నెండు నెలలలోను ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సౌర మానం ప్రకారం సూర్యుడు వృశ్చికరాశి లో ప్రవేశించే కాలం కార్తీకమాసం. చాంద్రమానం ప్రకారం సూర్యుడు కార్తీకమాసంలో తులారాశిలో ప్రవేశిస్తాడు. ఈవిధంగా రెండు కాలమానాల్లోనూ సూర్యుడి గమనానికి ఆలంబనమైన ఈ రెండురాశుల ప్రభావం కార్తీకమాస సమయంలో భూమిమీద చరించే మానవులమీద ఉంటుంది. హరిహరులు ఇరువురికీ ఇష్టమైన మాసంగా కార్తీకమాసం వస్తుంది. ఈ కార్తీకమాసం గొప్పదనాన్ని గురించి, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాలను గురించి  పురాణాలు వివరిస్తున్నాయి.

హిందువుల పండుగలన్నిటికీ పురాణాల్లో ప్రవచింపబడిన విషయాలు ఆదారంగా ఉంటాయి. ఈ కార్తీకమాసంలో శైవారాధనకి, విష్ణ్వారాధనకి సమాన ప్రాతినిధ్యం ఉండడం విశేషం. కార్తీకమాసం విశిష్టతను స్కందపురాణంలో వశిష్టుడు జనకమహారాజుకు, పద్మ పురాణంలో  శ్రీకృష్ణుడు సత్యభామకు వివరించినట్టు తెలుస్తోంది. కార్తీకమాసం దీపావళి పండుగ జరుపుకునే  అమావాస్య ముగియగానే పాడ్యమితో ప్రారంభమవుతుంది. 

కార్తీకమాసం -నదీస్నానాలు

  కార్తీకమాసం అంటే తెల్లవారుఝాము ఘడియల్లో చేసే నదీస్నానాలు, ఉపవాసాలు, దీపారాధనలు . వీటిగురించి తెలుసుకుందాం.

తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్యపావనీ
సర్వత్ర ద్రవరూపేణ పా సంపూర్ణా భవేత్తదా    

సూర్యుడు తులారాశిలో చేరగానే గంగానది ద్రవరూపంతో అన్ని నదీజలాలనూ చేరుతుంది. అందువల్ల కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించే తెల్లవారుఝాముల్లో నదీ స్నానం ఉత్తమమయినది అని చెప్తారు. ఈ మాసంలో భూమండలం మీద ప్రతి నది, చెరువు, సరస్సులు, బావులు మొదలైన జలాశయాల్లోనే కాక చివరకు ఆవుకాలు మోపినంత ప్రదేశంలో నిలిచిన నీటిలో కూడా విష్ణుమూర్తి అంశ ఉంటుందని ప్రతీతి. అందుకే ఈ నదీ స్నానాలకి కార్తీకమాసంలో అంత ప్రాముఖ్యం. 

సర్వపాప హరం పుణ్యం స్నానం కార్తీక సంభవం
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే  

అంటూ కార్తీక స్నానాలకు ఏ ఆటంకం కలుగకూడదని దామోదరుడిని  ప్రార్థిస్తారు. నదీజలాల్లో స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీటిని తీసుకుని  ఆలోడనం చేసి, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరంవైపు చల్లి ఒడ్డుకు రావాలి. పొడివస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణువును అర్చించి, ఆవునేతితో దీపారాధన చేయాలి. స్త్రీలు తులసిమొక్కనూ, పురుషులు ఉసిరి మొక్కను దీప సహితంగా దానం చేయాలి. కార్తీకమాసంలో  ప్రతి రోజూ కార్తీక వ్రతమహాత్మ్య కథలను తెలుసుకుని, విష్ణు శివాలయాల్లో దీపారాధన చేసేవారికి సర్వకర్మ బంధాలనుండి విముక్తి పొంది శివ లోక సాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలమంతా దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటిముందు వెలిగే దీపాలతో వీధులన్నీ ఎంతో ప్రకాశవంతంగా  శోభాయమానంగా ఉంటాయి. తెల్లవారుఝామున స్త్రీలు నదులలో, చెరువుల్లో, కోనేరుల్లో కార్తీక దీపాలను వదులుతారు. ఆకాశంలో నక్షత్రాలలాగా  ఈ నక్షత్రాలు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి.

కార్తీకమాసంలో  పాఢ్యమి, విదియ, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధులు చాలా ముఖ్యమైనవి. కార్తీకమాసంలో వచ్చే సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోముడు అంటే చంద్రుడు.సోమవారానికి చంద్రుడు అధిపతి. శివుడు చంద్ర శేఖరుడు.  అందుకే సోమవారం అంటే శివుడికి మహా ప్రీతి. సోమవారాలలో నియమనిష్టలతో శివుడిని ఆరాధించాలి.  హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివస్తుతి చేసి నదీస్నానం ఆచరించి శివాలయంలో అభిషేకం, అర్చనలు చేసి అనంతరం అన్నదానం చేసి ఆ పైన మాత్రమే భోజనం చేయాలని,  ఈ స్నాన, జప, తప విధులతో శివారాధన చేస్తే సుఖసంతోషాల జీవించి శివసాయుజ్యం పొందవచ్చునని హిందువుల నమ్మకం.

కార్తీకమాసం పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఈరోజు గోపూజ చేస్తారు. గోవును అలంకరించి పూజిస్తారు. విదియరోజు భగినీహస్త భోజన్ లేదా యమద్వితీయ అన్నా చెల్లెళ్ళ పండుగ. చవితిరోజు, నాగుల చవితి  పండుగ. ఏకాదశి రోజు శయన ఏకాదశి.చాతుర్మాస్యదీక్ష ఉపహసంహరణదినం. ద్వాదశి రోజు క్షీరాబ్ధి ద్వాదశి. దేవతలు అమృత మధనం కోసం క్షీరసాగరాన్ని మధించిన రోజు. దీనినే చిలుకు ద్వాదశి అని అంటారు. లక్ష్మీనారాయణుల పెళ్ళిరోజు. చతుర్దశి రోజు విష్ణువే స్వయంగా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించిన రోజుగా చెప్తారు.  ఇక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు నిండుగా ప్రకాశంతో వెలిగిపోయేరోజు.  ఇన్ని పండుగరోజులను  ప్రోది చేసుకున్నది కనుకే  కార్తీకమాసానికి  హిందువుల హృదయాలలో   అంత ప్రాముఖ్యం ఉంది.

 సోమవార వ్రతం అంటే ఏమిటి ?

ఇక కార్తీక మాసంలో వచ్చే  సోమవారాలను  చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారు  హైందవ సంప్రదాయంలో. శివప్రీతి కోసం సోమవారం చేయవలసిన ప్రత్యేక విధులను ఆచరిస్తే వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణం చెప్తుంది. సోమవార వ్రతం ఏవిధంగా ఆచరించాలో స్కంద పురాణంలో చెప్పబడింది. సోమవార వ్రతంలో ప్రధానమైనది ఉపవాస వ్రతం. బాలింతలైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఉపవాసాలను పూర్తి నిరాహారంగా చేయకూడదని, పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చని వాయుపురాణం చెబుతోంది. సోమవార ప్రత విధానం ప్రధానంగా ఆరు విధాలు.

1.           1.      ఉపవాసము

కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండాలి.సాయంకాలం పూట శివాలయంలో శివాబిషేకం చేసి ఆకాశంలో నక్షత్రాన్ని దర్శించుకుని తులసి తీర్థం మాత్రమే తాగాలి. 

2.        2.     ఏకభుక్తము

ఈవిధంగా పూర్తి రోజంతా ఉపవాసం చేయలేనివారు ఏకభుక్తము విధిని ఆచరించవచ్చు. ఏకభుక్తము అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయడం. ఈ విధిని చేసేవారు తెల్లవారుఝామున స్నానాలు, దీప దానాలు చేసుకుని మధ్యాహ్నం ఙోజనం చేయవచ్చు. రాత్రి మాత్రం భోజనానికి బదులుగా శైవ తీర్థమో, తులసి తీర్ధమో పుచ్చుకొని ఉపవాసం చేయాలి

3 . నక్తము
నక్తము అంటే రాత్రి అని అర్ధం. ఈ విధిని అవలంబించే వారు రోజంతా పగలు ఉపవాసం చేసి నక్షత్రాన్ని దర్శించుకుని రాత్రి భోజనం లేదా ఉపాహారం సేవించాలి.

4 . అయాచితం

కార్తీక సోమవారం ఆచరించేవారు పగలంతా శివనామ స్తోత్రం చేస్తూ ఉపవాసం చేయాలి. స్వయంగా భోజనానికి ప్రయత్నం చేయకుండా, ఎవరైనా ఆహ్వానిస్తే వారితో కలిసి భోజనం చేయవచ్చు. ఈ విధిని  అయాచితం అంటారు.

5. స్నానం 

ఈ రకమైన ఉపవాసాలు ఏవీ చేయలేని వారు మంత్రాలు చదువుతూ, తెల్లవారుఝామున స్నానాలు ఆచరించాలి. అది చేసినా చాలు. కార్తీక మాసంలో ప్రధానమైన విధి  నదీస్నానం. తలని నదిలో ముంచి పూర్తి స్నానం చేయాలి. 

6.  తిలాదానం

ఏ మంత్రాలు, జపాలు ఏ పద్ధతులు తెలియని వారు  కేవలం కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా కూడా కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందుతారు.


ఈ ఆరుపద్ధతుల్లో ఏ పద్ధతిని ఆచరించినా కార్తీకసోమవారం వ్రత ఫలితాన్ని పొందుతారు. ఈ సోమవారం వ్రతం చేసేవారు శివాలయాల్లో అభిషేకం చేయడం తప్పనిసరి. శివుడు భోళాశంకరుడు. ఓ చెంబుడు నీళ్ళు అభిషేకం చేస్తే చాలు భక్తులకు ఏ లోటు రానివ్వడు. ఈ సోమవారం వ్రతం చేయడంలో  ఓ పురాణగాధ ఉంది.

పూర్వం ఓ బ్రాహ్మణుడికి నిష్టురి అనే కూతురు ఉండేది. చాలా దుష్టగుణాలతో గయ్యాళిగా పేరుపొందింది. తండ్రి ఆమెను మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్ళి చేసాడు. భార్యగా ఆమె మిత్రశర్మను నానా బాధలకు గురించేసి హింసించింది. గయ్యాళిగా, కాముకురాలిగా గడిపి, ఆమె చేసిన పాపాల ఫలితంగా సుఖవ్యాధులతో మరణించింది. యమలోకం చేరి నానా హింసలతో కూడిన శిక్షలు పొంది, చివరకు మానవలోకంలో పదిహేనుసార్లు కుక్కగా జన్మించింది. ఆఖరి జన్మలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసం వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నడు.

ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం చేసి, శివాలయంలో అబిషేకాలు పూర్తిచేసుకుని, సోమవార వ్రత విధానం ప్రకారం నక్షత్ర దర్శనం చేసుకుని ఇంటి ఆవరణలో బలి కోసం భోజనాన్ని వదిలిపెట్టాడు. ఆ ఇంటికుక్క రోజంతా యజమానితో పాటు ఉపవాసం చేసి ఆరోజు ఏమీ దొరకక  క్షుద్బాధ పీడిస్తుండగా ఆ బలి అన్నాన్ని తిన్నది. వెటనే ఆ కుక్కకి పూర్వజన్మ స్మృతి వచ్చింది. బ్రాహ్మణుడను రక్షించమని వేడుకుంది. తనకు తన పూర్వజన్మ వివరాలు ఎలా గుర్తుకు వచ్చాయో అర్థం కాక బ్రాహ్మణుడిని తెలపమని కోరింది. బ్రాహ్మణుడు ఆ వివరాలన్నీ తెలుసుకుని  నీవు నేను వదిలిపెట్టిన బలి భోజనం తినడం వలన నీకు పూర్వ జన్మ స్మృతి ఉంది అని చెప్పాడు. మోక్షంకోసం ప్రాథేయపడిన ఆ కుక్కకి ఆ బ్రాహ్మణుడు తన సోమవార వ్రత ఫలాలలో ఒకదాన్న కుక్కకి దానం చేసాడు. ఆ కుక్క దివ్యస్త్రీగా మారి కైలాసానికి చేరుకుంది. 

ఈ విధంగా కార్తీక సోమవార వ్రతం చేసిన వారు  సర్వపాపాలనుండి విముక్తులై కైలాసానికి చేరుకుంటారని స్కాంద పురాణంలో జనకమహారాజుకి వశిష్ఠుడు తెలిపాడు.

కార్తీకమాసవ్రతం - ఆరోగ్య సూత్రాలు

ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించడంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా కనిపిస్తాయి. కార్తీక మాసం సోమవారాలలో చేసే ఉపవాసాల వలన  కడుపులో ఆహారం పూర్తిగా జీర్ణమై కడుపు శుభ్రపడుతుంది. శరీరంలోని జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరకడం వలన నవ చైతన్యం కలుగుతుంది.  కార్తీకమాసం తో చలికాలం ప్రారంభమవుతుంది. మంచి వానలు పడి వాతావరణంలో తేమ పేరుకుని ఉంటుంది. మాంసాహారం తీసుకునే వారికి జీర్ణసంబంధమైన ఇబ్బందులు తల ఎత్తే కాలం ఇది. మాంసం జీర్ణం కావాలంటే వాతావరణంలో వేడి ఉండాలి. ఈ పూజలు, నోముల రోజుల్లో మాంసాహారం నిషిద్ధం కనుక  ఉపవాసం చేసే వ్యక్తులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఉపవాస దీక్షల వలన మనోబలం నిశ్చయంగా చేకూరుతుంది.

కార్తీకమాసం రోజుల్లో చేసే నదీ స్నానాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో పడిన వర్షాల వలన నదులు నిండుగా ప్రవహిస్తుంటాయి. ప్రవహించే నదులు తమ గమనంలో ఎన్నో ఔషధీ మూలికలను తమలో కలుపుకుంటాయి. అందువలన ఈ నదులలో స్నానం చేయడం అనేది మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కార్తీకమాసంలో ఊసిరి, తులసి మొక్కలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసి మొక్క ఆరోగ్య సంబంధమైన ఓషధీగుణాల నిధి. ఈ మొక్కని ఆరాధించడంలో సౌభాగ్యమే కాదు, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే ఉసిరిక వృక్షం, ఉసిరి కాయలు ఆరోగ్యానికి సంబంధించి ఎంతో విశిష్టమైనవి. ధాత్రి అంటే ఉసిరిక. లక్ష్మీ దేవికి ఉసిరిక అంటే మహా ప్రీతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక వృక్షం క్రింద ధాత్రీదేవి, దామోదరులు ప్రతిమని ఉంచి పూజ చేస్తారు. ఈ కార్తీకమాసంలో ఉసిరిక  వృక్షాలకింద వనభోజనాలు చేయడం కూడా ఒక విధి. ఈ భోజనాలవలన సంఘ జీవనం, వ్యక్తుల మధ్య మానసిక అనుబంధాలు గట్టిపడడం వంటి మేలు జరుగుతుంది.

కార్తీకమాసం- దీపారాధన

కార్తీకమాసంలో దీపం వెలిగించడం, దీపాన్ని దానం చేయడం అనే అంశాలను కూడా ప్రత్యేకంగా చెప్పారు. నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి. మనుషులలో ఉండే స్వభావాలకు ఆధారం వారిలోని గుణాలు.  రాజస, సాత్విక, తాపన గుణాలు మనిషిలో ఉంటాయి. . ప్రమిదలో వత్తి  సత్వగుణానికి,  నూనె తమోగుణానికి,  మంట  సత్వగుణానికి ప్రతీకలు. ఇవన్నీ ఒకటికొకటి  సంపూర్ణంగా వ్యతిరేకమయిన గుణాలు.  కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. ఒక మంచి వ్యక్తిగా, పూర్ణపురుషుడిగా రూపు దాల్చాలనుకునే వారు తమలోని తామస,రజోగుణాలని అణిచిపెట్టుకోవాలి. సత్త్వ గుణాన్ని  పెంచుకోవాలి.  ఉత్తమ సాంగత్యం వలన ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడి సత్త్వ గుణం పెరుగుతుంది.  దీపం అంటే జ్ఞానానికి ప్రతీక. దీపాలను బయట వెలిగించడమే కాదు హృదయాలలో వెలిగించుకోవాలి. తద్వారా వ్యక్తుల జీవితాల్లో జ్ఞానదీపాలు ప్రకాశవంతంగా వెలుగుతాయి.
 
రాగద్వేషాలకు అతీతమైన స్వబావాన్ని పెంపు చేసుకుని సాత్వికులుగా మారిన వ్యక్తులు సమాజానికి కూడా ఆదర్శప్రాయులవుతారు. ఆరోగ్యవంతులైన ప్రజలతో కూడిన, ఒక ప్రేమపూరితమైన వాతావరణంతో సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా కార్తీకమాసంలో తెల్లవారుఝామున చేసే నదీ స్నానాలు, దీపారాధనలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు వంటి విధులన్నీ  సమాజంలో  ఒక ఆథ్యాత్మిక వాతావరణం ఏర్పరచి భక్తిభావాన్ని పెంపొందించి వ్యక్తుల సుఖజీవనానికి ఆలంబనను అందిస్తాయి.