Saturday, December 3, 2011

సరే సరే.....ఓరన్నా!! సరే సరే!!

వియోగం అత్యంత కరుణరసాత్మకమైనది. అది ఎవరిమధ్య సంభవించినా కూడా.

క్రౌంచ పక్షులమధ్య కలిగిన వియోగం ఓ బోయవానిచేత మధురమైన కావ్యమే పలికించిందట. మరి ఎంతో భాష,  కవిత్వంలోతులు తెలిసిన సినీకవుల గురించి వేరే చెప్పాలా.

భావకవితా యుగంలోను, సినీమా  గీతాలలోను ఎన్ని వియోగగీతాలు చూసి ఉంటాం - అదే, వినిఉంటాం!!

వియోగ గీతాలన్నీ  సాధారణంగా ప్రేమికుల మధ్య కలిగిన ఎడబాటునే చిత్రిస్తూ సాగుతాయి. ఈ గీతాలకు నేపథ్యం వారి మధ్య కలిగే ప్రణయానికి భంగకరంగా సంభవించే సన్నివేశాలే అయి ఉంటాయి.

కానీ ఆరుద్ర రచన  అయిన ఈ పాట వియోగ గీతాలలోనే భిన్నమైనది. సంగీత రచనలోనే కాక సాహిత్యరచనలోను, భాష, శిల్పం దృష్ట్యా కూడా కొత్తగా అనిపించి కరుణరసార్ద్రతతో హృదయం చెమ్మగిల్లుతుంది.

ఈ గీతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది యువతీ యువకుల మధ్య కలిగే ఎడబాటును, దానివల్ల కలిగే దుఃఖాన్ని చిత్రించినది కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఏదో అవగాహన లోపం వలన సంభవించిన ఎడబాటు,  ఆ వియోగం వలన ఆ ఎడబాటులోని బాధను సహించలేని హృదయం పడే ఆరాటం ఇవి ఈగీతానికి నేపథ్యమైన అంశాలు.
గీతం ఎత్తుగడ చాలా నూతనమైన విధానంలో ప్రారంభమవుతుంది.

సరే సరే ఓరన్నా సరే సరే.....అంటూ.
తెలుగు భాషలో చాలా సందర్భాలలో రక రకాలుగా, ఒక్కోసారి ఊతపదంగా కూడా ప్రయోగించబడే ఈ సరే అనే పదాన్ని ఆరుద్ర పాట ఎత్తుగడకి వాడడం లోనే ఓ కొత్తదనం కనిపిస్తుంది. సరే సరే అంటూ మనం వ్యవహారంలో వాడే మాటని -ఇక ఇంకేంలేదు కదా, అంతే కదా!! అంటూ ఆ సంభాషణకో, ఆ సందర్భానికో ముగింపుగా వాడతాం.

పాటలో కూడా సరే సరే ఓరన్నా సరే సరే అని మొదలవుతుంది. కానీ ఇక్కడా ఆ సరే సరే  అంటే ఏదో అక్కడ జరిగిన విషయం, అంతటితో  ముగిసిపోయిన విషయం గురించే కాక  ఆ విషయం చెప్పడానికి - ఓ మొదలు అని మనకు అర్థం అవుతుంది.

ఆ వెంటనే...." పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే", "గుండె కలచి కలచి ఇంక నిన్ను బాధించనులే"  అంటూ సరే సరే అంటూ పల్లవి ముగుస్తుంది. ఆ స్నేహితుడి కోసం ఎంతగానో పిలిచాడని, తన పిలుపు అతనికి ఇష్టం లేదు కాబట్టి అతనికి బాధ కలిగిందేమో అని అనుమానం వస్తుంది  కాబోలు. అందుకే ఇంక నిన్ను నా పిలుపుతో వేధించను, బాధించను అంటూ సరే సరే ఇక నిన్ను పిలవదలుచుకోలేదు అంటాడు.


వెర్రిగాలి వీచినపుడు వెదురైనా పాడుతుంది

నల్ల మబ్బు పట్టినప్పుడు నెమిలైనా ఆడుతుంది

నీ నేస్తం నీకోసం చావు కేక వేస్తే పలుకనైన పలుకవు

రాయిలా ఉలకనైన ఉలకవు........
సరే...సరే...ఓరన్నా...సరే సరే.

గాలి బాగా వీచినప్పుడు వెదురు బొంగులలోంచి ప్రవహించినపుడు వేణుగానం వినిపిస్తుంది. ఆకాశంలో నల్లగా మబ్బు పట్టినప్పుడు నెమలి ఎంతో కనువిందుగా నాట్యం చేస్తూ ఆడుతుంది. ఇవి ప్రకృతిలో ఒకదానికొకటి జతలుగా,  నేస్తాలుగా చెప్పబడుతున్నవి. ఒకటి లేనిది మరొకటి లేదు. కానీ ఈ స్నేహితుడు ఒకనాడు తనతోనే ప్రాణంగా మసిలినవాడు,  ఈనాడు  ఎంతో బాధతో మరణమాసన్నమవుతున్నవేళ వేసిన చావుకేకలాంటి తన కేక ని ఆ స్నేహితుడు ఎందుచేతనో  వినడం లేదు. కనీసం పలకనైనా పలకడం లేదు. రాయిలా ఉలకడూ పలకడూ ఆ స్నేహితుడు. ఎందువలనో తెలియడంలేదని అనుకుంటూనే సరే ఇంక ఈ జీవితానికి ఇంతే ప్రాప్తం అనుకుంటాడు.


అనుక్షణం నీపేరే పిలుచుకుంటాను
మనసులోన నీ ఊసే తలుచుకుంటాను
నీవే దిగివస్తావని నిలిచి ఉంటాను
నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను

తన బహిప్రాణంగా మసిలిన తన స్నేహితుడిని తాను మరిచిపోలేకపోతున్నాడు. అనుక్షణమూ అతని జ్ఞాపకాలు వేధిస్తున్నాయి.  అతని పేరు పదే పదే జ్ఞాపకం వస్తూఉంది. ప్రతిక్షణం మనసులో అతనితో గడిపిన కాలమే ఊహలలో కదులుతోంది.   ఏ సందర్భమూ చూపకుండా అకారణంగా తనను వదిలివెళ్ళిపోయాడు ఆ స్నేహితుడు. కారణం అతను చెప్పలేదు. కాబట్టి అతనే తనకోసం దిగిరావాలి కానీ వేరే అవకాశం లేదు. వదిలిపెట్టిన కారణం ఏదో తెలిస్తే దానికి కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నీవే దిగి వస్తావని నిలిచిఉంటాను అంటాడు. అక్షరాలనే కాక పదాలను ఇక్కడ అంత్యప్రాసలుగా వాడారు ఆరుద్ర. స్నేహితుడి చెలిమి కోసం అతను పడుతున్న ఆరాటాన్నంతా  ఈ పదాలు వెల్లడిస్తాయి.

నిజమైన ప్రేమ కానీ,  స్నేహం కానీ తమ వలపును, స్నేహాన్ని పంచిన వారి ఉన్నతినే కోరతారు కానీ నాశనాన్ని కాదు. అందుకే తనని ఇంత బాధ పెట్టి, ఏ కారణం లేకుండా తన ఖర్మానికి తనను వదిలిపెట్టిన ఆ స్నేహితుడు తనను వదిలి వెళ్ళినా అతను బాగుండాలని వేయి దేవుళ్ళను కోరుకుంటాడు తప్ప తనని కాదని వెళ్ళిన అతని నాశనాన్ని కాదు.

పాటలో పదే పదే చర్వితచరణంగా వచ్చే సరే సరే ఓరన్నా సరే సరే...సరే సరే ఓరన్నా సరే సరే అనే పదాలు
శ్రోతలోని కరుణరసోత్ర్పేరణకు సోపానాలు వేస్తూ పాట చివర పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే, గుండె కలచి కలచి ఇంక బాధించనులే అంటూ ముగించడంతో  శోకరసం శిఖరాయమాన స్థాయికి చేరి కళ్ళు చెమ్మగిల్లుతాయి.

నిజమైన స్నేహంలోని అందమైన బంధాన్నే కాదు, అది వీడిపోయినప్పుడు హృదయాలలో చెలరేగే బడబాగ్నిని కూడా ఎంతో నేర్పుగా చిత్రించి చూపారు ఆరుద్ర.

 బాలసుబ్రహ్మణ్యంగారు  పాటలోని సాహిత్యంతో లీనమై  ఎంతో గాఢమైన అనుభూతితో తాను అనుభవించి పలవరించినట్టనిపించే పాట ఇది. సరే సరే అంటూ ...అన్న అన్ని సందర్భాలలోను ఆ విషాదాన్ని తారస్థాయికి చేర్చి అతను పాటను ఆలపించిన విధానం విషాదమాధుర్యాన్ని చవిచూపుతుంది.

పాటని సినిమాలో స్నేహబంధానికి సంబంధించిన వియోగం పొందిన పాత్ర మనస్థితిని  దృష్టిలో పెట్టుకొని రాసినదే కావచ్చు.

కానీ,  ఒక్కోసారి మనం అత్యంత గాఢమైన మమతలతో అల్లుకున్న ఏ అనుబంధమైనా అపార్థానికి గురైనపుడు,  వారినుండి  వియోగం పొందినప్పుడు ఈ పాటని వింటే  అచ్చు మనం కూడా ఇలాగే అనుకున్నామే అనిపించక మానదు.
అదే పాటని పదికాలాలు నిలిపి ఉంచే జీవలక్షణం.


ఈ పాట స్నేహం సినిమా కోసం రచించబడింది. పాట రచన ఆరుద్ర. సంగీతం కె.వి.మహదేవన్.
 పాటని అత్యంత విషాదభరితంగా ఆలపించిన మధుర గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.

పాటని ఇక్కడ వినవచ్చును.

3 comments:

  1. బాగుంది...స్నేహాన్ని నిర్వచించగలరా?

    వీలు దొరికినపుడల్లా రాస్తూ ఉండండి.

    ReplyDelete
  2. అనానిమస్,
    మనఃపూర్తిగా స్నేహం చేసేవారికి స్నేహం నిర్వచనాన్ని చెప్పనవసరం లేదు. స్నేహాన్ని అదే నిర్వచించుకుంటుంది. రాస్తూనే ఉన్నానుగా. మీరు కాస్త చూస్తూనే ఉండండి. థాంక్స్.

    ReplyDelete
  3. ఏదైనా/ఎవరైనా వారి గురించి వారు చెప్పుకుంటే స్వోత్కర్ష అవుతుంది కదా.
    విఙ్ఞులైన వారు వివరిస్తేనే లోతైన వాటి అర్ధాలు స్ఫురిస్తాయి.
    సామాన్యులైన మాబోటి వారికి శ్రవణమే ఉచితం కదా....

    ReplyDelete