Saturday, December 24, 2011

రాజాధిరాజు




క్రైస్తవగీతాలు తెలుగు సినిమాలలో చాల తక్కువగానే వింటాం.  "మిస్సమ్మ" లోని 'కరుణించు మేరిమాతా' , "మేరీమాత" సినిమాలోని 'సాగరతీరసమీపాన- తరగని కావ్యసుధామధురం'  పాటలు చాలాకాలం క్రైస్తవ మతసంబంధమైన సినీ గీతాలుగా వినబడేవి. కరుణామయుడు సినిమా విడుదల అయిన తర్వాత ఆచిత్రంలో క్రీస్తుకి శిలువవేసేటప్పుడు నేపథ్యంగా వచ్చే కదిలింది కరుణరథం పాట ప్రజల హృదయాలని కరుణ రససాగరంలో ముంచేసింది. ముఖ్యంగా క్రీస్తు- "అమ్మలారా!! నాకోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లలకోసం ఏడవండి!!" అనే వాక్యాలు విన్నప్పుడే కాదు, జీవితంలో చాలా సార్లు- గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది. 
ప్రేమ, త్యాగం సేవ అనే పదాలలోని ఔన్నత్యాన్ని ప్రచారంచేసే ఆ పాట సాహిత్యం మనసుని కుదిపేస్తుంది. మత పరమైన ఆదర్శాన్ని సాహిత్య రూపంలో ప్రదర్శించడంలో గీతరచయిత మోదుకూరి జాక్సన్ కృతకృత్యుడయ్యారు.
కరుణామయుడు చిత్రం సాధించిన విజయం స్ఫూర్తితోనేమో బాపు రమణలు కూడా  క్రైస్తవమతానికి సంబంధించిన కథతో  1980లో రాజాధిరాజు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దైవాన్ని నమ్మని మనిషి తన జీవితాన్నే కాక సమాజాన్ని ఏవిధంగా అస్తవ్యస్తం చేస్తాడో, ఆ దైవం కరుణించి అభయహస్తం అందించిననాడు ఆ జీవి ఏ విధంగా ధన్యత పొందుతాడు అనే అంశాన్ని కథా వస్తువుగా స్వీకరించారు.  మనిషిలోని చెడు - మంచితనం మీద పెత్తనం చేయడం అనే అంశాన్ని  వివరిస్తూ క్రైస్తవమతగ్రంధాలలో చెడుకి ప్రతినిధిగా కనిపించే  సైతాను పాత్రను ఈ సినిమా కథలో  'నైతాసు'  అనే పేరుతో  సృష్టించి సైతాను చేయించే పనులన్నీ ఆ పాత్రతో చేయించారు కథా రచయిత(ముళ్ళపూడి వెంకట రమణ). తద్వారా చెడుమీద అసహ్యాన్ని, చెడ్డతనంమీద జుగుప్సనీ కలిగించడం, మంచిగా ఉండడంలోని గొప్పతాన్ని నిరూపించడం రచయిత ఉద్దేశం.

మనిషై పుట్టినవాడికి ఉండవలసిన లక్షణాలు,  సర్వమానవ జాతిని తనతో సమానంగా ప్రేమించి, తనకన్నా దైన్యస్థితిలో ఉన్నవారికి తన ప్రేమను పంచి సేవాభావంతో వారిని చేరదీయడం. ఎప్పుడైతే మనిషిలో ఈ విధమైన లక్షణం నశిస్తుందో అప్పుడే మనిషిగా అతని పతనం ప్రారంభమవుతుంది. సరిగ్గా అప్పుడే అతనికి దైవ సహాయం అవసరం అవుతుంది కూడా. అటువంటి స్థితిలో ఉన్న తన మరిదిని, కన్నకొడుకులాగా తన చేతులమీద  పెంచిన వాడిని, క్రమ క్రమంగా  పరిస్థితులప్రభావంతో అతనిలో పతనమయిపోతున్న విలువలను గమనిస్తూ, అతన్ని ఓ మంచి దారిలోకి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తుంది ఓ వదిన. కానీ  తన ప్రయత్నం ఎంతవరకూ  ఫలిస్తుందో తెలియని స్థితిలో తనమరిది జీవితాన్ని మార్చమని సకల జీవరాశికి ప్రభువైన ఆ పరమాత్ముడిని వేడుకుంటూ ఉన్న ఆ వదిన లోని స్త్రీమూర్తి మనో వేదనని, ఓ తల్లి తన బిడ్డకోసం పడే వేదనలోని  ఆరాటాన్ని, పాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూనే ఎన్నో సత్యాలను అలవోకగా ప్రదర్శించారు పాట రచయిత వేటూరి సుందరరామ మూర్తి.

చీకటినిండిన మానవుల జీవితాలలో వెలుగుదివ్వెలు కాంతులు విరజిమ్మాలని, సకల జనులకూ రక్షణ ఇవ్వగల సమర్థుడు ఆ ప్రభువు మాత్రమేనని, మనిషికి ఏర్పడే కష్టకాలం అతని శోధన (పరీక్ష)లో  ఓ భాగమని, ఆ  ప్రభువును  శరణువేడితే ఈ పరీక్షలో నెగ్గి సత్యాన్ని తెలుసుకోగలుగుతామని నమ్మిన ఆ స్త్రీమూర్తి ఆలపించే పాట ద్వారా  జీవితంలో ఎన్నో సందర్బాలలో మనిషి ప్రవర్తనను సునిశితమైన పరిశీలనతో అలతి అలతి మాటలతో  గీత రచయిత ప్రదర్శించారు. 
మనిషి ఎన్ని రాజ్యాలు సంపాదించినా, ఎంత పరాక్రమం ప్రదర్శించినా దానికి కారణం, అతనిలో పుష్కలంగా ధైర్య స్థైర్యాలు,జవజీవాలు ఉండాలంటే దానికి ఆలంబనం  ఆ ప్రభువే. అవన్నీ మరియ తనయుడైన ఆ క్రీస్తు దయ వల్లనే మనిషికి అవి సమకూరుతాయి. అతను మధురమయిన హృదయం కలిగిన వాడు. అంతే కాదు. అణువణునా కరుణరసం నింపుకున్నవాడు. అమిత కారుణ్య మూర్తి.  ఆ ప్రభువే దయతో  మనకి  ప్రసాదించవలసిన వాడు.

మనిషికి బ్రతకడానికి కావలసిన వాటిలో ప్రధానమైనవి తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికింత నీడ. ఇవి చాలు. కానీ మనకి ఆ ప్రభువు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కొరత మిగిలిపోతూనే ఉంటుంది. పీత కష్టాలు పీతవి అన్నట్టు ఏ స్థాయిలో ఎంత ఐశ్వర్యం ఉన్నా మనిషికి తృప్తికలగదు.ఎంత ఉన్నా ఇంకా కావాలనే అంటుంది మనిషిలోని స్వార్థం. అలా అని భగవంతుడు మనిషికి కావలసిన దానికన్నా ఐశ్వర్యం ప్రసాదిస్తే అతనికి అహంకారం నెత్తికెక్కుతుంది. కన్ను మిన్ను కానడు. మనిషి ప్రపంచాన్ని డబ్బుకళ్లతో చూడడం మొదలుపెడితే సమాజానికి ప్రమాదం. 


డబ్బు మంచిదికాదు కదా అని అది మనిషికి జబ్బు చేస్తుంది అనుకొని భగవంతుడు మనిషికి ఐశ్వర్యం ఇవ్వకుండా బీదవాడిగానే ఉంచితే, తను సంపాదించే సొమ్ము తో కనీసం తన కడుపుకు కావలసినంత కబళం కూడా సంపాదించుకోలేకపోతే ఇక మనిషిలో  ఆత్మవిశ్వాసం నశిస్తుంది. నీతి నియమాలను తుంగలో తొక్కుతాడు. తన ప్రాణాన్ని నిలపడానికి వీలు కల్పించలేని సాంఘిక నియమాలని తోసిరాజంటాడు.  

అందువలన మనిషికి కావలసింది ఎంత అంటే దానికి నిర్వచనం ఎవరూ చెప్పలేరు. కేవలం అతనిని సృష్టించిన ఆ ప్రభువుకి మాత్రమే తెలుసు ఎంత ఇవ్వాలో. మనిషి జీవించడానికి కావలసినంత సంపద మాత్రమే ఇచ్చి, ఆ సంపదతో పాటు మనశ్శాంతితోను,  తన తోటివారిని  ప్రేమిస్తూ, ఉన్నదాంతో తృప్తిగా బ్రతికే జీవితం ఇవ్వమని అదే మనిషిని మనిషిగా నిలుపుతుందని ప్రభువును వేడుకుంటుంది ఆమె. మనిషి మనిషిగా మిగిలే రోజు వచ్చిననాడు, ప్రపంచంలోని మానవులందరి హృదయాలు ఆ ప్రభువు గుడిలో వెలిగించే దీపాల్లా వెలుగులతో ప్రకాశిస్తాయి. మొత్తం ప్రపంచమంతా ఆ ప్రభువుకి కోవెలగా మారిపోతుంది అంటుంది.

మనిషికి కనీసావసరాలు కూడు,గూడు, బట్ట. ఇవి తీరిపోయాక కావలసినవి సమాజంలో ఓ స్థానం. ఉన్న స్థానం కన్నా ఉన్నతమైన స్థానం కోసం మనిషి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అడవిలో మృగాలు  తమకంటే బలహీనమైనవాటి పై అధికారాన్ని ప్రదర్శిస్తాయో మనిషి కూడా తన కన్నా బలహీనులైన వారిపైన తన అధికారాన్ని ప్రదర్శించి తృప్తిపడతాడు. ఇది మనిషిలోని మృగలక్షణం. అందువలన అధికారం పొంది ఇతరులపై పెత్తనం చేయాలనుకునేవారు అర్హతలేనివారయితే సమాజానికి కలిగే హాని అంతా ఇంతా కాదు. రాజు ధర్మం తప్పాడు అంటే సమాజానికి జరిగే హానిని ఊహించలేము. అందువలన అర్హత కలిగినవారి చేతిలోనే అధికారం ఉండాలి.  

మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండలేడు. తన జీవితంలో ఎదురైన రకరకాల పరిస్థితులు అతనిని ఒక్కో విధంగా తీర్చి దిద్దుతాయి.  అధర్మ పరుడై జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నవాడు ఎవరైనా ఉంటే, అది వాడి ఖర్మ అనుకొని, అతనిని భగవంతుడు కూడా చేరదీయకపోతే, అతనిలో జ్ఞానం కలిగించకపోతే ఆ నీతినియమాలు తప్పిన మనిషి లో  కనీస విచక్షణ నశిస్తుంది. మనిషిలో పశు ప్రవృత్తి బయటపడి  మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన అర్హతలేనివారి చేతికి అధికారం ఇవ్వకుండా చూసుకోవడమే కాక, ఏవో పరిస్థితులవలన ఎవరైనా దారితప్పి, అధర్మమార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అటువంటివారికి ఆపన్న హస్తం అందించి కాపాడవలసిన బాధ్యత కూడా ఆ ప్రభువే వహించాలి అంటుంది ఆమె. 

అర్హతకలిగిన వారి చేతిలోనే అధికారం ఉంటే  ప్రజా జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది. ప్రజలంతో తమ మనసులలో సహనం, క్షమా భావం పెంచుకోవడం వలన సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. ప్రతి జీవికి రక్షణ లభిస్తుంది.  ప్రతి మనిషి తనువులో, అణువణువులో నిండిపోయిన దైవం మనిషిలో ఆత్మ బలాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. 

ఈ విధంగా దైవం మనిషి పట్ల వహించవలసిన బాధ్యతను దైవానికే మరోసారి గుర్తుచేస్తూ మనిషిని మంచివేపు నడిపించమని ప్రార్థిస్తుంది ఆమె. ఆ విధంగా మనిషిని రక్షించే శక్తి ఉన్న ఆ ప్రభువు లోని గొప్పదనాన్ని వర్ణిస్తుందిక్కడ. అతని ఘటనా ఘటన సామర్థ్యం, శరణువేడినవారిని కరుణించే ఆ ప్రభువు  దయార్ద్ర హృదయాన్ని వివరిస్తుంది.

ప్రజలకోసం, వారి సౌఖ్యంకోసం తన రక్తాన్ని చిందించాడు ఏసు ప్రభువు. అతని తనువునుండి ప్రవహించిన రక్తంతో  ప్రజల పాపాలన్నీ కొట్టుకుపోయాయి. తనని నమ్మినవారికోసం అతను చేసిన త్యాగం ఎంతో అద్భుతమైనది. అతనికి మరణం లేదు. అతను మరణాన్ని గెలిచి పునరుద్భవించడం వలన లోకాలన్నీ అతని రక్షణలో సేదదీరాయి. లోకంలో  ఇక అంతా ఆనందమే. శోక భావం మరణించింది. లోకంలో  మానవులు అనుభవించే చావు, పుట్టుక అనే సహజ ధర్మాలన్నీ ఆ ప్రభువుకు శ్వాసక్రియలో ఓభాగం. మానవులను దయగా చూసినా, దండన విధించి శిక్షించినా అది అతను విధించే పరీక్షయే కానీ మరేమీ కాదు. లోకంలో మనం అనుభవించే  కష్టసుఖాలన్నీ వెలుగు నీడలలాంటి  దోబూచులాట.  అంతా మాయే, మనం సుఖం అనుకుంటూ  అనుభవించేదంతా మిథ్యే, కేవలం ఆ భగవంతుడైన ప్రభువు మాత్రమే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ఈ మాయని ఛేదించడానికి ప్రయత్నం చేయాలి. మనిషిలో ఈ ప్రయత్నం ప్రారంభం జరగాలంటే కూడా ఆ దైవమే సహకరించాలి.

అందుకే మహిమ చూపవయ్యా..నీ మహిమ చూపవయ్యా అని ఎలుగెత్తి ప్రార్థిస్తుంది ఆమె.



క్రైస్తవమత ప్రచారంలో, ఉపన్యాసాలలో మనం తరచు వినే పదాలు, వాక్యాల విరుపులూ తొంగిచూస్తూ ఉన్నా కేవలం మత ప్రచారగీతంలా కాక మనిషి జీవితాన్ని వ్యాఖ్యానం చేస్తూ, మనిషి మనిషిగా, మానవత్వం తో మనీషిగా మారడానికి కావలసినదేమిటో అన్న విషయాన్ని ఆలోచిస్తూ,  ఆ విధంగా జరగడానికి కావలసిన దైవ సహాయాన్ని ఆకాంక్షిస్తూ, ఆ ప్రభువు శరణాగత వాత్సల్యాన్ని నిరూపిస్తూ మూడు చరణాలలో  సాగింది

- ఈ గీతం.

 ఈ గీతంలో కవి చెప్పిన విషయాలు క్రైస్తవమతానికే కాక సర్వమతాలకు వర్తించేవి. మనిషి సంసారంలోను, లోకంలోను ఉన్న మాయను గుర్తించి,  లేనిదానికోసం తపించడం మాని ఉన్న దాంతో తృప్తిపడుతూ, ప్రేమ, క్షమ లను జీవితాదర్శాలుగా గ్రహించి    తోటివారిని మనిషిగా గుర్తించడం జరిగిన నాడు లోకంలో మనిషి మనుగడ సుఖశాంతులతో సాగుతుంది. మంచితనంతో మనసులను నింపుకొని మాయను ఛేదించి సత్యాన్ని శోధించే దిశగా మనిషి ప్రయాణం సాగితే  మనిషి ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు. తనలోనే భగవంతుడిని దర్శించగలుగుతాడు. సర్వమత సారాంశం బోధించే నీతి ఇదే.


చిత్రం              రాజాధిరాజు (1980)

బానర్             రమాచిత్ర
దర్శకుడు         బాపు
సంగీతదర్శకుడు  కె.వి. మహదేవన్
గీత రచయిత      వేటూరి సుందరరామ మూర్తి
గానం              పి. సుశీల



Saturday, December 3, 2011

సరే సరే.....ఓరన్నా!! సరే సరే!!

వియోగం అత్యంత కరుణరసాత్మకమైనది. అది ఎవరిమధ్య సంభవించినా కూడా.

క్రౌంచ పక్షులమధ్య కలిగిన వియోగం ఓ బోయవానిచేత మధురమైన కావ్యమే పలికించిందట. మరి ఎంతో భాష,  కవిత్వంలోతులు తెలిసిన సినీకవుల గురించి వేరే చెప్పాలా.

భావకవితా యుగంలోను, సినీమా  గీతాలలోను ఎన్ని వియోగగీతాలు చూసి ఉంటాం - అదే, వినిఉంటాం!!

వియోగ గీతాలన్నీ  సాధారణంగా ప్రేమికుల మధ్య కలిగిన ఎడబాటునే చిత్రిస్తూ సాగుతాయి. ఈ గీతాలకు నేపథ్యం వారి మధ్య కలిగే ప్రణయానికి భంగకరంగా సంభవించే సన్నివేశాలే అయి ఉంటాయి.

కానీ ఆరుద్ర రచన  అయిన ఈ పాట వియోగ గీతాలలోనే భిన్నమైనది. సంగీత రచనలోనే కాక సాహిత్యరచనలోను, భాష, శిల్పం దృష్ట్యా కూడా కొత్తగా అనిపించి కరుణరసార్ద్రతతో హృదయం చెమ్మగిల్లుతుంది.

ఈ గీతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది యువతీ యువకుల మధ్య కలిగే ఎడబాటును, దానివల్ల కలిగే దుఃఖాన్ని చిత్రించినది కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఏదో అవగాహన లోపం వలన సంభవించిన ఎడబాటు,  ఆ వియోగం వలన ఆ ఎడబాటులోని బాధను సహించలేని హృదయం పడే ఆరాటం ఇవి ఈగీతానికి నేపథ్యమైన అంశాలు.
గీతం ఎత్తుగడ చాలా నూతనమైన విధానంలో ప్రారంభమవుతుంది.

సరే సరే ఓరన్నా సరే సరే.....అంటూ.
తెలుగు భాషలో చాలా సందర్భాలలో రక రకాలుగా, ఒక్కోసారి ఊతపదంగా కూడా ప్రయోగించబడే ఈ సరే అనే పదాన్ని ఆరుద్ర పాట ఎత్తుగడకి వాడడం లోనే ఓ కొత్తదనం కనిపిస్తుంది. సరే సరే అంటూ మనం వ్యవహారంలో వాడే మాటని -ఇక ఇంకేంలేదు కదా, అంతే కదా!! అంటూ ఆ సంభాషణకో, ఆ సందర్భానికో ముగింపుగా వాడతాం.

పాటలో కూడా సరే సరే ఓరన్నా సరే సరే అని మొదలవుతుంది. కానీ ఇక్కడా ఆ సరే సరే  అంటే ఏదో అక్కడ జరిగిన విషయం, అంతటితో  ముగిసిపోయిన విషయం గురించే కాక  ఆ విషయం చెప్పడానికి - ఓ మొదలు అని మనకు అర్థం అవుతుంది.

ఆ వెంటనే...." పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే", "గుండె కలచి కలచి ఇంక నిన్ను బాధించనులే"  అంటూ సరే సరే అంటూ పల్లవి ముగుస్తుంది. ఆ స్నేహితుడి కోసం ఎంతగానో పిలిచాడని, తన పిలుపు అతనికి ఇష్టం లేదు కాబట్టి అతనికి బాధ కలిగిందేమో అని అనుమానం వస్తుంది  కాబోలు. అందుకే ఇంక నిన్ను నా పిలుపుతో వేధించను, బాధించను అంటూ సరే సరే ఇక నిన్ను పిలవదలుచుకోలేదు అంటాడు.


వెర్రిగాలి వీచినపుడు వెదురైనా పాడుతుంది

నల్ల మబ్బు పట్టినప్పుడు నెమిలైనా ఆడుతుంది

నీ నేస్తం నీకోసం చావు కేక వేస్తే పలుకనైన పలుకవు

రాయిలా ఉలకనైన ఉలకవు........
సరే...సరే...ఓరన్నా...సరే సరే.

గాలి బాగా వీచినప్పుడు వెదురు బొంగులలోంచి ప్రవహించినపుడు వేణుగానం వినిపిస్తుంది. ఆకాశంలో నల్లగా మబ్బు పట్టినప్పుడు నెమలి ఎంతో కనువిందుగా నాట్యం చేస్తూ ఆడుతుంది. ఇవి ప్రకృతిలో ఒకదానికొకటి జతలుగా,  నేస్తాలుగా చెప్పబడుతున్నవి. ఒకటి లేనిది మరొకటి లేదు. కానీ ఈ స్నేహితుడు ఒకనాడు తనతోనే ప్రాణంగా మసిలినవాడు,  ఈనాడు  ఎంతో బాధతో మరణమాసన్నమవుతున్నవేళ వేసిన చావుకేకలాంటి తన కేక ని ఆ స్నేహితుడు ఎందుచేతనో  వినడం లేదు. కనీసం పలకనైనా పలకడం లేదు. రాయిలా ఉలకడూ పలకడూ ఆ స్నేహితుడు. ఎందువలనో తెలియడంలేదని అనుకుంటూనే సరే ఇంక ఈ జీవితానికి ఇంతే ప్రాప్తం అనుకుంటాడు.


అనుక్షణం నీపేరే పిలుచుకుంటాను
మనసులోన నీ ఊసే తలుచుకుంటాను
నీవే దిగివస్తావని నిలిచి ఉంటాను
నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను

తన బహిప్రాణంగా మసిలిన తన స్నేహితుడిని తాను మరిచిపోలేకపోతున్నాడు. అనుక్షణమూ అతని జ్ఞాపకాలు వేధిస్తున్నాయి.  అతని పేరు పదే పదే జ్ఞాపకం వస్తూఉంది. ప్రతిక్షణం మనసులో అతనితో గడిపిన కాలమే ఊహలలో కదులుతోంది.   ఏ సందర్భమూ చూపకుండా అకారణంగా తనను వదిలివెళ్ళిపోయాడు ఆ స్నేహితుడు. కారణం అతను చెప్పలేదు. కాబట్టి అతనే తనకోసం దిగిరావాలి కానీ వేరే అవకాశం లేదు. వదిలిపెట్టిన కారణం ఏదో తెలిస్తే దానికి కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నీవే దిగి వస్తావని నిలిచిఉంటాను అంటాడు. అక్షరాలనే కాక పదాలను ఇక్కడ అంత్యప్రాసలుగా వాడారు ఆరుద్ర. స్నేహితుడి చెలిమి కోసం అతను పడుతున్న ఆరాటాన్నంతా  ఈ పదాలు వెల్లడిస్తాయి.

నిజమైన ప్రేమ కానీ,  స్నేహం కానీ తమ వలపును, స్నేహాన్ని పంచిన వారి ఉన్నతినే కోరతారు కానీ నాశనాన్ని కాదు. అందుకే తనని ఇంత బాధ పెట్టి, ఏ కారణం లేకుండా తన ఖర్మానికి తనను వదిలిపెట్టిన ఆ స్నేహితుడు తనను వదిలి వెళ్ళినా అతను బాగుండాలని వేయి దేవుళ్ళను కోరుకుంటాడు తప్ప తనని కాదని వెళ్ళిన అతని నాశనాన్ని కాదు.

పాటలో పదే పదే చర్వితచరణంగా వచ్చే సరే సరే ఓరన్నా సరే సరే...సరే సరే ఓరన్నా సరే సరే అనే పదాలు
శ్రోతలోని కరుణరసోత్ర్పేరణకు సోపానాలు వేస్తూ పాట చివర పిలిచి పిలిచి ఇంక నిన్ను వేధించనులే, గుండె కలచి కలచి ఇంక బాధించనులే అంటూ ముగించడంతో  శోకరసం శిఖరాయమాన స్థాయికి చేరి కళ్ళు చెమ్మగిల్లుతాయి.

నిజమైన స్నేహంలోని అందమైన బంధాన్నే కాదు, అది వీడిపోయినప్పుడు హృదయాలలో చెలరేగే బడబాగ్నిని కూడా ఎంతో నేర్పుగా చిత్రించి చూపారు ఆరుద్ర.

 బాలసుబ్రహ్మణ్యంగారు  పాటలోని సాహిత్యంతో లీనమై  ఎంతో గాఢమైన అనుభూతితో తాను అనుభవించి పలవరించినట్టనిపించే పాట ఇది. సరే సరే అంటూ ...అన్న అన్ని సందర్భాలలోను ఆ విషాదాన్ని తారస్థాయికి చేర్చి అతను పాటను ఆలపించిన విధానం విషాదమాధుర్యాన్ని చవిచూపుతుంది.

పాటని సినిమాలో స్నేహబంధానికి సంబంధించిన వియోగం పొందిన పాత్ర మనస్థితిని  దృష్టిలో పెట్టుకొని రాసినదే కావచ్చు.

కానీ,  ఒక్కోసారి మనం అత్యంత గాఢమైన మమతలతో అల్లుకున్న ఏ అనుబంధమైనా అపార్థానికి గురైనపుడు,  వారినుండి  వియోగం పొందినప్పుడు ఈ పాటని వింటే  అచ్చు మనం కూడా ఇలాగే అనుకున్నామే అనిపించక మానదు.
అదే పాటని పదికాలాలు నిలిపి ఉంచే జీవలక్షణం.


ఈ పాట స్నేహం సినిమా కోసం రచించబడింది. పాట రచన ఆరుద్ర. సంగీతం కె.వి.మహదేవన్.
 పాటని అత్యంత విషాదభరితంగా ఆలపించిన మధుర గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.

పాటని ఇక్కడ వినవచ్చును.