క్రైస్తవగీతాలు తెలుగు సినిమాలలో చాల తక్కువగానే వింటాం. "మిస్సమ్మ" లోని 'కరుణించు మేరిమాతా' , "మేరీమాత" సినిమాలోని 'సాగరతీరసమీపాన- తరగని కావ్యసుధామధురం' పాటలు చాలాకాలం క్రైస్తవ మతసంబంధమైన సినీ గీతాలుగా వినబడేవి. కరుణామయుడు సినిమా విడుదల అయిన తర్వాత ఆచిత్రంలో క్రీస్తుకి శిలువవేసేటప్పుడు నేపథ్యంగా వచ్చే కదిలింది కరుణరథం పాట ప్రజల హృదయాలని కరుణ రససాగరంలో ముంచేసింది. ముఖ్యంగా క్రీస్తు- "అమ్మలారా!! నాకోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లలకోసం ఏడవండి!!" అనే వాక్యాలు విన్నప్పుడే కాదు, జీవితంలో చాలా సార్లు- గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది.
ప్రేమ, త్యాగం సేవ అనే పదాలలోని ఔన్నత్యాన్ని ప్రచారంచేసే ఆ పాట సాహిత్యం మనసుని కుదిపేస్తుంది. మత పరమైన ఆదర్శాన్ని సాహిత్య రూపంలో ప్రదర్శించడంలో గీతరచయిత మోదుకూరి జాక్సన్ కృతకృత్యుడయ్యారు.
కరుణామయుడు చిత్రం సాధించిన విజయం స్ఫూర్తితోనేమో బాపు రమణలు కూడా క్రైస్తవమతానికి సంబంధించిన కథతో 1980లో రాజాధిరాజు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దైవాన్ని నమ్మని మనిషి తన జీవితాన్నే కాక సమాజాన్ని ఏవిధంగా అస్తవ్యస్తం చేస్తాడో, ఆ దైవం కరుణించి అభయహస్తం అందించిననాడు ఆ జీవి ఏ విధంగా ధన్యత పొందుతాడు అనే అంశాన్ని కథా వస్తువుగా స్వీకరించారు. మనిషిలోని చెడు - మంచితనం మీద పెత్తనం చేయడం అనే అంశాన్ని వివరిస్తూ క్రైస్తవమతగ్రంధాలలో చెడుకి ప్రతినిధిగా కనిపించే సైతాను పాత్రను ఈ సినిమా కథలో 'నైతాసు' అనే పేరుతో సృష్టించి సైతాను చేయించే పనులన్నీ ఆ పాత్రతో చేయించారు కథా రచయిత(ముళ్ళపూడి వెంకట రమణ). తద్వారా చెడుమీద అసహ్యాన్ని, చెడ్డతనంమీద జుగుప్సనీ కలిగించడం, మంచిగా ఉండడంలోని గొప్పతాన్ని నిరూపించడం రచయిత ఉద్దేశం.
మనిషై పుట్టినవాడికి ఉండవలసిన లక్షణాలు, సర్వమానవ జాతిని తనతో సమానంగా ప్రేమించి, తనకన్నా దైన్యస్థితిలో ఉన్నవారికి తన ప్రేమను పంచి సేవాభావంతో వారిని చేరదీయడం. ఎప్పుడైతే మనిషిలో ఈ విధమైన లక్షణం నశిస్తుందో అప్పుడే మనిషిగా అతని పతనం ప్రారంభమవుతుంది. సరిగ్గా అప్పుడే అతనికి దైవ సహాయం అవసరం అవుతుంది కూడా. అటువంటి స్థితిలో ఉన్న తన మరిదిని, కన్నకొడుకులాగా తన చేతులమీద పెంచిన వాడిని, క్రమ క్రమంగా పరిస్థితులప్రభావంతో అతనిలో పతనమయిపోతున్న విలువలను గమనిస్తూ, అతన్ని ఓ మంచి దారిలోకి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తుంది ఓ వదిన. కానీ తన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో తెలియని స్థితిలో తనమరిది జీవితాన్ని మార్చమని సకల జీవరాశికి ప్రభువైన ఆ పరమాత్ముడిని వేడుకుంటూ ఉన్న ఆ వదిన లోని స్త్రీమూర్తి మనో వేదనని, ఓ తల్లి తన బిడ్డకోసం పడే వేదనలోని ఆరాటాన్ని, పాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూనే ఎన్నో సత్యాలను అలవోకగా ప్రదర్శించారు పాట రచయిత వేటూరి సుందరరామ మూర్తి.
చీకటినిండిన మానవుల జీవితాలలో వెలుగుదివ్వెలు కాంతులు విరజిమ్మాలని, సకల జనులకూ రక్షణ ఇవ్వగల సమర్థుడు ఆ ప్రభువు మాత్రమేనని, మనిషికి ఏర్పడే కష్టకాలం అతని శోధన (పరీక్ష)లో ఓ భాగమని, ఆ ప్రభువును శరణువేడితే ఈ పరీక్షలో నెగ్గి సత్యాన్ని తెలుసుకోగలుగుతామని నమ్మిన ఆ స్త్రీమూర్తి ఆలపించే పాట ద్వారా జీవితంలో ఎన్నో సందర్బాలలో మనిషి ప్రవర్తనను సునిశితమైన పరిశీలనతో అలతి అలతి మాటలతో గీత రచయిత ప్రదర్శించారు.
మనిషి ఎన్ని రాజ్యాలు సంపాదించినా, ఎంత పరాక్రమం ప్రదర్శించినా దానికి కారణం, అతనిలో పుష్కలంగా ధైర్య స్థైర్యాలు,జవజీవాలు ఉండాలంటే దానికి ఆలంబనం ఆ ప్రభువే. అవన్నీ మరియ తనయుడైన ఆ క్రీస్తు దయ వల్లనే మనిషికి అవి సమకూరుతాయి. అతను మధురమయిన హృదయం కలిగిన వాడు. అంతే కాదు. అణువణునా కరుణరసం నింపుకున్నవాడు. అమిత కారుణ్య మూర్తి. ఆ ప్రభువే దయతో మనకి ప్రసాదించవలసిన వాడు.
మనిషికి బ్రతకడానికి కావలసిన వాటిలో ప్రధానమైనవి తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికింత నీడ. ఇవి చాలు. కానీ మనకి ఆ ప్రభువు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కొరత మిగిలిపోతూనే ఉంటుంది. పీత కష్టాలు పీతవి అన్నట్టు ఏ స్థాయిలో ఎంత ఐశ్వర్యం ఉన్నా మనిషికి తృప్తికలగదు.ఎంత ఉన్నా ఇంకా కావాలనే అంటుంది మనిషిలోని స్వార్థం. అలా అని భగవంతుడు మనిషికి కావలసిన దానికన్నా ఐశ్వర్యం ప్రసాదిస్తే అతనికి అహంకారం నెత్తికెక్కుతుంది. కన్ను మిన్ను కానడు. మనిషి ప్రపంచాన్ని డబ్బుకళ్లతో చూడడం మొదలుపెడితే సమాజానికి ప్రమాదం.
డబ్బు మంచిదికాదు కదా అని అది మనిషికి జబ్బు చేస్తుంది అనుకొని భగవంతుడు మనిషికి ఐశ్వర్యం ఇవ్వకుండా బీదవాడిగానే ఉంచితే, తను సంపాదించే సొమ్ము తో కనీసం తన కడుపుకు కావలసినంత కబళం కూడా సంపాదించుకోలేకపోతే ఇక మనిషిలో ఆత్మవిశ్వాసం నశిస్తుంది. నీతి నియమాలను తుంగలో తొక్కుతాడు. తన ప్రాణాన్ని నిలపడానికి వీలు కల్పించలేని సాంఘిక నియమాలని తోసిరాజంటాడు.
అందువలన మనిషికి కావలసింది ఎంత అంటే దానికి నిర్వచనం ఎవరూ చెప్పలేరు. కేవలం అతనిని సృష్టించిన ఆ ప్రభువుకి మాత్రమే తెలుసు ఎంత ఇవ్వాలో. మనిషి జీవించడానికి కావలసినంత సంపద మాత్రమే ఇచ్చి, ఆ సంపదతో పాటు మనశ్శాంతితోను, తన తోటివారిని ప్రేమిస్తూ, ఉన్నదాంతో తృప్తిగా బ్రతికే జీవితం ఇవ్వమని అదే మనిషిని మనిషిగా నిలుపుతుందని ప్రభువును వేడుకుంటుంది ఆమె. మనిషి మనిషిగా మిగిలే రోజు వచ్చిననాడు, ప్రపంచంలోని మానవులందరి హృదయాలు ఆ ప్రభువు గుడిలో వెలిగించే దీపాల్లా వెలుగులతో ప్రకాశిస్తాయి. మొత్తం ప్రపంచమంతా ఆ ప్రభువుకి కోవెలగా మారిపోతుంది అంటుంది.
మనిషికి కనీసావసరాలు కూడు,గూడు, బట్ట. ఇవి తీరిపోయాక కావలసినవి సమాజంలో ఓ స్థానం. ఉన్న స్థానం కన్నా ఉన్నతమైన స్థానం కోసం మనిషి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అడవిలో మృగాలు తమకంటే బలహీనమైనవాటి పై అధికారాన్ని ప్రదర్శిస్తాయో మనిషి కూడా తన కన్నా బలహీనులైన వారిపైన తన అధికారాన్ని ప్రదర్శించి తృప్తిపడతాడు. ఇది మనిషిలోని మృగలక్షణం. అందువలన అధికారం పొంది ఇతరులపై పెత్తనం చేయాలనుకునేవారు అర్హతలేనివారయితే సమాజానికి కలిగే హాని అంతా ఇంతా కాదు. రాజు ధర్మం తప్పాడు అంటే సమాజానికి జరిగే హానిని ఊహించలేము. అందువలన అర్హత కలిగినవారి చేతిలోనే అధికారం ఉండాలి.
మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండలేడు. తన జీవితంలో ఎదురైన రకరకాల పరిస్థితులు అతనిని ఒక్కో విధంగా తీర్చి దిద్దుతాయి. అధర్మ పరుడై జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నవాడు ఎవరైనా ఉంటే, అది వాడి ఖర్మ అనుకొని, అతనిని భగవంతుడు కూడా చేరదీయకపోతే, అతనిలో జ్ఞానం కలిగించకపోతే ఆ నీతినియమాలు తప్పిన మనిషి లో కనీస విచక్షణ నశిస్తుంది. మనిషిలో పశు ప్రవృత్తి బయటపడి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన అర్హతలేనివారి చేతికి అధికారం ఇవ్వకుండా చూసుకోవడమే కాక, ఏవో పరిస్థితులవలన ఎవరైనా దారితప్పి, అధర్మమార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అటువంటివారికి ఆపన్న హస్తం అందించి కాపాడవలసిన బాధ్యత కూడా ఆ ప్రభువే వహించాలి అంటుంది ఆమె.
అర్హతకలిగిన వారి చేతిలోనే అధికారం ఉంటే ప్రజా జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది. ప్రజలంతో తమ మనసులలో సహనం, క్షమా భావం పెంచుకోవడం వలన సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. ప్రతి జీవికి రక్షణ లభిస్తుంది. ప్రతి మనిషి తనువులో, అణువణువులో నిండిపోయిన దైవం మనిషిలో ఆత్మ బలాన్ని, ధైర్యాన్ని నింపుతుంది.
ఈ విధంగా దైవం మనిషి పట్ల వహించవలసిన బాధ్యతను దైవానికే మరోసారి గుర్తుచేస్తూ మనిషిని మంచివేపు నడిపించమని ప్రార్థిస్తుంది ఆమె. ఆ విధంగా మనిషిని రక్షించే శక్తి ఉన్న ఆ ప్రభువు లోని గొప్పదనాన్ని వర్ణిస్తుందిక్కడ. అతని ఘటనా ఘటన సామర్థ్యం, శరణువేడినవారిని కరుణించే ఆ ప్రభువు దయార్ద్ర హృదయాన్ని వివరిస్తుంది.
ప్రజలకోసం, వారి సౌఖ్యంకోసం తన రక్తాన్ని చిందించాడు ఏసు ప్రభువు. అతని తనువునుండి ప్రవహించిన రక్తంతో ప్రజల పాపాలన్నీ కొట్టుకుపోయాయి. తనని నమ్మినవారికోసం అతను చేసిన త్యాగం ఎంతో అద్భుతమైనది. అతనికి మరణం లేదు. అతను మరణాన్ని గెలిచి పునరుద్భవించడం వలన లోకాలన్నీ అతని రక్షణలో సేదదీరాయి. లోకంలో ఇక అంతా ఆనందమే. శోక భావం మరణించింది. లోకంలో మానవులు అనుభవించే చావు, పుట్టుక అనే సహజ ధర్మాలన్నీ ఆ ప్రభువుకు శ్వాసక్రియలో ఓభాగం. మానవులను దయగా చూసినా, దండన విధించి శిక్షించినా అది అతను విధించే పరీక్షయే కానీ మరేమీ కాదు. లోకంలో మనం అనుభవించే కష్టసుఖాలన్నీ వెలుగు నీడలలాంటి దోబూచులాట. అంతా మాయే, మనం సుఖం అనుకుంటూ అనుభవించేదంతా మిథ్యే, కేవలం ఆ భగవంతుడైన ప్రభువు మాత్రమే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ఈ మాయని ఛేదించడానికి ప్రయత్నం చేయాలి. మనిషిలో ఈ ప్రయత్నం ప్రారంభం జరగాలంటే కూడా ఆ దైవమే సహకరించాలి.
అందుకే మహిమ చూపవయ్యా..నీ మహిమ చూపవయ్యా అని ఎలుగెత్తి ప్రార్థిస్తుంది ఆమె.
క్రైస్తవమత ప్రచారంలో, ఉపన్యాసాలలో మనం తరచు వినే పదాలు, వాక్యాల విరుపులూ తొంగిచూస్తూ ఉన్నా కేవలం మత ప్రచారగీతంలా కాక మనిషి జీవితాన్ని వ్యాఖ్యానం చేస్తూ, మనిషి మనిషిగా, మానవత్వం తో మనీషిగా మారడానికి కావలసినదేమిటో అన్న విషయాన్ని ఆలోచిస్తూ, ఆ విధంగా జరగడానికి కావలసిన దైవ సహాయాన్ని ఆకాంక్షిస్తూ, ఆ ప్రభువు శరణాగత వాత్సల్యాన్ని నిరూపిస్తూ మూడు చరణాలలో సాగింది
- ఈ గీతం.
ఈ గీతంలో కవి చెప్పిన విషయాలు క్రైస్తవమతానికే కాక సర్వమతాలకు వర్తించేవి. మనిషి సంసారంలోను, లోకంలోను ఉన్న మాయను గుర్తించి, లేనిదానికోసం తపించడం మాని ఉన్న దాంతో తృప్తిపడుతూ, ప్రేమ, క్షమ లను జీవితాదర్శాలుగా గ్రహించి తోటివారిని మనిషిగా గుర్తించడం జరిగిన నాడు లోకంలో మనిషి మనుగడ సుఖశాంతులతో సాగుతుంది. మంచితనంతో మనసులను నింపుకొని మాయను ఛేదించి సత్యాన్ని శోధించే దిశగా మనిషి ప్రయాణం సాగితే మనిషి ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు. తనలోనే భగవంతుడిని దర్శించగలుగుతాడు. సర్వమత సారాంశం బోధించే నీతి ఇదే.
బానర్ రమాచిత్ర
దర్శకుడు బాపు
సంగీతదర్శకుడు కె.వి. మహదేవన్
గీత రచయిత వేటూరి సుందరరామ మూర్తి
గానం పి. సుశీల


13 comments:
Wonderful...
Merry Christmas.
చాలా బాగా రాశారండి..
Merry Christmas.
చాలా చాలా బాగుందండీ..
క్రిస్ట్మస్ శుభాకాంక్షలు
సుధా గారు బాగా రాశారు . అన్ని మతాలను గౌరవిద్దామనే భావన అన్ని మతాల వారిలో కలగాలని అన్ని మతాల దేవుళ్ళను కోరుకుంటున్నాను
సుధ గారూ చక్కని వ్యాఖ్యానం అండీ.. చాలా బాగుంది.
MERRY CHRISTMAS
నాద్వారానే తప్ప మరెవ్వడిద్వారా పరలోకపు తలుపులు తెరుచుకొనుట అసాధ్యము - మత్తయి 23:12
May Jesus bless you with paralOkamu.
Very well written Sudha ji
Telugu cinimaalloni christava geetallo maro paata kooda vundi Sudha garu..1971 lo vidadalaina 'Prema Jeevulu' 'DAYA CHOODU YESU PRABHUVA' Rachana Dr. C.Naryana Reddigaru, Sangeetam: Vijaya Krishna Murthy garu, Gayani:Srimati Vijaya Lakshmi Kannarao garu.
నిజమే భానుగారు, మర్చిపోయాను ఆ లిస్టు లో ఆ పాట కూడా చేర్చవలసినపాటే... కానీ పాట పాడినవారు విజయలక్ష్మీ కన్నారావుగారు అని నాకు తెలియదు.
మతమన్నది మనకంటికి మనసకైతే మతం వద్దు గితం వద్దు, మారణహోమం వద్దు...గ్రేట్ సేయింగ్.
క్రిస్మస్ పాటలలో చెప్పుకోవలసిన ఓ మంచిపాట...ప్రేమలేఖలు సినిమాలోని ఈరోజు మంచి రోజు ....మరుపురానిది మరువలేనిది.
-సుష్మ
బావుంది.
క్రైస్తవ ప్రార్ధనా గీతాల మీద చాలా పరిశోధనలు జరిగాయిట. ఇక్కడ జరిగిన ఒక సాహిత్య సభలో ఒకామె తన సిద్ధాంత వ్యాసం నించి కొన్ని భాగాలు చదవడమే కాకుండా కొన్ని కీర్తనలు పాడారు. 19వ శతాబ్దిలో రాగతాళ నిర్దేశంతో క్రైస్తవ కీర్తనలు రచించి పాడేవారుట. సుబ్బరంగా మన రామదాసు కీర్తనల్లాగానే ఉన్నాయవి.
ఆ రోజుల్లో ఇది నాకు చాలా నచ్చిన సినిమా. ఇందులో సైతాను పాత్రని కొంతవరకూ మార్క్ ట్వెయిన్ రాసిన విచిత్ర వ్యక్తి నవలిక ఆధారంగా రూపొందించారు.
Post a Comment