చదువుకునే
రోజుల్లో తరచు పిండితార్థం అనే మాట వినేవాళ్ళం. సారాంశం అని అర్థం. పిండితే వచ్చే
అర్థం కాబోలు - అని సరదాగా అనుకునేవాళ్ళం. కావ్యాలలో కవులు వారు ఏం ఊహించి ఏం రాసేవారో కానీ
ఒక్కోసారి ఈ విమర్శకులు చెప్పే అర్థం చూస్తుంటే ఇది పిండితార్థమేమో అనిపిస్తూ
ఉండేది. అంటే కవులు వేరే ఉద్దేశంతోనో లేదా యథాలాపంగానో చెప్తే విమర్శకాగ్రేసరులు వారికి కావలసినట్టు దాన్ని
పిండుకుంటారని.
సినిమాల్లో
దర్శకులు చేసిన షాట్స్ లో ఒక్కోసారి వారి ప్రమేయం లేకుండా కనిపించే షాట్లను సినీ
అభిమానులు దర్శకుడి ప్రతిభగా పొరబాటు పడడం కూడా కద్దు. ఇలాంటి డిపి ల (దర్శకత్వ ప్రతిభ) గురించి కోతికొమ్మొచ్చి లో మన ముళ్ళపూడిగారు బాగా వివరించారు.
అలాంటి ఓ తమాషా కథ ఇది.
ఓ
రెండువందలేళ్ళక్రితం అనుకోండి. ఇటలీలో ఓ పోప్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారుట.
దేశంలోని ఓ మైనారిటీ వర్గాన్ని(ఆ వర్గం పేరు ఇక్కడ నేను చెప్పను. ఎందుకంటే మనకు కథ
ముఖ్యం కాబట్టి) దేశం వదిలిపెట్టి వెళ్ళాలని. సహజంగానే పెద్ద ఎత్తున వారంతా నిరసన
వ్యక్తంచేసారు. పోప్ గారు ఓ ప్రతిపాదన తెచ్చారు.
ఆ మైనారిటీ వర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో తాను మతపరమైన చర్చ జరుపుతానని,
ఆ చర్చలో ఒకవేళ మైనారిటీ వర్గం వారు జయిస్తే వారు ఇక దేశం వదిలి వెళ్ళనక్కరలేదని.
ఒకవేళ పోప్ గారు గెలిస్తే వారు తప్పనిసరిగా దేశాన్ని వదిలి వెళ్ళనక్కరలేదని.
సరే మరి
ఆ వర్గంవారికి వేరే దిక్కులేదు. కనీసం పోప్ గారి ఈ ప్రతిపాదనను ఉపయోగించుకోవాలని అనుకున్నారు.
తమనుండి ఒక మధ్యవయసు వ్యక్తిని తమకు ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి పోప్ తో
ఒక అంగీకారానికి వచ్చాడు. పోటీ జరుగుతున్నప్పుడు ఇటూ అటూ ఎవరూ ఒక్క మాటయినా
మాట్లాడకూడదు. పోప్ అంగీకరించాడు.
మతచర్చ
అనుకున్న సమయానికి ప్రారంభమైంది.
పోప్, ఆ వర్గ
ప్రతినిధి ఎదురెదురుగా కూర్చున్నారు.
పోప్
గారు తన కుడి చెయ్యి ఎత్తి మూడు వేళ్ళు చూపించాడు.
ఆ
ప్రతినిధి ఒక్కక్షణం ఆలోచించి తన చెయ్యి ఎత్తి ఒకవేలు చూపించాడు.
పోప్
గారు తన చేతివేళ్ళను తలచుట్టూ తిప్పాడు.
ఆ
ప్రతినిధి తన చేతి చూపుడువేలుని నేలవైపుకి చూపాడు.
పోప్
గారు తన బాగ్ లోంచి ఓ వేఫర్ ని, వైన్ గ్లాస్ ని తీసి బల్లమీద పెట్టాడు.
ప్రతినిధి
సాలోచనగా చూసి తన బేగ్ లోంచి ఓ ఆపిల్ ని తీసి బల్లమీద పెట్టాడు.
పోప్
ఆశ్చర్యపోయాడు. లేచినిలబడ్డాడు.
“ఇతను చాలా మేధావి. నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. వారంతా ఈ
దేశంలోనే ఉండవచ్చు”
అని
ప్రకటించాడు.
చుట్టూ
ఉన్నవారికి చాలా విస్మయం కలిగింది. ఏం జరిగిందో సరిగ్గా అర్థం కాలేదు.
ఓ గంట
గడిచాక మెల్లగా భక్తులందరూ పోప్ చుట్టూ చేరారు.
ఏం
జరిగిందని అడిగారు. పోప్ అన్నాడు కదా.,.....
“నేను మన హోలీ ట్రినిటీ
గురించి చెప్తూ మూడు వేళ్ళు చూపించాను. అతను మన రెండు మతాలు వేరు వేరు అయినా
ఇద్దరికీ దేవుడు ఒకడే కదా అని ఒకవేలు చూపించాడు.
నేను నా
చేతిని తిప్పుతూ దేవుడు మనచుట్టూ ఉన్నాడని చూపించాను. అతను నేలని చూపుతూ దేవుడు
ఇక్కడే మన మధ్యనే ఉన్నాడని చెప్పాడు.
నేను
వేఫర్ ని వైన్ ని చూపిస్తూ దేవుడు మననుండి మనం చేసిన పాపాలను పీల్చేస్తాడని సంకేత
భాషలో చెప్పాను. అతను ఎంత మేధావి అంటే
అసలు పాపాలన్నిటికీ మూలం అని మనం చెప్పుకునే ఆపిల్ ని తీసి చూపించాడు. ఆహా.ఎంతగొప్పవాడు
” అంటూ ఆ ప్రతినిధిని
మెచ్చుకున్నాడు.
సరే, నాణేనికి మరోవేపు –
ఆ వర్గం అంతా మేధావిగా పోప్ తో కొనియాడబడ్డ ప్రతినిధి
చుట్టూ మూగారు.
“పోప్ గారు నిన్ను ఏం
అడిగారు” అని అడిగారు.
అతను ఇలా అన్నాడు.
“మొదట పోప్ గారు తన మూడు
వేళ్ళు చూపించి మూడ్రోజుల్లో మీరు దేశం వదిలి పోవాలన్నారు.
నేను ఒకవేలు చూపించి ఒక్కడు కూడా ఇక్కడ్నుంచి కదలం అని
చెప్పాను.
తర్వాత పోప్ గారు తన చేతిని తన తలచుట్టూ తిప్పి మీ అందరి
తలలు తీయిస్తాను అన్నాడు.
నేను ఎట్టిపరిస్థితుల్లోనూ మేం ఇక్కడ్నుంచి కదిలేది లేదు
అని నేలని చూపించి బాగా అర్థమయ్యేలా చెప్పాను.”
ఆశ్చర్యపోయిన ఆ జనం అంతా “ఆ తర్వాత?” అని అడిగారు.
“తర్వాత....తర్వాత
ఏముందీ...అతను తన లంచ్ తీసి టేబిల్ మీద పెట్టాడు. నేను నా లంచ్ తీసి అక్కడ
పెట్టుకున్నాను. అంతే” అని ముగించాడు.
అదండీ కథ. పిండితార్థం అంటే అది...పిండుకున్నవారికి
పిండుకున్నంత.