Monday, July 4, 2011

జీవితం స్వప్నసాగరతీరం...సాగనీ పయనం !!


జీవితం కొందరికి స్వప్నాల సాగరం!
మరికొందరికి దుఃఖకాసారం!
ఇంకొందరికి సుఖదుఃఖాల సమ్మేళనం!!
ఏదేమయినా మనిషి జీవితం నిరంతర ప్రయాణం.
భూత వర్తమాన కాలాల్లోంచి భవిష్యత్తుకి సాగే జీవన మార్గం లో మానవ జీవితం నడక,  ఎప్పుడూ నల్లేరుమీద బండి నడక కాదు. మిట్టపల్లాలు తట్టుకుంటూ సాగవలసిఉంటుంది. గడిచిన దారి కన్నా, ముందు దారిఎలా ఉంటుందోనన్న ఆసక్తే మనిషి లో జీవలక్షణాన్ని చూపే అంశం.
మనిషి ఎప్పుడూ భవిష్యత్తులోకి ఆసక్తిగా తొంగిచూస్తూ ఉంటాడు. ఉన్న స్థితినుంచి ఉన్నతమైన స్థితిలోకి పరివర్తన చెందడానికి అవకాశాలకోసం అన్వేషిస్తూ ఉంటాడు. పరిస్థితులు తన చేతులు దాటిపోతున్నాయనే అనుమానం వస్తే మాత్రం అశక్తతతో క్రుంగి పోతాడు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఏమాత్రం ఆసరా దొరికినా బయటకి రావడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి కష్టాలలో ఉండే మనిషి తనలో ఆశని ప్రోది చేసుకోవడానికి ఆశ్రయించేది దైవం. ఆ దైవానికి ప్రతినిధుల్లాగ దైవమార్గాన్ని ప్రవచించే సద్గురువులను చేరుకుంటాడు. వేదాంత ప్రవచనాలు వింటాడు. కర్తవ్యవిమూఢత్వంతో  చేష్టలుడిగిన మనిషి ఈ హితవచనాలతో, కర్తవ్యపాలనను బోధించే ప్రవచనాలతో మానసికస్థైర్యాన్ని కూడగట్టుకుంటాడు. ఒక కొత్త ఆశావహమైన దృక్పథంతో బ్రతుకు మార్గంలో ప్రయాణిస్తాడు.
అపజయం నుంచి జయం వైపు సాగించే ఈ ప్రయాణంలో తన కన్నా ముందు వెళ్ళిన వారి అనుభవాలను తెలుసుకోవడం, వారు అనుసరించిన విధానాలను తాను కూడా ఆచరణలో పెట్టడం అనేది కూడా మనిషికి  తన ఆశయసాధనలో విజయం వరించడానికి సహాయపడుతుంది. అయితే ఈ విధంగా మనం అనుభవంలోంచి పాఠాలు నేర్చుకోవడానికి సహాయపడే వ్యక్తులు మన సమాజంలో పెద్దపేరున్న పెద్దమనుషులే కానక్కరలేదు అని, మనకన్నా  ఎంతో వైవిధ్యమైన జీవలక్షణాలున్న సృష్టిలోని అతి చిన్న జీవులు కూడా కావచ్చని తెలుసుకున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
జిమ్ రాన్ అనే గొప్ప తత్వవేత్త  ప్రతిపాదించిన వేదాంతం ' చీమ వేదాంతం'.
వేదాంతం లాంటి గొప్పవిషయాన్ని చీమలాంటి అల్పప్రాణికి ముడిపెట్టడం వింతగా తోచే విషయం కావచ్చు. కానీ అతను, చీమ తన జీవనయానంలో అనుసరించే విధానాలను మానవ జీవితానికి అనువర్తింపచేస్తూ ఇచ్చిన ఉదాహరణలు చూస్తే మనం కూడా అవుననక తప్పదు. చీమకి ' జై ' కొట్టక తప్పదు.
మనం  జీవితంలో విజయం సాధించాలంటే చీమ తన జీవితంలో అనేక పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తోందో గమనించి అదే రకమైన జీవితవిధానాన్ని మనం కూడా అవలంబించాలి, అంటారు జిమ్ రాన్. అందుకు అతను చెప్పిన నాలుగు సూత్రాలు చూద్దాం.
మొదటి సూత్రం ఇది!
చీమలు ఆహారం కోసం ఎంతో దూరాలు ప్రయాణిస్తాయి. ఒకదాని వెనుక ఒకటి అలా నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా దాని దారికి ఏదేనా అడ్డం వస్తే అది ఏం చేస్తుందో గమనించారా....కావాలంటే చీమలు ప్రయాణిస్తున్న దారిలో మీ వేలు అడ్డు పెట్టి చూడండి. ఆ చీమ ఎలా ముందుకు వెళ్తుందో గమనించండి. వేలు చుట్టూ తిరుగుతుంది. ముందుకు సాగడానికి దారులు వెతుకుతుంది.కానీ అక్కడే  నిలబడి  హారి భగవంతుడా!! నేనేం చేసేదిరా!! నాకేం దారిరా అని  దిక్కులు మాత్రం చూడదు.అంతగా ముందుకు పోయే  దారి దొరకకపోతే వేలు మీదనుంచి వెళ్ళిపోతుంది...కానీ వెనుకకు మాత్రం వెళ్ళదు.
మనం నేర్చుకోవలసిన గొప్ప సూత్రం ఇది. జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, మరి ముందుకు పోలేమన్నంతగా వేపుకు తినే పరిస్థితులు.  ఇక ప్రయాణం ఆపడమే పరిష్కారమేమోనన్నంతగా దిగజారిన పరిస్థితులు. సరిగ్గా ఈ స్థితిలోనే మనకి చీమ ఆదర్శం అవుతుంది. చీమ తన లక్ష్యం చేరుకోవడం కోసం ముందుకు సాగడం కోసం ఎంతగా తపిస్తుందో మనం ఆదర్శంగా తీసుకోవాలి. విన్ స్టన్ చర్చిల్ నెవర్ ...నెవర్..నెవర్ గివ్ అప్  అని చెప్పినా... సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడూ.... ఒప్పుకోవద్దురా ఓటమీ అని పాట పాడినా దాని  సారాంశం ఇదే.
చీమ జీవితం లో మనం గమనించవలసిన మరో ముఖ్యాంశం - మనందరం చిన్నప్పుడు విన్న కధే. చీమ, మిడత కథ. వసంతకాలం వచ్చిందని మిడత చాలా సంతోషంతో ఆటపాటలతో కాలం అంతా గడిపేస్తుంది. చీమ ఆ కాలంలో కూడా కష్టపడి పనిచేసి ఆహారం కూడబెట్టుకుంటుంది. ఇక వానాకాలం వచ్చాక మిడతకి ఆహారం దొరకదు. చీమ మాత్రం తను వేసవిలో కష్టపడి కూడపెట్టిన ఆహారంతో ఆనందంగా గడుపుతుంది.
జీవితంలో  కాలం విలువ ని అవగాహన చేసుకోవడానికి చెప్పే కథ ఇది. అవకాశాలు ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలి.
చీమకి తెలుసు - వేసవి సుఖంగా ఉండే కాలమే అయినా అది ఎక్కువకాలం ఉండదని, దానివెనుకే వచ్చే వర్షాకాలం తనకి చాలా ఇబ్బందులు కలిగిస్తుందని.

సరిగ్గా మనిషి గుర్తుంచుకోవలసిన విషయం కూడా ఇదే. అంతా మంచి కాలం నడుస్తోంది అనుకున్నప్పుడు కూడా ఇది శాశ్వతం కాబోదు అన్న జ్ఞానంతో ఉండడం ఎంతో అవసరం. మెరుపు మెరిసినంతకాలం సంతోషం కలిగినా పిడుగుపాటు పడే అవకాశం కూడా ఉందని తెలుసుకోవడం ఆ హెచ్చరికతో గడపడం మనిషికి అవసరం.
చీమ  తన జీవనవిధానంతో మనిషికి చెప్పే మరో పాఠం ఇది.
అలాగే చీమ జీవితం నేర్పే మూడో పాఠం -  ఏ సమయమూ శాశ్వతం కాదు.
జీవితంలో కష్టసుఖాలు  ఒకదానివెనుకే ఒకటిగా మనతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కష్టకాలం ఎప్పుడూ ఉండదు. కొంతకాలం ఇది గడిచిపోగానే సుఖించేకాలం వస్తుంది. గడ్డకట్టించే చలికాలం ఎంతో కష్టం కలిగించినా చీమలు అదిరిపోవు బెదిరిపోవు. వెలుగురేకలు విచ్చుకోగానే తొలికిరణాలు భూమిని తాకగానే కర్తవ్యనిర్వహణకి  నడుం కడతాయి. బిరబిరా పుట్టలనుండి బయటపడతాయి. తమ బాధ్యతని ఎప్పుడూ విస్మరించవు.
మనిషి కూడా చీమనుంచి నేర్చుకోవలసిన జీవన సూత్రం ఇది.
కష్టాలు కారుమబ్బుల్లా కమ్ముకొచ్చినవేళ దిగాలుపడిన దసరా బుల్లోడులా మొహం వేలాడేయకూడదు. సుఖం శాశ్వతం కానట్టే కష్టం కూడా శాశ్వతం కాదు అని మర్చిపోకూడదు. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని వదులుకోకూడదు.  జరగబోయేది మంచి అని గట్టిగా నమ్మి ముందుకు సాగాలి.
కలకాలం ఉండవు ఈ కన్నీళ్ళూ, కలలైనా, కలతైనా కొన్నాళ్ళూ..అని కవి చెప్పనే చెప్పాడు కదా..
చీమ నుంచి నేర్చుకోవలసిన సూత్రాలలో ఆఖరిది అతి ముఖ్యమైనది అని రాన్ చెప్పిన సూత్రం చూస్తే ,  గీతోపదేశం  గుర్తురాక మానదు.
భగవద్గీతలో పరమాత్ముడు బోధించిన  గొప్పమాట...నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. దాని ఫలితాలను గురించి ఆలోచించకు.
చీమ ఆనాటి అర్జునుడిలా ఈ గీతోపదేశ వాక్యాన్ని పాలిస్తుందా అనిపిస్తుంది.
నేను ఇంత చిన్న  చీమని, ఎంత ఆహారాన్ని తేగలను, ఎంత బరువు మోయగలను, ఎంతదూరం వెళ్ళగలను, వెళ్ళినా తిరిగి వస్తానా, నేను తెచ్చినదాన్ని నేనే తింటున్నానా, ఇతర చీమలు ఏం చేస్తున్నాయి, ఎంత తెస్తున్నాయి, నేను తేకపోతే ఏం, కొంప మునిగిపోతుందా ఇలా ఎన్ని రకాల ప్రశ్నలు వేసుకొని పని మానుకొనే అవకాశం ఉందో చీమకి.
కానీ ఏ చీమా ఇలాంటి పనికిరాని ప్రశ్నలతో కాలం గడిపినట్టు మనం చూడం. చీమ ఆహార సేకరణ అనే జీవితాశయం కోసం నిరంతరం శ్రమిస్తుంది. ఎంతో దూరం వెళ్తుంది, తన  ఆకారానికి ఎంత పరిమాణం ఆహారాన్ని  మోయగలనో లేనో అని అది దొరికినదాన్ని  వదిలిపెట్టదు.  బలవంతంగా శక్తినంతటినీ ఒడ్డి ఆహారాన్ని తన నివాసం వైపు ఈడ్చుకుని వెళ్తుంది. అవసరమైతే తన తోటి వారిని సహాయం అడిగి మరి ఆ పని నిర్వర్తిస్తుంది. ఈ పనిలో చీమ తన బరువుకి కనీసం 20 రెట్లబరువు గల ఆహారాన్ని మోసుకొని పోతుందిట. తను చెయ్యగలనా లేదా అని మాత్రం సందేహిస్తూ కూర్చోదు.

 నీ శ్రమని, తెలివితేటలని, సమయాన్ని పెట్టుబడిగా పెట్టు. ఫలితాలు ఎలా ఉంటాయి అని సందేహించకు. మంచి శ్రమకి,మంచి ఆలోచనకి, నూరుశాతం గారంటీ దొరుకుతుందని నమ్మి త్రికరణశుద్ధిగా కర్తవ్యాన్ని ఆచరించు అని చీమ జీవితం మనకి సందేశాన్నిస్తుంది.
జాన్ రాన్ చెప్పినట్టు చీమ జీవితంలో మనం తీసుకోవలసిన నాలుగు అంశాలు క్లుప్తంగా ...
అవరోధాలను లెక్కచేయకపోవడం,  ముందుచూపుతో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే శక్తిని కలిగి ఉండడం, భవిష్యత్తు పట్ల ఆశావహమైన దృక్పథం వహించడం, చేయగలిగినంత, చేతనైనంత ప్రతిభతో కర్తవ్యపాలన చేయడం తద్వారా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని,  సుఖ సంతోషాలమయమైన జీవితం మన స్వంతమవుతుందని మనసారా నమ్మడం.
ఎంత చక్కగా ఉంది కదూ ఈ చీమ వేదాంతం...
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు అన్నారు వేటూరి.
 జీవితసత్యాన్ని ఆవిష్కరించే విషయంలో  చీమయినా సరే మనిషికి మహా గురువు అంటే తప్పేముంది !!

Tuesday, June 21, 2011

తెలుగు పాటల తో 'రణం'(....కాదు- దోస్తీ) కడదామా !!


తెలుగు గుమ్మానికి పాటలతో తోరణం కడదాం రమ్మని ఒక్క పిలుపు వినబడగానే ముఖపుస్తకంలో తమని చూసుకుంటున్న తెలుగువాళ్ళు చాలామందికి కొత్త ఉత్సాహం వచ్చింది. కొద్దిగంటల వ్యవధిలోనే అందులో తమ పేరు నమోదు చేస్తున్న సభ్యుల సంఖ్య చూస్తే ఈ విషయం తెలుస్తోంది.

ఎక్కడైనా తెలుగు మాట వినబడితేనే పులకరించిపోయే స్థితి కలిగే దుస్థితి త్వరలో వస్తుందేమో నని దిగులుగా ఉంటోంది ఇటీవల చాలామందికి. తెలుగు మాటే కాదు, తెలుగులో పాటలు కూడా రాయాలన్న సరదా, రాసే సత్తా కూడా ఉన్న యువతరం ఎంతో ఉత్సాహంగా ఉందని, అవకాశం దొరికినప్పుడు తప్పకుండా స్పందిస్తారని నిరూపిస్తున్నారు ఈ తెలుగు పాటల  తోరణం సభ్యులు.

కవిత్వం అంటే కేవలం ప్రాసలు, పడికట్టుపదాలు వేస్తు వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి చెప్తే చాలనే అభిప్రాయం కొందరికి ఉంది. అల్లాటప్పాకవితలు చెప్పడమే ఓ గొప్పా అనే మాటదీనికి వర్తిస్తుందేమో కానీ నిజంగా భాష పట్ల, సాహిత్యం పట్ల గౌరవం ఉన్న వారు చెప్పే భావాత్మకమైన చిన్న వాక్యం కూడా గొప్ప కావ్యం ఇచ్చే అనుభూతిని ఇవ్వగలదు. వాక్యం రసాత్మకం కావ్యం అన్న మాట ఇటువంటి కవిత్వం పట్ల సార్థకమవుతుంది.

వెయ్యేళ్ళ మన తెలుగు సాహిత్యంలో నన్నయ  నుంచి గురజాడ వరకు చూస్తే  పద్యం - అత్యంత జనాదరణ పొందిన సాహిత్యప్రక్రియ. అనేక సాంఘిక,రాజకీయ,ఆర్థిక కారణాల వలన తెలుగు దేశంలో కూడా  భాష, సాహిత్యంలోకూడా మార్పు వచ్చింది. జనం మాట్లాడే భాషే, రాసే భాష కావాలనే వాదం ఊపందుకుంది. దీని ప్రభావం కవిత్వం మీద కూడా కనిపించింది. భావకవిత అనేవిధానం సాహిత్యంలో సంచలనం కలిగించింది. సంస్కృతపదాల మాయనుంచి విడిపడి ప్రతి భావాన్ని తెలుగులో చెప్పడానికి కావలసిన చక్కని పదజాలాన్ని మనకు అందించారు ఈ భావకవులు.

తెలుగులో చలన చిత్రాలు నిర్మించిన కొత్తలో ఇతరభాషలకు అనువాదాలుగా వచ్చిన కొన్ని చిత్రాలలో తెలుగుదనం కొంత కొరవడినా క్రమంగా తెలుగు సమాజంలో భావకవులుగా జనాదరణ పొందిన కవులు చాలామంది చిత్రసీమలో ప్రవేశించడం వలన సినిమా పాటలు కూడా  పెద్దగా పాండితీ ప్రకర్ష లేని  సామాన్యులు పాడుకోగలిగిన పాటలుగా, గుర్తుపెట్టుకోగల సాహిత్యంతో కనిపిస్తాయి.
క్రమంగా సమాజంలో వచ్చిన మార్పులు అనేకరంగాలలో ప్రభావం చూపినట్టే సినిమారంగం మీదకూడా చూపాయి. జనం కోరినది తీస్తున్నామని, వింటున్నది రాస్తున్నామని, నచ్చినదే ఇస్తున్నామని నమ్మబలుకుతూ సినీ రంగం విలువలకు తిలోదకాలిచ్చింది.  సాహిత్యంలో కూడా  విలువలు నానాటికీ దిగజారాయి.

కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పెరుగుట విరుగుట కొరకే అన్న సూక్తిలో నిజం ఉంది. కాలం దానిని నిరూపిస్తుంది కూడా.

కొంతకాలం క్రితం వరకు ఎంతో విలువైన కవిత్వం  రాసిన వాళ్ళు ఎంతో మంది ఉండిఉండవచ్చు. కానీ సమాచార రంగంలో వ్యాపారాన్నిమాత్రమే చూసిన కొన్ని పత్రికల ధోరణి వలన చాలామంది మంచి రచనలు మరుగున పడిపోయి ఉంటాయన్న విషయంలో అనుమానం లేదు.

కానీ ఇప్పుడు రోజులు మారాయి. సమాచారరంగంలో అద్భుతమైన మార్పులెన్నో చోటుచేసుకున్నాయి. మన అభిప్రాయాలను, ఆలోచనలను పదిమందితో పంచుకోవడానికి, మంచిచెడులను బేరీజు వేసుకోవడానికి ఇదివరకులా పత్రికలు మాత్రమే వేదికలు కాదిప్పుడు. అంతర్జాలరంగంలో ప్రతివారికి ఎన్నో అవకాశాలు.

 కంప్యూటర్లో రాయడం అంటే ఇంగ్లీషు తెలిసిన వాళ్ళే చేయాలనే దురభిప్రాయాన్ని పక్కన పెట్టి మాతృభాషలో మన ఆలోచనలు పంచుకోగలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయం మనకి తెలిసిన తర్వాత మరికొంత మందికి చెప్పాలి. వీటికి  కావలసినదల్లా కొద్దిగా ఓర్పు, సహనంతో చూపే నేర్పు, మరికొంత నిజమైన భాషాభిమానం. తప్పులు లేకుండా తెలుగు రాయడానికి మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం.

అంతర్జాలంలోని సాంకేతిక రంగం మనకు ఇచ్చిన గొప్పబహుమతి ఈ సమాచారమార్పిడి. ప్రపంచంలో ఏమూల ఉన్నా తక్షణం స్పందించే అవకాశం, మన అభిప్రాయాలను మనం కోరిన వ్యక్తికి వినిపించగల గొప్ప సాధనాలు ఇప్పుడు మన అరచేతిలో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుందాం.

ఇప్పుడు ఈ తెలుగు పాటల తోరణం  గుంపు - మీరు రాసిన కవితలను పదిమంది కాదు.....కొన్ని వందల, (వేలమంది?) తో పంచుకోవడానికి ఒక చక్కని అవకాశం.

మీలో కొందరు ఇదివరకే కవిత్వంలో అందె వేసిన చెయ్యి అయి ఉంటారు.
మరికొందరు ఔత్సాహికులు అయి ఉంటారు. రాయాలనే తపన ఎంతో ఉన్నా భావానికి రూపం కల్పించడంలో కొంత తికమక ఉండవచ్చు వీరి కవితలలో.
అయితే ఏం....

మొత్తంమీద తెలుగు భాషమీద గౌరవంతో, తెలుగు పాటమీద సరదా తోను ఈ వేదికమీదకు చేరిన వాళ్ళం కనుక మన అభిప్రాయాలన్నీ ఇచ్చిపుచ్చుకుందాం. ఒకరి భావాలనొకరు గౌరవించుకుందాం.

నచ్చితే మెచ్చడమే కాక నచ్చకపోతే కారణాన్ని కూడా సున్నితంగా చెప్పుకుందాం.

అలా చెప్పిన వారి మాటలోని భావాన్ని నొచ్చుకోకుండా పుచ్చుకుందాం.

మన కవితా శైలిని మెరుగుపరుచుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఈ వేదిక నిరూపిస్తుందని ఆశిద్దాం. 
తెలుగులో గేయాలు రాసేవాళ్ళయితే  ఇక్కడ  ఉన్నవారితో మీ అభిప్రాయాలు పంచుకోండి.

Monday, June 6, 2011

ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా


ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా

ఆత్రేయ గారు రాసిన గీతం -పోలీసు వెంకట సామి - పోలీసు శాఖలో పనిచేసేవ్యక్తి ప్రేమికుడైతే తన  ప్రియురాలికి చెప్పే ప్రేమ కబుర్లు ఎలా ఉంటాయో, ఎలాంటి భాష వాడతాడో చూసాం కదా.

ఆత్రేయగారికన్నా ముందే ఆరుద్ర గారు కూడా ఇలాంటి ప్రయోగం చేసారు 1959లో 'మా ఇంటి మహాలక్ష్మి' చిత్రం కోసం.

ఇప్పుడు ఒక కోర్టు లో ప్లీడరు గారి దగ్గర గుమాస్తా గా పనిచేసే వ్యక్తి తన ప్రియురాలితో ఎలా మాట్లడతాడని ఆరుద్ర గారు ఊహించి రాసారో చూద్దామా.

పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు

అమ్మాయి అంటే తనకి ఇష్టం ఉందని చెప్పడానికి దస్తావేజు రాసి ఇస్తానని  చెప్తున్నాడు. అంటే తన హృదయం అనే ఆస్తిని ఆమెకి సమర్పించుకుంటున్నానని చెప్పే పత్రం రాసి ఇస్తాడుట.

                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ
                

ఇక్కడ సదరు అనే మాట కోర్టు భాషలో ఎంతో సహజమైన పదం. ఎవరైతే, ఏదైతే అలా అని చెప్పవలసి వచ్చినప్పుడు
సదరు అనే పదం వాడుతుంటారు కోర్టు భాషలో.

నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
తీసుకున్నై డిక్రీని నాపై

అతను ఆ అమ్మాయిని ప్రేమించడం అన్న విషయం కేసయితే...అందులో అతని అభిప్రాయం అనే విషయంతో ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి హృదయం, మనసు అనేవి ఎక్స్ పార్టీలుగా ఉండి అతని మనసును డిక్రీ చేసాయిట. అంటే ఆమెను తన ప్రమేయంలేకుండానే తనకు తెలియకుండానే ప్రేమించేసాడన్నమాట.

మీను లాంటి నీ కన్నులు అమీనై
జామీను లేని నా మదిని జప్తు చేసినై...

అంతే కాదు..ఇక్కడ కోర్టు వ్యవహారాలలో  అమీను అనే ఉద్యోగి ఉంటాడు.

తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నప్పుడు ఆ  అప్పును  చెల్లించలేకపోతే తాకట్టు పెట్టిన వస్తువుల మీద అప్పు ఇచ్చిన వారికి అధికారం వస్తుంది. ఆ విధమైన అధికారాన్ని కోర్టు  అప్పు ఇచ్చిన వారికి దాఖలు    చేస్తుంది. కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను  అమలు చేసే ఉద్యోగి ...కోర్టు అమీను.

ఇక్కడ ఆ ప్రేమించిన అమ్మాయి కళ్ళు -  'మీనులాంటీ నీ కన్నులు  అమీనై ' అంటే చేపల్లా ఉన్న ఆమె  అందమైన కళ్ళు కోర్టు  అమీను రూపం దాల్చి  ఏ విధమైన హామీ  లేని అతని ఆస్తి  అయిన మనసును అంటే అతని మదిని జప్తు చేసాయిట.


చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
మనకి రాదూ ఏ లిటిగేషన్....


ఇక  ఆమెని తను ప్రేమించడం అన్నది జరిగిపోయింది కనుక ఇద్దరూ ఒక  అవగాహనకి రావడం అనే దశకి వచ్చినట్టే.
అదే సెటిల్మెంట్. 

 ఇద్దరు ప్రేమించుకున్నాక  వారిద్దరూ కలిసి ఉండడానికి కావలసిన బంధం వివాహ బంధం. అందువలన ఆ వివాహ బంధం ఏర్పరచుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. దాన్ని అగ్రిమెంట్  అనే పదంతో సూచిస్తున్నారు కవి.

అంతేకాదు ఆ వివాహ బంధం వలన పొందవలసిన సౌఖ్యం అనేది తమ హక్కు దానిని సాధించడానికి కూడా ఓ పిటీషన్ వేయాలని అనుకుంటున్నాడు.

పెళ్ళి జరిగాక ఇద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే  వారు సంతోషంగా కలిసి ఉంటే   ఎవరికీ ఏ సమస్యా రాదని భావిస్తున్నాడు.
 అందుకే  అలా కలిసి ఉండగలిగితే   మనకి రాదు ఏ లిటిగేషన్ అంటాడు.

ఒకే భాష మాట్లాడే వ్యవహర్తలలో కూడా వారి వర్గ,ప్రాంత, మాండలిక భేదాలను బట్టి భాష వ్యవహారంలో అనేకమయిన మార్పులు కనిపిస్తాయి. వీటితో పాటు  భాషని ప్రభావితం చేసే అంశాలలో గమనించదగిన అంశం వృత్తి. ఒకో విధమయిన వృత్తిలో ఉండేవారికి  ఆ వృత్తికి సంబంధించిన పదాలతో కొన్ని పలుకుబడులు ఏర్పడి ఉంటాయి.  వారి భాషా వ్యవహారంలో అత్యంత సహజంగా ఆ పలుకుబడి ఒదిగిపోయి ఉంటుంది.
ఎంతో సునిశితమైన దృష్టి ఉంటే తప్ప భాషలోని ఈ అంశాన్ని గ్రహించడం కష్టం.

సినిమాలలో పాత్ర వేష భాషలను దృష్టిలో పెట్టుకుని ఆయా పాత్రలకు తగిన చిత్త  ప్రవృత్తిని గమనిస్తూ,  సందర్భోచితంగా పాటలు రాయడం తేలికైన పని కాదు.

ఆరుద్ర గారు రాసిన ఈ పాట ఒక హాస్య నటునిపై చిత్రించిన పాటే అయినా   కోర్టు గుమాస్తా అయిన ఆ పాత్ర ప్రేమలో పడితే అతని భాష ఎలా ఉంటుందో ఊహించి రాసిన విధానం  పాటల రచయితగా ఆరుద్ర  గొప్పదనాన్ని మరోసారి నిరూపిస్తుంది.

పాట మొత్తం సాహిత్యం ఇక్కడ


పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు
                  
                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ                       నువ్వంటేనే నాకు మోజు

చరణం       నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
                 తీసుకున్నై డిక్రీని నాపై
               
                 మీను లాంటి నీ కన్నులు అమీనై
                 జామీను లేని నా మదిని జప్తు చేసినై.                  నువ్వంటేనే నాకు మోజు       
  
చరణం       చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
                 మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

                  సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
                  మనకి రాదూ ఏ లిటిగేషన్....                               నువ్వంటేనే నాకు మోజు

                 
పాట రచన      ఆరుద్ర
గాయకుడు     పిఠాపురం
చిత్రం             మా ఇంటి మహాలక్ష్మి

సంగీతం           అశ్వత్ధామ

ఈ పాటను వినాలనుకుంటే  ఇక్కడ వినవచ్చు.

Friday, May 6, 2011

ఆత్రేయ - పోలీసు వెంకట సామి

పోలీస్ వెంకటసామి...అదే..పోలీసెంకటసామి అనే పదం తెలుగు వాళ్ళు, తెలుగు పాటలు ఇష్టంగా వినే  చాలా మందికి తెలుసు...

మనదేశం సినిమా కోసం మొదట  సముద్రాల రాఘవాచార్యగారి కలంలో జాలువారి జిక్కి గొంతులో వినిపించిన పాట ఈ పోలీసెంకటసామి పాట. రేలంగి పాత్ర ఈ పోలీసెంకటసామి.

 కానీ సినిమాలో పాటగా కన్నా తరువాత ఘంటసాలగారు ప్రైవేట్ రికార్డుగా పాడిన పోలీసెంకటసామి పాటే ప్రజల మనసుల్లోకి ఇంకిపోయింది.
'నిను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీసెంకటసామి...' అంటూ ఆపాటలో ఘంటసాల గొంతు (స్త్రీ  పాత్ర పరంగా పలికినా) ఎన్ని హొయలు చిలికిందో, ఎన్ని ఎదలను గిలిగింత పెట్టిందో మనకు అనుభవమే..

కానీ ఇక్కడ నేను చెప్పే పోలీసెంకటసామి అతను కాదు. ' తొలికోడి కూసింది' అనే తమిళ చిత్రం తెలుగు అనువాదంలో శరత్ బాబు  పోషించిన పాత్ర పేరు పోలీస్ వెంకటసామి.

ఆత్రేయ ఈ పాత్రకు ఒక పాట రాసారు. మంచి గమ్మత్తైన పాట అది. పోలీసు ఉద్యోగం చేస్తున్న పాత్ర ప్రేమలో పడితే ఆ పాత్ర పాడుకునే పాట ఇలాగే ఉంటుందని పించేలా.

ప్రతి వృత్తికీ ఆ వృత్తికే ప్రత్యేకమైన పడికట్టు పదాలు (జార్గన్) ఉంటాయి కదా. అలాంటి పోలీసువృత్తిలో ఉన్న పాత్ర వాడే పదాలను వాడుతూనే ఓ ప్రేమగీతం రాసారు ఆత్రేయ.

ఆ పాట సాహిత్యం ఇది...

పోలీసు వెంకటసామి నీకు పూజారయ్యాడు
ప్రేమ పూజారయ్యాడు
పచ్చీసు వయసేనాడో నీకు బక్షీసిచ్చాడు
నిన్నే గస్తీ కాసాడు

డ్యూటీలో ఉండి బ్యూటీ చూసి
సెల్యూట్ చేసాడు
మఫ్టీలో వచ్చి మనస్సులోనే
లాకప్ చేసాడు
మన కేసు ఈ రోజు
నువ్వు ఫైస్ల చేయాలి....

లవ్ చేసేందుకు లైసెన్సుంది
నేను సింగిలు గాణ్ణి
నువు సిగ్నల్ ఇస్తే లగ్నం పెడతా
ఆ పై డబుల్సు గాడి

బ్రేక్ వద్దని లైటు వద్దని
రూల్స్ నేనే మార్చేయనా

నీ ఊసులతో నీ ఊహలతో
ఓవరు లోడై మనసుంది
నీ పై నేను నిలిపిన ప్రేమ
వన్ వే ట్రాఫికు కాదంది

ఛార్జి చేసినా ఫైను వేసినా
వేరే రూటుకు పోనంది

టోపీరంగు కోకను కట్టి
లాఠీ లాంటి జడవేసి
జీపల్లే నువు మాపటి కొస్తే
సైడిస్తాను గదికేసి

కౌగిలింత కష్టడీలో ఖైదు చేసి
విజిలేయనా...

 పాత్ర రూపురేఖలను, స్వభావాన్ని బట్టి పాట రాయడమే కాదు, పాత్ర నోట పలికే పాటలో తన వృత్తిధర్మంగా సహజంగా ఒదిగిపోయే మాటలను ఈ పాటలో ప్రయోగిస్తూ మరో మంచి పోలీసెంకటసామిని రూపుకట్టించారు ఆత్రేయ.

మన 'సు' కవి ఆత్రేయకు జేజేలు.

 (ఈ వేళ  మే 7 -ఆత్రేయ గారి జయంతి)

Monday, April 18, 2011

బుడుగడుగ్గాయ్....

భాషలందు పిల్లల భాష వేరయా....అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ.
దానికి నిరూపణగా బుడుగు పాత్రని కూడా చూపించారు.
బుడుగు నాకు బోల్డు భాషలు వచ్చు అని చెప్తాడు కదా...పిచిక భాష, చిక భాష, క భాష ఇలా చాలా భాషలు బుడుగుకి తెలుసు. అలాగే బుడుగు భాషలో అర్థాలు కూడా వేరు. అవి తను మనకి చెప్తే కాని అర్థంకాని పదాలు, పదార్థాలు.

జాటర్ డమాల్ అంటే  ఏమిటి అర్థం...మనకి, బుడుగు వాళ్ళ నాన్నకి తెలీదు...అంతమాత్రాన దానికి అర్థం ఉండదా ఏమిటి.....జాటర్ డమాల్ అంటే అర్ధం లేదూ అని అర్థం అని బుడుగు చెప్తే మనకి అర్ధమవుతుంది.

మరి బుడుగులాంటి ఓ గడుగ్గాయ్ వాళ్ళ నాన్నని తన భాషతో ఎలా అదరగొట్టేసిందో చూస్తారా...
ఇదిగో ఇక్కడ....
కడుపునిండా నవ్వుకోకపోతే అప్పుడు అడగండి.

బుడుగు లాంటి ఓ గడుగ్గాయి