Wednesday, September 28, 2011

కవి గుండెకు రాజు పెట్టినకోత - జాషువాచెప్పిన' పిరదౌసి' కత

  కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
  పంజరాన గట్టు వడను నేను
  నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
  తరుగులేదు విశ్వనరుడ నేను

ఏ సమాజంలో అయితే కులం, మతం అనేవి వ్యక్తి లోని వ్యక్తిత్వానికి కాక వారి బాహ్య అస్థిత్వాన్ని నిర్ణయించే ప్రాతిపదికలు అవుతాయో అలాంటి సమాజాన్ని త్రోసిరాజని, ఆ కులమతాల పంజరంలో తాను చిక్కబోనని, లోకం తన గురించి ఏమనుకున్నా తాను విశ్వం మొత్తానికి చెందిన మానవుడిని అని చెప్పుకున్న గొప్ప మానవతావాది గుఱ్ఱం జాషువ.


1895 సం. సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాషువ రచనలలో చాలా కావ్యాలలో కథా వస్తువుకు, ఆయన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. బాల్యంనుండి తన కులం వలన తాను పొందిన అనుభవాలు బాధామయమైన జీవితంలోని అనేక సంఘటనలు ఆయన రచనలలో అనుభూతులను, ఆవేదనను అత్యంత కరుణరసాభినివేశంతో వెల్లడించారు జాషువ. అస్పృశ్యత ను నిరసించడం, మూఢాచారాలను గర్హించడం, జాతీయోద్యమం, స్త్రీజన అభ్యుదయ కాంక్ష మొదలైనవి  జాషువ రచనలలో ప్రధానంగా కనిపించే అంశాలు.
కాదేదీ కవితకనర్హం అంటూ ఆయన తరువాత కాలంలో శ్రీశ్రీ చెప్పినా జాషువ గారు స్పృశించిన కవితా వస్తువులను చూస్తే నిజమే ననిపిస్తుంది.


జాషువ గారి కవితలో   సంప్రదాయ కవిత కాలంనుంచి, భావకవిత్వ యుగం వరకు  కనిపించే ప్రభావాలన్నీ కనిపిస్తాయి. సంప్రదాయ కవిత్వంలో లాగే పద్యాలతో కావ్య రచన చేసినా అందులో సరళ వ్యావహారిక పదాలను అందులోనూ అరబ్బీ, పారశీకం, ఆంగ్ల భాషల పదాలను కూడా అలవోకగా ప్రయోగిస్తూ రచనలు చేసారు. కొన్ని రచనలలో భగవంతుడిమీద నమ్మకం కలిగిన ఆస్తికుడిగాను, మరికొన్ని రచనలలో నిరీశ్వర తత్వం తోను రచనలు చేసి నాస్తికుడిగాను కనిపించినా జాషువ రచనలద్వారా ప్రధానంగా మనం గ్రహించగలిగే తత్వం - ఆయన లోని మానవత్వం.


'క్రీస్తు చరిత్ర' పేరుతో  జాషువ రచించిన కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడెమీ వారి బహుమతి 'పద్మ భూషణ' బిరుదు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలంయం నుండి ' కళా ప్రపూర్ణ '  పొందారు. తన కావ్యరచనా పటిమకు ప్రజలనుండి నీరాజనాలు అందుకున్నారు. గండ పెండేరం తొడిగించుకున్నారు. గజారోహణం చేసారు. కనకాభిషేకాలు చేయించుకున్నారు. కవి కోకిలగా, నవయుగ కవి చక్రవర్తిగా, కవి దిగ్గజంగా,  మధుర శ్రీనాధుడు గా ప్రజల లో కీర్తించబడ్డారు.

ఒకడు ప్రోత్సహింప నొక్కడు నిరసింప
నొకడు చేరబిలువ నొకడు తరుమ
మిట్ట పల్లములను మెట్టుచు నెట్టులో 
పలుకులమ్మ సేవ సలిపినాడ

అంటూ లోకం తనను ఎన్ని విధాల  తిరస్కరించినా, సత్కరించినా ఎక్కడా నిరుత్సాహ పడక పోవడమే కాక పూర్ణోత్సాహంతో తన కవితా ప్రస్థానాన్ని సాగించానన్నారు జాషువ. తిరుపతి వేంకట కవులలో ఒకరైన కవిదిగ్గజం చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి వంటి మాన్యులతో గౌరవంగా గండపెండేరం తొడిగించుకున్న అదే జాషువ, మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ వంటి వారి చేత అవమానాలు పొందారు. కానీ దూషణ భూషణాలను సమానంగా భరిస్తూ  మొక్కవోని దీక్షతో సాహితీ వ్యవసాయాన్ని కొనసాగించిన స్థితప్రజ్ఞత జాషువకు మాత్రమే చెల్లింది.


ఇటువంటి తన జీవిత కాలంలో తాను పొందిన అనుభవాలను తాను పొందిన సన్మానావమానాలను ఎంతో సమర్థంగా కమ్మని కావ్యరూపం ఇచ్చి నా కథ అనే పేరుతో పద్యాలలో రచించారు.

తెలుగువారికి మాత్రమే చెందిన పద్య ప్రక్రియలోనే రచనలు చేసినా అందులో కవిగా తన స్వాతంత్య్ర దృష్టిని ప్రకటించారు.  ఆధునిక దృష్టితో, వ్యావహారిక శైలిలో గుండె లోతుల్లోనుండి పొంగి వచ్చిన కవితా ప్రవాహం అనదగిన చిక్కని కవిత్వం రాస్తూ అందమైన అచ్చతెలుగు పదాలతో పాటు అరబ్బీ, పార్శీ, సంస్కృతం లాంటి ఇతర భాషల పదాలను కూడా సందర్భానుసారం, అత్యంత భావగర్భితంగా ప్రయోగిస్తూ
తెలుగు పద్యానికి కొత్త సొబగులు అద్దారు జాషువ.


కులమతాలనే కుళ్ళుతో కునారిల్లుతున్న సమాజంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులనుండి  సమ సమాజం, సమతావాదపు పునాదులతో ఏర్పడాలని కోరుకున్నారు జాషువ.


జాషువ పద్య కృతులు హిమధామార్కధరా పరిణయం, శివాజీ ప్రబంధం, కన్యకా పరమేశ్వరి మొదలయినవి.ఇవి మొత్త ఏడు సంపుటాలలో ప్రకటించబడ్డాయి.

రక్తగానం అనేపేరుతో గల రచన యుద్ధ ప్రచార గీతాల సంకలనం. 

ఫిరదౌసి,ముంటాజ్ మహల్, క్రీస్తుచరిత్ర, గబ్బిలం, నాగార్జున సాగరం, స్వయం వరం, నేతాజీ, కాందిశీకుడు, రాష్ట్ర పూజ, కొత్తలోకం, ముసాఫరులు,బాపూజీ  అనే ఖండ కావ్యాలు, దావీదు చరిత్ర , ధ్రువ విజయము, చిదానంద ప్రభాతము, రుక్మిణీ కల్యాణం, మీరాబాయి, తెరచాటు  జాషువ రచించిన నాటకాలు. ఇంకా చిన్నానాయకుడు, కుశలవోపాఖ్యానం అనే వచన రచనలు కూడా చేసారు. కానీ జాషువ రచనలలో గద్యం కన్నా పద్యరచనలకే ఎక్కువ ప్రజాదరణ లభించింది.


జాషువ రచనలలో పిరదౌసి కావ్యం చాలా విశిష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానమైన కథాంశం - గజనీ మహమ్మద్ అనే రాజు చేతిలో మోసపోయి ఆ అవమానంతో బాధతో చేయని నేరానికి శిక్షను అనుభవించిన పిరదౌసి అనే పారశీక కవి జీవితంలోని వేదనను కావ్యంగా మలచడం.


గజనీ మహమ్మదు అనే ఆఫ్ఘను దేశపు రాజు పారశీక కవి అయిన పిరదౌసిని పిలిపించి తన వంశ చరిత్రను కావ్యంగా రాయమని, ఆ కావ్యాన్ని తనకు  అంకితం ఇవ్వమని కోరతాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు దీనారం చొప్పున బహుమతి ఇస్తానని అల్లాపై ఒట్టు వేసి  కవికి వాగ్దానం చేస్తాడు. కవి పిరదౌసి ఎంతో సంతోషించి కవి ముప్ఫయి సంవత్సరాల పాటు కష్టపడి అరవై వేల పద్యాలతో రాజుగారి వంశ చరిత్రను, ఆ రాజుల పరాక్రమాలను వర్ణిస్తూ అత్యంత ప్రతిభతో కావ్య రచన చేసాడు.  

ఈ కావ్యరచన చేసినప్పుడు ప్రకృతిలో ఒక భాగంగా ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ , తన అనుభవాన్ని తన రచనలోకి అనువదిస్తూ కవి ఎంత గొప్పగా ఆ కావ్య రచన చేసాడో  జాషువ వర్ణిస్తారు. కవిని కన్న తల్లి గర్భము ధన్యమయింది అంటారు జాషువ. అటువంటి కవి రచనని అంకితంగా అందుకున్న కృతి భర్త అయినవాడికి కూడా మరణం అంటూ ఉండదు. కావ్య రచన చేసినవాడు, దానిని అంకితం పొందినవారికి కూడా ఎప్పుడూ మరణమనేది ఉండదంటారు జాషువ. ఎంతో కష్టపడి  తాను రచించిన షానామా గ్రంథాన్ని ముగించి రాజుగారికి అంకితం ఇచ్చాడు పిరదౌసి. రాజు చాలా సంతోషించాడు. మరునాడు సభకు వచ్చి ఆ కావ్యాన్ని పఠించమని అడిగాడు.


పూలమాల చేతపట్టుకుని లజ్జావతియై సభాప్రాంగణంలోకి ప్రవేశించే రాజకుమార్తెలా పిరదౌసి తను రచించిన కావ్యాన్ని చంకలో పెట్టుకుని తనకు లభించబోయే అత్యున్నతమైన గౌరవాన్ని గురించి ఊహిస్తూ ఉత్సాహంగా సభలోకి ప్రవేశించాడు పిరదౌసి.  తనను వరించబోతున్న కావ్యకన్యను గ్రహించబోతున్న గజనీ మహమ్మదు సభలో సింహాసనం పై కూర్చొని కొత్త పెళ్ళికొడుకులా చిరునవ్వుతో ప్రకాశిస్తున్న మోముతో  కవి పిరదౌసి ని కావ్య పఠనం చేయమని ఆదేశించాడు. 

బయటకు ప్రకాశిస్తూ ఉన్న లోపల డొల్లగా ఉండే కరిమింగిన వెలగపండు వంటి జ్ఞానంతో పెద్ద పెద్ద బొజ్జలతో,  మీసాలు దువ్వుతూ ఉన్న తురుష్కపండితులు నిండి ఉన్న సభలో  తన కావ్యాన్ని పఠించడం ప్రారంభించాడు పిరదౌసి.  అరవై వేల పద్యాలను తన కల్పనాశక్తితో , గుర్రంలా కదనుతొక్కే పద్యగమనంతో చదువుతూ సభలోని రాజును, పండితులను కూడా అలరింపజేసి  కావ్య పఠనం పూర్తిచేసి తనకు కలగబోయే గౌరవ సన్మానాలను ఊహిస్తూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు పిరదౌసి.


కానీ కవి ఊహించినది వేరు, జరిగినది వేరు. పిరదౌసి రచించిన కావ్యం లోని మాధుర్యాన్ని ఎంతగానో అనుభవించి, ఉత్తేజితులై కూడా రాజుగారు కవికి తను బాస చేసినట్టు బంగారు దీనారాలను కాక ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క వెండి నాణెం  చొప్పున రాజు  అతని ఇంటికి పంపించారు.  దానికి కారణంగా జాషువ గారు ఇక్కడ ఓ పదం వేసారు.
పండితులేమి చెప్పిరో అంటూ. దేవుడు వరమిచ్చినా పూజారి కూడా కనికరించాలంటారు. రాజు దగ్గర ఉన్న పండితులు ఈర్ష్యాసూయలతో  కల్మషం నింపుకొని పిరదౌసి గురించి అతని కావ్యాన్ని గురించి చెప్పిన చెడ్డమాటలు రాజు మనసులో కూడా విషాన్ని నింపాయి. అందుకే పిరదౌసి కి తాను చేసిన వాగ్దానాన్ని దాటి రాజు ఒక్కొక్క పద్యానికి బంగారు నాణాలకు బదులు, వెండి నాణాలు పంపించాడు.  రాజు చేసిన ఈ మోసానికి పిరదౌసి గుండె దహించుకుపోయింది. భరించలేని అవమానంతో, వేదనతో అతని శరీరంలోని రక్తమాంసాలతో పాటు మనసు కూడా ఉడికిపోయింది.


ఎన్నో కొండలు గుండెలోఁగరఁగి పోయెన్, వార్ధి సంతానముల్ 
గన్నీరయ్యె, సమస్త లోకము నిరాకారస్థితింబొల్చె, ను
త్పన్నం బయ్యె విషాద మేఘ పటలధ్వాంతౌఘ,మాశాలతల్
సున్నాలయ్యె నగాధ కూపజలరాసుల్ దోఁచెఁ బిర్దౌసికిన్


అన్న పద్యంలో రాజుగారు చేసిన అవమానాన్ని  భరించలేని పిరదౌసి  ఆవేదనను, మానసిక స్థితిని అద్భుతంగా వర్ణించారు జాషువ. రాజు పంపిన కానుకను, తిరస్కరించి పంపివేసాడు పిరదౌసి. తాను నిర్మించుకున్న ఆశా సౌధాలు నేలకూలిపోగా ఆవేదనతో , దుర్బరమైన మానసిక వ్యథతో  రాజు తనకు చేసిన అవమానాన్ని నిరసిస్తూ ఓ లేఖ రాసి రాజుకు పంపించాడు.

ప్రపంచ సాహిత్యంలో లేఖారచన - గొప్ప సాహితీ  ప్రక్రియగా  ఎంతో ఆదరణ పొందిన ప్రక్రియ.   లేఖల ద్వారా తమ మానసికమైన అనుభూతులను అద్భుతంగా వర్ణించి కావ్యస్థాయికి చేరిన వర్ణనలతో, కల్పనలతో కూడినవి సాహిత్యంలో అత్యున్నతమైన స్థాయిని అందుకున్న రచనలెన్నో.  జాషువ - పిరదౌసి తనకు రాజు కలిగించిన ఆశా భంగాన్ని వర్ణిస్తూ గజనీ మహమ్మదును సంబోధిస్తూ అతనికి రాసిన లేఖ అటువంటి గొప్ప అనుభూతిని కలిగించే రచన.

ఆ లేఖ ఈ విధంగా ఉంటుంది. పిరదౌసి రాజును సంబోధిస్తూ రాసిన లేఖ కనుక సందర్బంలో కవి ఓ సుల్తాను మహమ్మదూ అంటూ రాజును సంబోధిస్తారు.
ఓ సుల్తాను మహమ్మదూ కృతకవిద్యుద్దీపముల్ నమ్మ యా
శాసౌధంబును గట్టికొంటి నది నిస్సారంపుటాకాశమై
నా సర్వస్వము దొంగిలించి నరకానం గూలిపోయెన్ వృథా
యాస ప్రాప్తిగ నిలినాఁడనొక దుఃఖా క్రాంత లోకంబునన్ 


పిరదౌసి సుల్తాను తనకు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆశాభంగం పొందడాన్ని గురించి ఇలా అంటాడు.  "ఓ సుల్తాను మహ్మదూ, నకిలీకాంతులు నమ్ముకొని ఆశా సౌధాన్ని కట్టుకున్నాను. కానీ అది ఏ వెలుగూలేని చీకటినిండిన ఆకాశంలో, నరకంలో కూలిపోయింది. చేసిన పని అంతా నిష్ప్రయోజనం కాగా చీకటి లోకంలో నిలిచిపోయాను.
ఇక నా కలంలో మసి అనే సిరా నిండిపోయింది.  విషాద గీతాలను మాత్రమే రచించగలను. నీకు చేసిన ముప్పయి ఏళ్ళ సేవకు ప్రతిఫలంగా నాకు వయస్సు పట్టుతప్పి, వార్థక్యం అలముకున్న  శరీరం మాత్రమే మిగిలింది."


ఒక్కొక్క పద్దియంబునకు నొక్కొక్క నెత్తురు బొట్టు మేనిలోఁ
దక్కువగా రచించితి వృథా శ్రమయయ్యెఁ గులీనుడైన రా
జిక్కరణిన్ మృషల్ పలుకునే కవితాఋణమీయకుండునే
నిక్కమెఱుంగనైతి గజనీసులతాను మహమ్మదగ్రణీ.


అల్లా తోడని పల్కి పసిఁడి కావ్య ద్రవ్యమున్ వెండితో
జెల్లింపన్ దొరఁకొన్న టక్కరివి నీచేఁ బూజితుండైనచో
నల్లాకున్ సుఖమే మహమ్మదు నృపాలా సత్యవాక్యంబెవం
డుల్లంఘింపడొ వాఁడెపో నరుఁడు, ధన్యుండిద్ధరా మండలిన్.


"ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క నెత్తురు బొట్టు కర్చు అవుతూఉండగా నీ వంశ చరిత్రను రాసాను. కవితకు బహుమతి ఇస్తానన్నావు. మంచి వంశంలో పుట్టిన వాడివికదా మరి. ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేయవచ్చునా రాజా?
నీవు చాలా టక్కరి వాడివి సుమా. అల్లా తోడుగా నాకు బంగారం దీనార్లు చెల్లిస్తానని చెప్పి, వెండి నాణాలను పంపించావు. ఈ విధంగా అబద్ధాలాడే నీలాంటి మోసగాడితో పూజించబడితే అల్లాకు సుఖంగా ఉంటుందా చెప్పు.
ఎవడైతే సత్యవాక్పరిపాలన చేస్తాడో వాడే ఈ భూమ్మీద గొప్పవాడు" అంటూ పిరదౌసి  రాజుకి సత్యవాక్య పరిపాలన గొప్పతనాన్ని చెప్తాడు.

హాయిగ నీ యశస్సు వెలయం గల చక్కని మేడఁగట్టి దీ
ర్ఘాయువుఁబోసినాడను తదన్వయవల్లికి వట్టి చేతులన్
బోయెద నంధకారమున మున్గి సుఖంబులఁబొద్దు గ్రుంకె రా
జా యికఁ దాండవించెద భయంకర ఖేద తమాల వాటికన్.


సుల్తాను వంశ ప్రతిష్టను పెంచేవిధంగా తాను రాసిన కావ్యం వలన అతని వంశం తరతరాల పాటు వర్థిల్లే విధంగా  కీర్తి అనే మేడకట్టి దానికి వంశ చరిత్ర అనే తీగను పాకించి సుదీర్ఘకాలం మన్నేలా చిరాయువు పోసానని, కానీ సుల్తానుకు ఇంత చేసిన తాను ఒట్టి చేతులతో వెళుతున్నానని, ఇక తన జీవితంలో సుఖాల పొద్దులు గ్రుంకి పోయాయని, చీకటి తోటలలో తానిక ఒంటరియై దుఃఖంతో తాండవిస్తానని అంటాడు పిరదౌసి.


దిరముగ బానిసీని నభిషేక మొనర్చితి మల్లె పూవుట
త్తరు లొలికించి మాయ జలతారున రాదు గదా పసిండి యో
కఱకు తురుష్క భూపతి యఖండ మహీవలయంబునందు నా
శిరమునఁబోసికొంటిని నశింపని దుఃఖపు టగ్నిఖండముల్.


గజనీ మహమ్మదు వంశం బానిస రాజుల వంశం. అందువల్ల జాషువ పిరదౌసి తో ఇలా అనిపిస్తారు. ఓ కఱకు తురుష్క భూపతీ అంటూ  రాజుగారిని సంబోధిస్తూ  పిరదౌసి ఇలా అంటాడు. "నేను ఒక బానిస రాజును మల్లెపూల అత్తరుతో అభిషేకించాను అదే నేను చేసిన తప్పు. నకిలీ జరీ వస్త్రం లోంచి బంగారం తీయాలనుకుంటే సాధ్యం అవుతుందా. ఇక ఎప్పటికీ ఆరిపోని  నిప్పుకణికల లాంటి దుఃఖాన్ని నా నెత్తిన పోసుకున్నాను."


అలసటఁదీర్చుకొందును మహమ్మదు రాజులతో సమాధి శ
య్యలపయి ముప్పదేఁడుల ప్రయాసకు డెందము గందిపోయె ని
ర్మలమగు చిత్తశాంతి కిఁక మార్గము లేదెనలేని పండు వె
న్నెల గురియించు నా కవిత నీకు లభించె నసత్యవాదికిన్.


"ముప్పయి ఏళ్ళపాటు నేను చేసిన ఈ కావ్యరచన అనే శ్రమవలన నా మనసు అలసిపోయింది. ప్రశాంతమైన మనసుతో జీవించే అవకాశం నాకిక లేదు.  మహమ్మదు రాజుల కోసం కట్టిన సమాధులనే పడకగా చేసుకొని వాటిమీదనే విశ్రమించి నా అలసటను తీర్చుకుంటాను. నీవు ఎంతో అదృష్టవంతుడివి.  నీవంటి అసత్యవాదికి పండు వెన్నెల కురిపించే కవితని బహూకరించినందుకు నాకు తగిన సత్కారమే లభించింది సుమా!!"


పిరదౌసి ఈవిధంగా తనను సంబోధిస్తూ రాసిన లేఖను అందుకున్న రాజుగారికి కళ్ళు ఎర్రబడ్డాయి.
 చాలా కోపించాడు. ఆవేశంతో ఊగిపోయాడు. చుట్టూ ఉన్న పరిజనంలో పిరదౌసి పై ఈర్ష్యపడే కవులూ ఉన్నారు. వారు రాజును  మరికొంచెం రెచ్చగట్టారు. పిరదౌసి పాటి కవిత్వం  చెప్పగలిగే కవులెందరో తమలోనూ ఉన్నారని, పిరదౌసి రాసిన కావ్యంలో రాజుగారి వంశానికి కీర్తి కన్నా అపకీర్తి ఎక్కువ కలిగే అంశాలే ఉన్నాయిని వాళ్ళు రాజుగారికి చెప్పారు.  అయినా నల్లని తేనెటీగలు తెల్లని మల్లెపూల నడుమ తిరుగుతున్నా వాటి నలుపు మల్లెలకు అంటనట్టే రాజుగారి వంశం గురించి తక్కువ చేసి రాసినా  రాజుగారి వంశ మర్యాదకు భంగం కలగదంటూ పిరదౌసి పై రాజు కోపం ఇనుమడించేలా మాట్లాడారు.


నరపతి ప్రేమతో నొక తృణంబొ పణంబొ యెసంగె దానితోఁ
గరము వహింప కిక్కరణిఁ గాఱులు కూయునే పారసీకుంఢె
వ్వరు రచియింపలేరితని పాటి కవిత్వ మటంచుఁ బల్క జొ
చ్చిరి సభలోన నిచ్చకపు జీతములందెడు పండితబ్రువుల్


"రాజుగారు కరుణించి ఇచ్చిన తృణమో పణమో  కిమ్మనకుండా తీసుకొని ఊరుకోకుండా, ఈ విధంగా కారుకూతలు కూస్తాడా, ఈ పాటి కవిత్వం మేము మాత్రం చేప్పలేమా" అంటూ పండితులు రాజుగారిని ఎగదోసారు. వాళ్ళు
" ఇచ్చకపు జీతములందెడు పండితబ్రువుల్ " అనడంలో ఈనాడు కూడా  ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారికి ఇచ్చకాలు చెప్పేవారు తలచుకుంటే ఏ విధంగా అయినా చేయగలరని, వారి దయా దాక్షిణ్యాల పైనే కళాకారుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుందనీ అన్యాపదేశంగా చెప్పారు జాషువ. వెంటనే రాజు కోపంతో ఊగిపోయి పిరదౌసిని పట్టి బంధించి అతనిని వెంటనే చంపమని ఆజ్ఞ ఇచ్చాడు తన సేవకులకు.


రాజుగారి సభలో సత్కవులు, ప్రతిభను గుర్తించే వారు ఉన్నారు. వారు మాత్రం రాజు చేస్తున్న ఈ పనికి చాలా బాధ పడ్డారు. రాజు అప్పటికే ఎంతో దుర్మార్గుడని పేరు పొందినవాడు. ఇక "ఇక్కడితో అతని పాపం పండినట్టుంది, అందుకే సత్కవి అయిన పిరదౌసిని చంపదలచుకున్నాడు ఈ రాజు అని " అనుకున్నారు.  ఆశాభంగం వలన కలిగిన దుఃఖంతో ఉడికిపోతున్న కవి రక్త పాతం వలన రాజుకి ఇక అమంగళం జరుగుతుందని భావించారు ఆ ధర్మపరులు.


రాజు తలమీఁద గవి కప్పురంబు చల్లె
సుకవి తలమీఁద రాజు నిప్పు కలు విసరె
కొందఱే పుణ్యమో చేసుకొనియె ననిరి
కొందఱే పాపమో పట్టి కుడిపెననిరి
రాజు తన వంశచరిత్రను కావ్యంగా రాయమని అడిగితే పిరదౌసి ఎంతో మహాద్భుతమైన కావ్యరచనా శక్తితో కావ్యాన్ని రచించి  రాజుకి అంకితం ఇచ్చి అతని తల మీద కర్పూరం చల్లాడు ట. కానీ అటువంటి కవిని గౌరవించి నెత్తిమీద పెట్టుకుని పూజించవలసినది పోయి రాజు  పిరదౌసి తలమీద నిప్పులను రాళ్ళలాగా చేసి విసిరాడుట. ఉపకారానికి అపకారం చేయడం అంటే ఎలా ఉంటుందో అన్న భావనని ఎంత అద్భుతంగా చెప్పారు జాషువ !! కొందరే పుణ్యమో చేసుకొనియె ననిరి అన్న వాక్యం రాజుకి వర్తిస్తుంది. ఏదో పూర్వజన్మ పుణ్యం వలన రాజు ఇటువంటి కావ్యాన్ని అంకితంగా పొందాడు అని కొందరు భావించారుట. కానీ మరికొందరు పిరదౌసి గురించి  ఏ పూర్వ జన్మ పాపమో ఇతనిని పట్టి కుడుపుతోంది కదా అని బాధ పడ్డారుట. భారతదేశం లో మానవసమాజంలో లోతుగా పాతుకు పోయిన భావన కర్మ సిద్ధాంతం ఇక్కడ జాషువ గారి పద్యంలో కనిపిస్తుంది. మనుషులు చేసిన, పొందిన అనుభవాలన్నిటినీ కర్మసిద్ధాంతాన్ని ఆపాదించి గాఢంగా నిట్టూర్చి  అది అంతే అంటూ వాటిని సరిపెట్టుకునే మనస్తత్వాన్ని ఇక్కడ చూపారు జాషువ.


కానీ ఒక పుణ్యాత్ముడు పిరదౌసిని వధించడానికి బయలుదేరిన సైనికుల కన్నా ముందుగానే బయలుదేరి, పిరదౌసిని చేరుకొని రాజుగారి ఆదేశాన్ని వినిపించి అతనిని అక్కడనుంచి పారిపోమని హెచ్చరించాడు.


అరువది వేల దిన్హరము లస్త్రములై తుద కిట్లు కుత్తుకన్
దఱకుట కుద్యమించిన విధానము సర్వము నాలకింపఁగా
పిరదవుసీ ముఖాబ్జమునఁ బిన్నని నవ్వుదయించె మింట నీ
శ్వరుండు కలండొ లేఁడొ యను సంశయమున్ దళుకొత్తె నెమ్మదిన్


రాజుగారి ఆజ్ఞ విన్న పిరదౌసి హతాశుడయ్యాడు. తాను రాజుగారి ప్రీతి కోసం రచించిన కావ్యంలోని అరవై వేల పద్యాలు     అరవై వేల ఆయుధాలుగా మారిపోయి చివరకు తన కుత్తుకను కోయడానికి ప్రయత్నం చేయడాన్ని ఊహించిన పిరదౌసి కి ఒళ్ళు జలదరించింది.


అసలు ఆ పైన దేవలోకంలో భగవంతుడు  అనేవాడు ఉన్నాడా?  ఉంటే  ఈ అన్యాయాన్ని చూడకుండా ఏం చేస్తున్నాడు?  అనే సదస్త్సంశయానికి లోనయ్యాడు. ఆ ఆలోచన క్రమంగా అతనిలో ఓ నైరాశ్య భావానికి లోను చేసింది. చివరకు అతని ముఖం పై ఓ సన్నని నవ్వు ఉదయించింది. ఈ పద్యంలో బీభత్సరస ప్రధానమైన ఓ సన్నివేశం చిత్రించారు జాషువ. పిరదౌసి ముఖంలో కనిపించిందని కవి వర్ణించిన చిరునవ్వు పాఠకుడి మనసులో తీవ్రమైన అలజడి సృష్టిస్తుంది.


కృతి యొక బెబ్బులింవలె శరీరపటుత్వము నాహరింప శే
షితమగు నస్థి పంజరము జీవలంబున నూఁగులాడఁగా
బ్రతికియుఁ జచ్చియున్న ముదివగ్గు మహమ్మదుగారి ఖడ్గ దే
వతకు రుచించునా పరిభవ వ్యధ యింతట నంతరించునా


అంటూ తను రచించిన షానామా కావ్యం ఒక బెబ్బులిలా తనపైన పడి తనలోని జవసత్వాలన్నీ ఆరగించగా కేవలం అస్థిపంజరంలా మిగిలిఉన్నానంటూ, ఇటువంటి ముసలివాడి శరీరం మహమ్మదు గారి ఖడ్గదేవతకు బలి గా ఇస్తే ఆ దేవత సంతోషిస్తుందా అనుకున్నాడు.


ముత్యముల కిక్కయైన సముద్రమునను
బెక్కుమాఱులు మున్కలు వేసినాఁడ
భాగ్య హీనుఁడ ముత్యమ్ము పడయ నయితి
వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు


ముత్యాలకు నిలయమైన సముద్రంలో ఎన్నో సార్లు మునకలు వేసాను. కానీ ఎంత భాగ్యహీనుడిని. ఒక్క ముత్యాన్నయినా సంపాదించుకోలేక పోయాను. సరికదా ఆ సముద్రమే నన్ను మింగడానికి నోరుతెరిచింది అంటూ ఓ పద్యాన్ని ఆ ఊరి మసీదు గోడలమీద లిఖించి ఆ అర్థరాత్రి సమయంలో భార్యను, పుత్రికను తీసుకుని ఊరువిడిచి తన స్వగ్రామమైన తూసు పట్టణానికి వెళ్ళిపోయాడు పిరదౌసి. వేకువజామునే ప్రార్థన కోసం వచ్చిన భక్తులు ఈ పద్యాన్ని చదువుకొని ఒళ్ళు జలదరించగా పిరదౌసి మీద జాలితో కదిలిపోయారు.


మరి కొన్నేళ్ళకు మహారాజుగారికి పశ్చాత్తాపం కలిగింది. తను చేసిన ఘోరాపరాధాన్ని తెలుసుకున్నాడు. కవికి తాను చేసిన ద్రోహానికి చాలా బాధ పడ్డాడు. పిరదౌసి కవికి తాను ఋణ పడిన బహుమతి మొత్తాన్ని అరవై వేల బంగారు దీనారాలను ఒంటెలపైకి ఎత్తించి  భటులకు చెప్పి పిరదౌసి కి చెల్లించమని తూసు పట్టణానికి పంపించాడు.


కానీ విధి బలీయమైనది. మనం తలచుకున్నది ఏదీ జరగదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. రాజు పంపిన బహుమతి మొత్తం పిరదౌసి కి చేరవేయడానికి రాజు బలగం తూసు పట్టణం తూర్ప ద్వారానికి చేరుకున్నది. కానీ అదే సమయానికి కవి పిరదౌసి తీరని దుఃఖంతో,  చేసిన మంచి పనికి గుర్తింపు లేకపోవడమే కాక, చేయని నేరానికి పొందిన శిక్ష  గా అకాల వార్థక్యాన్ని పొంది అవమానంతో అలమటిస్తూ మరణించగా అతని శవం పడమటి ద్వారం ద్వారా స్మశానానికి బయలుదేరింది.


రాజ భటులు మరేం చేయాలో తోచక ఆ ధనాన్ని పిరదౌసి కుమార్తెను స్వీకరించమని ప్రార్థించారు. కానీ అభిమానంలో తండ్రికి తగిన కూతురు పిరదౌసి కుమార్తె. ఆమె ఆ బహుమానాన్ని అంగీకరించలేదు సరికదా నా తండ్రిని నిరంతరం మరణించే వరకు దుఃఖ పెట్టిన ఈ నీచమైన ధనాన్ని నేను కంటితో కూడా చూడను, ముట్టలేను అంటూ తిరస్కరించింది. 


తాను కవి ఋణం తీర్చుకుందామనుకున్నా వీలుకాలేదని, సమయం మించిపోయిందని గ్రహించిన గజనీ మహమ్మదు ఎంతగానో బాధ పడ్డాడు. చేసిన పాపానికి నిష్కృతిగా తూసు పట్టణంలో ఒక గొప్ప సత్రాన్ని పిరదౌసి పేరు మీద  అతని పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్మిచాడు.  సమయం మించిపోయిన తర్వాత చేసిన  పని, మంచిపనే అయినా అది ఫలితాన్నివ్వదు. కవి పిరదౌసికి కీర్తి మిగిలింది. రాజుకు అపకీర్తి మిగిలింది. 


పిరదౌసి కావ్యాన్ని జాషువ గారు ఒక పారశీక కవి జీవితాన్ని చిత్రించడం అనే ఇతివృత్తం తోనే రచించినా తాను నివసిస్తున్న సమకాలిన సమాజంలోని వాస్తవాన్ని సామాజిక వాస్తవికతో చిత్రించడం వలన అది సజీవకావ్యంగా నేటికీ నిలిచిపోయింది. కవి స్వీకరించిన ఇతివృత్తానికి తగిన  సన్నివేశ కల్పన, పాత్ర చిత్రణలో - పాత్ర బహిరంతర స్థితిగతులను వర్ణించడంలో జాషువ చూపిన ప్రతిభా పాటవాలు పిరదౌసి పాత్రను నేటికీ సజీవంగా నిలిపాయి. సమకాలిన భారతీయ జీవితంలోని వ్యక్తుల మానసిక, సాంఘిక స్థితిగతులపైన, మానవ ప్రవర్తనపైన లోతైన అవగాహన కలిగిన కవిగా జాషువ తన ప్రతిభను పిరదౌసి కావ్యంలో  వ్యక్తీకరించారు.


"రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు" అని జాషువ గారు చెప్పిన  మాటలు జాషువ గారికే వర్తిస్తాయి. తెలుగు సాహితీ లోకంలో  మరణంలేని మహాకవి , గొప్ప మానవతావాది - అమరుడు మన గుఱ్ఱం జాషువ.


(గుఱ్ఱం జాషువాగారి నూట పదహారేళ్ళ జయంతి ఉత్సవం సందర్భంగా ఆ మహాకవికి  జోహార్లర్పిస్తూ)











Thursday, August 18, 2011

ఓ ప్రశ్న... మరో ప్రశ్నే జవాబు....!!


రాధాకృష్ణులు అంటేనే ప్రేమకు పర్యాయపదం.

రాధలాగే తాను ఎంతగానో ఇష్టపడి ఆరాధించిన ప్రేమికుడు, కృష్టుడిలాగే తన వలపు రుచి చూపి తనను అనురాగ వర్షంలో తడిపిన తన ప్రియతముడు ఒక్కసారిగా తనను, తన ప్రేమను మరిచి, చివరకు తననే నీవెవరు, నాకు నీతో ఏం సంబంధం ఉందని ప్రశ్నిస్తే ఆ వలచిన హృదయం ఏమయిపోతుంది?

అటువంటి ప్రశ్నకి ఆ క్షణాన ముక్కలుగా విడిపోయి, వలచిన, వలపించబడిన హృదయం పగిలిన గుండెతో ఆవేదనతో రగిలిపోతూ ఇలాగే పాడుకుంటుందేమో.

నల్లనయ్యా...ఎవరని అడిగావా నన్నూ..

మురళిని కాలేను

పింఛమయినా కాను

నల్లని కృష్ణయ్యకి ఎల్లవేళలా అంటి పెట్టుకొని ఉండేవి అతని పింఛమూ, మురళీ. మరి తాను ఆరెండూ కాదు. అందుకే అతనికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఆ నల్లనయ్యని ఎదలో ఎంతో దగ్గరగా ఊహించినా వాస్తవంగా దగ్గరకు చేరలేకపోయింది.

ఎవరని చెప్పాలీ నేనూ....ఏమని చెప్పాలీ నేనూ...

వలచిన రాధమ్మనూ విరహాన దించావు

పెంచినమ్మ యశోదనూ శోకాన ముంచావు

నీవు నేర్చినదొకటే -నిన్ను వలపించు కోవడం

నాకు తెలియని దొకటే - నా మనసు దాచుకోవడం

ఎవరని చెప్పాలీ నేనూ...ఏమనిచెప్పాలీ నేనూ.

ఆ నల్లనయ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాధమ్మను ఏనాడు తన దగ్గరకు చేర్చుకోలేదు. గోకులంలో బృందావనంలో యమున ఒడ్డున విరహగీతాలను ఆలపిస్తూ ఏనాడైనా అతనికి కనికరం కలగకపోతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది రాధ. రాధమ్మ సరే...మరి తల్లి యశోద సంగతి ? అల్లారుముద్దుగా తనని పెంచినందుకు ఏం చేసాడు. పెరిగి పెద్దవాడై గోకులాన్ని, గోపాలకులని విడిచిపెట్టి వెళ్ళడమే కాక వారితో పాటు ఆ పల్లెలో తనకో తల్లి ఉందని తనతోటిదే లోకంగా బతికిందని మర్చిపోయి దేవకీ నందనుడిగా ద్వారకలో వెలిగిపోయాడు. తల్లిని మరచాడు, చెలినీ మరచాడు.

అతనిగురించి ఇప్పుడు ఇక్కడ ఈ చెలికి అర్థమైన విషయం ఒకటే. అతనికి ఎన్నో విషయాలు తెలుసు. ఎంతో అనుభవజ్ఞుడు. ఎన్నోనేర్చాడు. వాటిలో జగమంతా అతన్ని విశ్వప్రేమికుడిగా భావించి అతని ప్రేమలో లీనమైపోయేలా చేయడం - ఇది అన్నిటికన్నా అతనికి బాగా తెలిసిన విద్య. కానీ ఆ గోపాలుడిని ప్రేమించిన ఆ బాల ఒట్టి ముగ్థ. కేవలం నల్లనయ్యనే సర్వస్వమని నమ్మింది. ఏకళలూ తెలియని బేల. అందుకే తన మనసును ఎప్పటికప్పుడు అతని ఎదుట విప్పి చెప్పి అతనిపై ప్రేమను ప్రదర్శించింది. కోరిచేరిన ఆడమనసు ఎవరికైనా అలుసే. అందుకే గోపాలుడికి ఆమె మీద అంత నిర్లక్ష్యం. అది ఇప్పుడు గ్రహించింది ఆమె.
వెన్నయినా మన్నయినా ఒకటే అన్నావు

దొంగవయిన గానీ దొరవై నిలిచావూ

ఎంత మరవాలన్నా మనసును వీడిపోనంటావూ

ఎంత కలవరించినా కనులకు కానరాకున్నావూ

ఎవరని చెప్పాలీ నేనూ....ఏమనిచెప్పాలీ నేనూ...


ఇక ఇక్కడ నుంచి మనకు కృష్ణతత్వం ఆవిష్కృతమవుతుంది. వెన్నతిన్నాడు, మన్నూ తిన్నాడు. ఆ మన్ను తిన్న నోటిని లోనే పదునాలుగు లోకాలనూ చూపాడు. వెన్ననీ మన్నునీ సమానంగా చూసిన ఆ కృష్ణ భగవానుడు భగవత్ స్వరూపుడుగా నిలిచాడు. చిలిపి దొంగతనాలు చేసి వ్రేపల్లె వాసులకు, గోపికలకు గుండెల్లో గుబులు పుట్టించాడు. దొంగ అయితేనేం దర్జాగా దొరగా మారిపోయి అనంతమైన గౌరవాలను, మర్యాదలను అందుకున్నాడు. కానీ తనను ప్రేమించినవారిపైన మాత్రం కినుక వహించాడు.

తనకోసం కలవరించే తన తల్లి యశోదను, తన రాధమ్మను, తన అడుగుల సవ్వడికై వేచి ఉండే యమునాతీరాన్ని, పొదపొదలో వెతుకుతూ తనని గాలించే గోపెమ్మలను అందరినీ మరిచాడు. రాజులా గా వెలగిపోతున్నాడు. తనను మరువలేక ప్రతి క్షణం తన నామజపమే చేస్తూ, ఒళ్ళంతా కళ్ళై వేచి ఉన్న తనవారి చూపులకు అందనంద దూరంగా అందలాలెక్కి ఉన్నవాడు...
ఆ నల్లనయ్య ఇప్పుడు ఈ క్షణాన ఎదురుపడితే తనను గుర్తించలేకపోతే.....
ఎవరని అడిగితే...
ఇక తాను ఏమని చెపుతుంది..
ఏమని చెప్పాలి.....??
నల్లనయ్యా...ఎవరని అడిగావా నన్నూ..అంటూ తన నయనాల కరువు తీరా రోదించడం తప్ప!!

వలచిన హృదయం తానే నేనని, నేనే తానని నమ్ముకొని ఉండగా తాను వేరు, నేను వేరు అని అతనిచేత భావించబడి తిరస్కారానికి గురై తే పొందే వేదనను కృష్ణుడిపరంగా అన్వయిస్తూ రచించిన అతి చక్కని సాహిత్యం ఈ పాటలో మనం చూస్తాం.

ఈ పాట రచన దాశరథి.

సంగీతం చక్రవర్తి సమకూర్చగా పి. సుశీల తన కమ్మని కంఠంతో పాటకు
జీవం పోసారు

Monday, July 4, 2011

జీవితం స్వప్నసాగరతీరం...సాగనీ పయనం !!


జీవితం కొందరికి స్వప్నాల సాగరం!
మరికొందరికి దుఃఖకాసారం!
ఇంకొందరికి సుఖదుఃఖాల సమ్మేళనం!!
ఏదేమయినా మనిషి జీవితం నిరంతర ప్రయాణం.
భూత వర్తమాన కాలాల్లోంచి భవిష్యత్తుకి సాగే జీవన మార్గం లో మానవ జీవితం నడక,  ఎప్పుడూ నల్లేరుమీద బండి నడక కాదు. మిట్టపల్లాలు తట్టుకుంటూ సాగవలసిఉంటుంది. గడిచిన దారి కన్నా, ముందు దారిఎలా ఉంటుందోనన్న ఆసక్తే మనిషి లో జీవలక్షణాన్ని చూపే అంశం.
మనిషి ఎప్పుడూ భవిష్యత్తులోకి ఆసక్తిగా తొంగిచూస్తూ ఉంటాడు. ఉన్న స్థితినుంచి ఉన్నతమైన స్థితిలోకి పరివర్తన చెందడానికి అవకాశాలకోసం అన్వేషిస్తూ ఉంటాడు. పరిస్థితులు తన చేతులు దాటిపోతున్నాయనే అనుమానం వస్తే మాత్రం అశక్తతతో క్రుంగి పోతాడు. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఏమాత్రం ఆసరా దొరికినా బయటకి రావడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి కష్టాలలో ఉండే మనిషి తనలో ఆశని ప్రోది చేసుకోవడానికి ఆశ్రయించేది దైవం. ఆ దైవానికి ప్రతినిధుల్లాగ దైవమార్గాన్ని ప్రవచించే సద్గురువులను చేరుకుంటాడు. వేదాంత ప్రవచనాలు వింటాడు. కర్తవ్యవిమూఢత్వంతో  చేష్టలుడిగిన మనిషి ఈ హితవచనాలతో, కర్తవ్యపాలనను బోధించే ప్రవచనాలతో మానసికస్థైర్యాన్ని కూడగట్టుకుంటాడు. ఒక కొత్త ఆశావహమైన దృక్పథంతో బ్రతుకు మార్గంలో ప్రయాణిస్తాడు.
అపజయం నుంచి జయం వైపు సాగించే ఈ ప్రయాణంలో తన కన్నా ముందు వెళ్ళిన వారి అనుభవాలను తెలుసుకోవడం, వారు అనుసరించిన విధానాలను తాను కూడా ఆచరణలో పెట్టడం అనేది కూడా మనిషికి  తన ఆశయసాధనలో విజయం వరించడానికి సహాయపడుతుంది. అయితే ఈ విధంగా మనం అనుభవంలోంచి పాఠాలు నేర్చుకోవడానికి సహాయపడే వ్యక్తులు మన సమాజంలో పెద్దపేరున్న పెద్దమనుషులే కానక్కరలేదు అని, మనకన్నా  ఎంతో వైవిధ్యమైన జీవలక్షణాలున్న సృష్టిలోని అతి చిన్న జీవులు కూడా కావచ్చని తెలుసుకున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
జిమ్ రాన్ అనే గొప్ప తత్వవేత్త  ప్రతిపాదించిన వేదాంతం ' చీమ వేదాంతం'.
వేదాంతం లాంటి గొప్పవిషయాన్ని చీమలాంటి అల్పప్రాణికి ముడిపెట్టడం వింతగా తోచే విషయం కావచ్చు. కానీ అతను, చీమ తన జీవనయానంలో అనుసరించే విధానాలను మానవ జీవితానికి అనువర్తింపచేస్తూ ఇచ్చిన ఉదాహరణలు చూస్తే మనం కూడా అవుననక తప్పదు. చీమకి ' జై ' కొట్టక తప్పదు.
మనం  జీవితంలో విజయం సాధించాలంటే చీమ తన జీవితంలో అనేక పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తోందో గమనించి అదే రకమైన జీవితవిధానాన్ని మనం కూడా అవలంబించాలి, అంటారు జిమ్ రాన్. అందుకు అతను చెప్పిన నాలుగు సూత్రాలు చూద్దాం.
మొదటి సూత్రం ఇది!
చీమలు ఆహారం కోసం ఎంతో దూరాలు ప్రయాణిస్తాయి. ఒకదాని వెనుక ఒకటి అలా నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా దాని దారికి ఏదేనా అడ్డం వస్తే అది ఏం చేస్తుందో గమనించారా....కావాలంటే చీమలు ప్రయాణిస్తున్న దారిలో మీ వేలు అడ్డు పెట్టి చూడండి. ఆ చీమ ఎలా ముందుకు వెళ్తుందో గమనించండి. వేలు చుట్టూ తిరుగుతుంది. ముందుకు సాగడానికి దారులు వెతుకుతుంది.కానీ అక్కడే  నిలబడి  హారి భగవంతుడా!! నేనేం చేసేదిరా!! నాకేం దారిరా అని  దిక్కులు మాత్రం చూడదు.అంతగా ముందుకు పోయే  దారి దొరకకపోతే వేలు మీదనుంచి వెళ్ళిపోతుంది...కానీ వెనుకకు మాత్రం వెళ్ళదు.
మనం నేర్చుకోవలసిన గొప్ప సూత్రం ఇది. జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, మరి ముందుకు పోలేమన్నంతగా వేపుకు తినే పరిస్థితులు.  ఇక ప్రయాణం ఆపడమే పరిష్కారమేమోనన్నంతగా దిగజారిన పరిస్థితులు. సరిగ్గా ఈ స్థితిలోనే మనకి చీమ ఆదర్శం అవుతుంది. చీమ తన లక్ష్యం చేరుకోవడం కోసం ముందుకు సాగడం కోసం ఎంతగా తపిస్తుందో మనం ఆదర్శంగా తీసుకోవాలి. విన్ స్టన్ చర్చిల్ నెవర్ ...నెవర్..నెవర్ గివ్ అప్  అని చెప్పినా... సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడూ.... ఒప్పుకోవద్దురా ఓటమీ అని పాట పాడినా దాని  సారాంశం ఇదే.
చీమ జీవితం లో మనం గమనించవలసిన మరో ముఖ్యాంశం - మనందరం చిన్నప్పుడు విన్న కధే. చీమ, మిడత కథ. వసంతకాలం వచ్చిందని మిడత చాలా సంతోషంతో ఆటపాటలతో కాలం అంతా గడిపేస్తుంది. చీమ ఆ కాలంలో కూడా కష్టపడి పనిచేసి ఆహారం కూడబెట్టుకుంటుంది. ఇక వానాకాలం వచ్చాక మిడతకి ఆహారం దొరకదు. చీమ మాత్రం తను వేసవిలో కష్టపడి కూడపెట్టిన ఆహారంతో ఆనందంగా గడుపుతుంది.
జీవితంలో  కాలం విలువ ని అవగాహన చేసుకోవడానికి చెప్పే కథ ఇది. అవకాశాలు ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలి.
చీమకి తెలుసు - వేసవి సుఖంగా ఉండే కాలమే అయినా అది ఎక్కువకాలం ఉండదని, దానివెనుకే వచ్చే వర్షాకాలం తనకి చాలా ఇబ్బందులు కలిగిస్తుందని.

సరిగ్గా మనిషి గుర్తుంచుకోవలసిన విషయం కూడా ఇదే. అంతా మంచి కాలం నడుస్తోంది అనుకున్నప్పుడు కూడా ఇది శాశ్వతం కాబోదు అన్న జ్ఞానంతో ఉండడం ఎంతో అవసరం. మెరుపు మెరిసినంతకాలం సంతోషం కలిగినా పిడుగుపాటు పడే అవకాశం కూడా ఉందని తెలుసుకోవడం ఆ హెచ్చరికతో గడపడం మనిషికి అవసరం.
చీమ  తన జీవనవిధానంతో మనిషికి చెప్పే మరో పాఠం ఇది.
అలాగే చీమ జీవితం నేర్పే మూడో పాఠం -  ఏ సమయమూ శాశ్వతం కాదు.
జీవితంలో కష్టసుఖాలు  ఒకదానివెనుకే ఒకటిగా మనతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కష్టకాలం ఎప్పుడూ ఉండదు. కొంతకాలం ఇది గడిచిపోగానే సుఖించేకాలం వస్తుంది. గడ్డకట్టించే చలికాలం ఎంతో కష్టం కలిగించినా చీమలు అదిరిపోవు బెదిరిపోవు. వెలుగురేకలు విచ్చుకోగానే తొలికిరణాలు భూమిని తాకగానే కర్తవ్యనిర్వహణకి  నడుం కడతాయి. బిరబిరా పుట్టలనుండి బయటపడతాయి. తమ బాధ్యతని ఎప్పుడూ విస్మరించవు.
మనిషి కూడా చీమనుంచి నేర్చుకోవలసిన జీవన సూత్రం ఇది.
కష్టాలు కారుమబ్బుల్లా కమ్ముకొచ్చినవేళ దిగాలుపడిన దసరా బుల్లోడులా మొహం వేలాడేయకూడదు. సుఖం శాశ్వతం కానట్టే కష్టం కూడా శాశ్వతం కాదు అని మర్చిపోకూడదు. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని వదులుకోకూడదు.  జరగబోయేది మంచి అని గట్టిగా నమ్మి ముందుకు సాగాలి.
కలకాలం ఉండవు ఈ కన్నీళ్ళూ, కలలైనా, కలతైనా కొన్నాళ్ళూ..అని కవి చెప్పనే చెప్పాడు కదా..
చీమ నుంచి నేర్చుకోవలసిన సూత్రాలలో ఆఖరిది అతి ముఖ్యమైనది అని రాన్ చెప్పిన సూత్రం చూస్తే ,  గీతోపదేశం  గుర్తురాక మానదు.
భగవద్గీతలో పరమాత్ముడు బోధించిన  గొప్పమాట...నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. దాని ఫలితాలను గురించి ఆలోచించకు.
చీమ ఆనాటి అర్జునుడిలా ఈ గీతోపదేశ వాక్యాన్ని పాలిస్తుందా అనిపిస్తుంది.
నేను ఇంత చిన్న  చీమని, ఎంత ఆహారాన్ని తేగలను, ఎంత బరువు మోయగలను, ఎంతదూరం వెళ్ళగలను, వెళ్ళినా తిరిగి వస్తానా, నేను తెచ్చినదాన్ని నేనే తింటున్నానా, ఇతర చీమలు ఏం చేస్తున్నాయి, ఎంత తెస్తున్నాయి, నేను తేకపోతే ఏం, కొంప మునిగిపోతుందా ఇలా ఎన్ని రకాల ప్రశ్నలు వేసుకొని పని మానుకొనే అవకాశం ఉందో చీమకి.
కానీ ఏ చీమా ఇలాంటి పనికిరాని ప్రశ్నలతో కాలం గడిపినట్టు మనం చూడం. చీమ ఆహార సేకరణ అనే జీవితాశయం కోసం నిరంతరం శ్రమిస్తుంది. ఎంతో దూరం వెళ్తుంది, తన  ఆకారానికి ఎంత పరిమాణం ఆహారాన్ని  మోయగలనో లేనో అని అది దొరికినదాన్ని  వదిలిపెట్టదు.  బలవంతంగా శక్తినంతటినీ ఒడ్డి ఆహారాన్ని తన నివాసం వైపు ఈడ్చుకుని వెళ్తుంది. అవసరమైతే తన తోటి వారిని సహాయం అడిగి మరి ఆ పని నిర్వర్తిస్తుంది. ఈ పనిలో చీమ తన బరువుకి కనీసం 20 రెట్లబరువు గల ఆహారాన్ని మోసుకొని పోతుందిట. తను చెయ్యగలనా లేదా అని మాత్రం సందేహిస్తూ కూర్చోదు.

 నీ శ్రమని, తెలివితేటలని, సమయాన్ని పెట్టుబడిగా పెట్టు. ఫలితాలు ఎలా ఉంటాయి అని సందేహించకు. మంచి శ్రమకి,మంచి ఆలోచనకి, నూరుశాతం గారంటీ దొరుకుతుందని నమ్మి త్రికరణశుద్ధిగా కర్తవ్యాన్ని ఆచరించు అని చీమ జీవితం మనకి సందేశాన్నిస్తుంది.
జాన్ రాన్ చెప్పినట్టు చీమ జీవితంలో మనం తీసుకోవలసిన నాలుగు అంశాలు క్లుప్తంగా ...
అవరోధాలను లెక్కచేయకపోవడం,  ముందుచూపుతో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే శక్తిని కలిగి ఉండడం, భవిష్యత్తు పట్ల ఆశావహమైన దృక్పథం వహించడం, చేయగలిగినంత, చేతనైనంత ప్రతిభతో కర్తవ్యపాలన చేయడం తద్వారా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని,  సుఖ సంతోషాలమయమైన జీవితం మన స్వంతమవుతుందని మనసారా నమ్మడం.
ఎంత చక్కగా ఉంది కదూ ఈ చీమ వేదాంతం...
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు అన్నారు వేటూరి.
 జీవితసత్యాన్ని ఆవిష్కరించే విషయంలో  చీమయినా సరే మనిషికి మహా గురువు అంటే తప్పేముంది !!

Tuesday, June 21, 2011

తెలుగు పాటల తో 'రణం'(....కాదు- దోస్తీ) కడదామా !!


తెలుగు గుమ్మానికి పాటలతో తోరణం కడదాం రమ్మని ఒక్క పిలుపు వినబడగానే ముఖపుస్తకంలో తమని చూసుకుంటున్న తెలుగువాళ్ళు చాలామందికి కొత్త ఉత్సాహం వచ్చింది. కొద్దిగంటల వ్యవధిలోనే అందులో తమ పేరు నమోదు చేస్తున్న సభ్యుల సంఖ్య చూస్తే ఈ విషయం తెలుస్తోంది.

ఎక్కడైనా తెలుగు మాట వినబడితేనే పులకరించిపోయే స్థితి కలిగే దుస్థితి త్వరలో వస్తుందేమో నని దిగులుగా ఉంటోంది ఇటీవల చాలామందికి. తెలుగు మాటే కాదు, తెలుగులో పాటలు కూడా రాయాలన్న సరదా, రాసే సత్తా కూడా ఉన్న యువతరం ఎంతో ఉత్సాహంగా ఉందని, అవకాశం దొరికినప్పుడు తప్పకుండా స్పందిస్తారని నిరూపిస్తున్నారు ఈ తెలుగు పాటల  తోరణం సభ్యులు.

కవిత్వం అంటే కేవలం ప్రాసలు, పడికట్టుపదాలు వేస్తు వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి చెప్తే చాలనే అభిప్రాయం కొందరికి ఉంది. అల్లాటప్పాకవితలు చెప్పడమే ఓ గొప్పా అనే మాటదీనికి వర్తిస్తుందేమో కానీ నిజంగా భాష పట్ల, సాహిత్యం పట్ల గౌరవం ఉన్న వారు చెప్పే భావాత్మకమైన చిన్న వాక్యం కూడా గొప్ప కావ్యం ఇచ్చే అనుభూతిని ఇవ్వగలదు. వాక్యం రసాత్మకం కావ్యం అన్న మాట ఇటువంటి కవిత్వం పట్ల సార్థకమవుతుంది.

వెయ్యేళ్ళ మన తెలుగు సాహిత్యంలో నన్నయ  నుంచి గురజాడ వరకు చూస్తే  పద్యం - అత్యంత జనాదరణ పొందిన సాహిత్యప్రక్రియ. అనేక సాంఘిక,రాజకీయ,ఆర్థిక కారణాల వలన తెలుగు దేశంలో కూడా  భాష, సాహిత్యంలోకూడా మార్పు వచ్చింది. జనం మాట్లాడే భాషే, రాసే భాష కావాలనే వాదం ఊపందుకుంది. దీని ప్రభావం కవిత్వం మీద కూడా కనిపించింది. భావకవిత అనేవిధానం సాహిత్యంలో సంచలనం కలిగించింది. సంస్కృతపదాల మాయనుంచి విడిపడి ప్రతి భావాన్ని తెలుగులో చెప్పడానికి కావలసిన చక్కని పదజాలాన్ని మనకు అందించారు ఈ భావకవులు.

తెలుగులో చలన చిత్రాలు నిర్మించిన కొత్తలో ఇతరభాషలకు అనువాదాలుగా వచ్చిన కొన్ని చిత్రాలలో తెలుగుదనం కొంత కొరవడినా క్రమంగా తెలుగు సమాజంలో భావకవులుగా జనాదరణ పొందిన కవులు చాలామంది చిత్రసీమలో ప్రవేశించడం వలన సినిమా పాటలు కూడా  పెద్దగా పాండితీ ప్రకర్ష లేని  సామాన్యులు పాడుకోగలిగిన పాటలుగా, గుర్తుపెట్టుకోగల సాహిత్యంతో కనిపిస్తాయి.
క్రమంగా సమాజంలో వచ్చిన మార్పులు అనేకరంగాలలో ప్రభావం చూపినట్టే సినిమారంగం మీదకూడా చూపాయి. జనం కోరినది తీస్తున్నామని, వింటున్నది రాస్తున్నామని, నచ్చినదే ఇస్తున్నామని నమ్మబలుకుతూ సినీ రంగం విలువలకు తిలోదకాలిచ్చింది.  సాహిత్యంలో కూడా  విలువలు నానాటికీ దిగజారాయి.

కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పెరుగుట విరుగుట కొరకే అన్న సూక్తిలో నిజం ఉంది. కాలం దానిని నిరూపిస్తుంది కూడా.

కొంతకాలం క్రితం వరకు ఎంతో విలువైన కవిత్వం  రాసిన వాళ్ళు ఎంతో మంది ఉండిఉండవచ్చు. కానీ సమాచార రంగంలో వ్యాపారాన్నిమాత్రమే చూసిన కొన్ని పత్రికల ధోరణి వలన చాలామంది మంచి రచనలు మరుగున పడిపోయి ఉంటాయన్న విషయంలో అనుమానం లేదు.

కానీ ఇప్పుడు రోజులు మారాయి. సమాచారరంగంలో అద్భుతమైన మార్పులెన్నో చోటుచేసుకున్నాయి. మన అభిప్రాయాలను, ఆలోచనలను పదిమందితో పంచుకోవడానికి, మంచిచెడులను బేరీజు వేసుకోవడానికి ఇదివరకులా పత్రికలు మాత్రమే వేదికలు కాదిప్పుడు. అంతర్జాలరంగంలో ప్రతివారికి ఎన్నో అవకాశాలు.

 కంప్యూటర్లో రాయడం అంటే ఇంగ్లీషు తెలిసిన వాళ్ళే చేయాలనే దురభిప్రాయాన్ని పక్కన పెట్టి మాతృభాషలో మన ఆలోచనలు పంచుకోగలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయం మనకి తెలిసిన తర్వాత మరికొంత మందికి చెప్పాలి. వీటికి  కావలసినదల్లా కొద్దిగా ఓర్పు, సహనంతో చూపే నేర్పు, మరికొంత నిజమైన భాషాభిమానం. తప్పులు లేకుండా తెలుగు రాయడానికి మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం.

అంతర్జాలంలోని సాంకేతిక రంగం మనకు ఇచ్చిన గొప్పబహుమతి ఈ సమాచారమార్పిడి. ప్రపంచంలో ఏమూల ఉన్నా తక్షణం స్పందించే అవకాశం, మన అభిప్రాయాలను మనం కోరిన వ్యక్తికి వినిపించగల గొప్ప సాధనాలు ఇప్పుడు మన అరచేతిలో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుందాం.

ఇప్పుడు ఈ తెలుగు పాటల తోరణం  గుంపు - మీరు రాసిన కవితలను పదిమంది కాదు.....కొన్ని వందల, (వేలమంది?) తో పంచుకోవడానికి ఒక చక్కని అవకాశం.

మీలో కొందరు ఇదివరకే కవిత్వంలో అందె వేసిన చెయ్యి అయి ఉంటారు.
మరికొందరు ఔత్సాహికులు అయి ఉంటారు. రాయాలనే తపన ఎంతో ఉన్నా భావానికి రూపం కల్పించడంలో కొంత తికమక ఉండవచ్చు వీరి కవితలలో.
అయితే ఏం....

మొత్తంమీద తెలుగు భాషమీద గౌరవంతో, తెలుగు పాటమీద సరదా తోను ఈ వేదికమీదకు చేరిన వాళ్ళం కనుక మన అభిప్రాయాలన్నీ ఇచ్చిపుచ్చుకుందాం. ఒకరి భావాలనొకరు గౌరవించుకుందాం.

నచ్చితే మెచ్చడమే కాక నచ్చకపోతే కారణాన్ని కూడా సున్నితంగా చెప్పుకుందాం.

అలా చెప్పిన వారి మాటలోని భావాన్ని నొచ్చుకోకుండా పుచ్చుకుందాం.

మన కవితా శైలిని మెరుగుపరుచుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఈ వేదిక నిరూపిస్తుందని ఆశిద్దాం. 
తెలుగులో గేయాలు రాసేవాళ్ళయితే  ఇక్కడ  ఉన్నవారితో మీ అభిప్రాయాలు పంచుకోండి.

Monday, June 6, 2011

ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా


ఆరుద్ర - ప్లీడరు గుమాస్తా

ఆత్రేయ గారు రాసిన గీతం -పోలీసు వెంకట సామి - పోలీసు శాఖలో పనిచేసేవ్యక్తి ప్రేమికుడైతే తన  ప్రియురాలికి చెప్పే ప్రేమ కబుర్లు ఎలా ఉంటాయో, ఎలాంటి భాష వాడతాడో చూసాం కదా.

ఆత్రేయగారికన్నా ముందే ఆరుద్ర గారు కూడా ఇలాంటి ప్రయోగం చేసారు 1959లో 'మా ఇంటి మహాలక్ష్మి' చిత్రం కోసం.

ఇప్పుడు ఒక కోర్టు లో ప్లీడరు గారి దగ్గర గుమాస్తా గా పనిచేసే వ్యక్తి తన ప్రియురాలితో ఎలా మాట్లడతాడని ఆరుద్ర గారు ఊహించి రాసారో చూద్దామా.

పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు

అమ్మాయి అంటే తనకి ఇష్టం ఉందని చెప్పడానికి దస్తావేజు రాసి ఇస్తానని  చెప్తున్నాడు. అంటే తన హృదయం అనే ఆస్తిని ఆమెకి సమర్పించుకుంటున్నానని చెప్పే పత్రం రాసి ఇస్తాడుట.

                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ
                

ఇక్కడ సదరు అనే మాట కోర్టు భాషలో ఎంతో సహజమైన పదం. ఎవరైతే, ఏదైతే అలా అని చెప్పవలసి వచ్చినప్పుడు
సదరు అనే పదం వాడుతుంటారు కోర్టు భాషలో.

నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
తీసుకున్నై డిక్రీని నాపై

అతను ఆ అమ్మాయిని ప్రేమించడం అన్న విషయం కేసయితే...అందులో అతని అభిప్రాయం అనే విషయంతో ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి హృదయం, మనసు అనేవి ఎక్స్ పార్టీలుగా ఉండి అతని మనసును డిక్రీ చేసాయిట. అంటే ఆమెను తన ప్రమేయంలేకుండానే తనకు తెలియకుండానే ప్రేమించేసాడన్నమాట.

మీను లాంటి నీ కన్నులు అమీనై
జామీను లేని నా మదిని జప్తు చేసినై...

అంతే కాదు..ఇక్కడ కోర్టు వ్యవహారాలలో  అమీను అనే ఉద్యోగి ఉంటాడు.

తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నప్పుడు ఆ  అప్పును  చెల్లించలేకపోతే తాకట్టు పెట్టిన వస్తువుల మీద అప్పు ఇచ్చిన వారికి అధికారం వస్తుంది. ఆ విధమైన అధికారాన్ని కోర్టు  అప్పు ఇచ్చిన వారికి దాఖలు    చేస్తుంది. కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను  అమలు చేసే ఉద్యోగి ...కోర్టు అమీను.

ఇక్కడ ఆ ప్రేమించిన అమ్మాయి కళ్ళు -  'మీనులాంటీ నీ కన్నులు  అమీనై ' అంటే చేపల్లా ఉన్న ఆమె  అందమైన కళ్ళు కోర్టు  అమీను రూపం దాల్చి  ఏ విధమైన హామీ  లేని అతని ఆస్తి  అయిన మనసును అంటే అతని మదిని జప్తు చేసాయిట.


చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
మనకి రాదూ ఏ లిటిగేషన్....


ఇక  ఆమెని తను ప్రేమించడం అన్నది జరిగిపోయింది కనుక ఇద్దరూ ఒక  అవగాహనకి రావడం అనే దశకి వచ్చినట్టే.
అదే సెటిల్మెంట్. 

 ఇద్దరు ప్రేమించుకున్నాక  వారిద్దరూ కలిసి ఉండడానికి కావలసిన బంధం వివాహ బంధం. అందువలన ఆ వివాహ బంధం ఏర్పరచుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. దాన్ని అగ్రిమెంట్  అనే పదంతో సూచిస్తున్నారు కవి.

అంతేకాదు ఆ వివాహ బంధం వలన పొందవలసిన సౌఖ్యం అనేది తమ హక్కు దానిని సాధించడానికి కూడా ఓ పిటీషన్ వేయాలని అనుకుంటున్నాడు.

పెళ్ళి జరిగాక ఇద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే  వారు సంతోషంగా కలిసి ఉంటే   ఎవరికీ ఏ సమస్యా రాదని భావిస్తున్నాడు.
 అందుకే  అలా కలిసి ఉండగలిగితే   మనకి రాదు ఏ లిటిగేషన్ అంటాడు.

ఒకే భాష మాట్లాడే వ్యవహర్తలలో కూడా వారి వర్గ,ప్రాంత, మాండలిక భేదాలను బట్టి భాష వ్యవహారంలో అనేకమయిన మార్పులు కనిపిస్తాయి. వీటితో పాటు  భాషని ప్రభావితం చేసే అంశాలలో గమనించదగిన అంశం వృత్తి. ఒకో విధమయిన వృత్తిలో ఉండేవారికి  ఆ వృత్తికి సంబంధించిన పదాలతో కొన్ని పలుకుబడులు ఏర్పడి ఉంటాయి.  వారి భాషా వ్యవహారంలో అత్యంత సహజంగా ఆ పలుకుబడి ఒదిగిపోయి ఉంటుంది.
ఎంతో సునిశితమైన దృష్టి ఉంటే తప్ప భాషలోని ఈ అంశాన్ని గ్రహించడం కష్టం.

సినిమాలలో పాత్ర వేష భాషలను దృష్టిలో పెట్టుకుని ఆయా పాత్రలకు తగిన చిత్త  ప్రవృత్తిని గమనిస్తూ,  సందర్భోచితంగా పాటలు రాయడం తేలికైన పని కాదు.

ఆరుద్ర గారు రాసిన ఈ పాట ఒక హాస్య నటునిపై చిత్రించిన పాటే అయినా   కోర్టు గుమాస్తా అయిన ఆ పాత్ర ప్రేమలో పడితే అతని భాష ఎలా ఉంటుందో ఊహించి రాసిన విధానం  పాటల రచయితగా ఆరుద్ర  గొప్పదనాన్ని మరోసారి నిరూపిస్తుంది.

పాట మొత్తం సాహిత్యం ఇక్కడ


పల్లవి       నువ్వంటేనే నాకు మోజు 
                అలా రాసిస్తానే దస్తా వేజు
                  
                హృదిలోనే దాచాను ఎంతో ప్రేమ
                సదరు ప్రేమ నీ పైనే చక్కని భామ                       నువ్వంటేనే నాకు మోజు

చరణం       నీ మనసు నీ హృదయం ఎగస్పార్టీలై
                 తీసుకున్నై డిక్రీని నాపై
               
                 మీను లాంటి నీ కన్నులు అమీనై
                 జామీను లేని నా మదిని జప్తు చేసినై.                  నువ్వంటేనే నాకు మోజు       
  
చరణం       చేసుకుందాం నువ్వు నేను సెటిల్మెంట్
                 మారేజికి చేసుకుందాం అగ్రిమెంట్

                  సౌఖ్యానికి దాఖలు చేద్దాం పిటీషన్
                  మనకి రాదూ ఏ లిటిగేషన్....                               నువ్వంటేనే నాకు మోజు

                 
పాట రచన      ఆరుద్ర
గాయకుడు     పిఠాపురం
చిత్రం             మా ఇంటి మహాలక్ష్మి

సంగీతం           అశ్వత్ధామ

ఈ పాటను వినాలనుకుంటే  ఇక్కడ వినవచ్చు.